ముఠా అరెస్టు.. రూ.4.5 కోట్ల సరకు స్వాధీనం

by  |
ముఠా అరెస్టు.. రూ.4.5 కోట్ల సరకు స్వాధీనం
X

దిశ, ఏపీ బ్యూరో: రైతులకు నకిలీ క్రిమిసంహారక మందులు విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు రట్టు చేశారు. విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు వివరాల ప్రకారం.. ఖరీఫ్ సీజన్ వస్తుండడంతో రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విత్తనాలు చల్లిన రైతులు ఇకపై నాట్లు పెరిగేందుకు, దమ్ములో గడ్డి పెరగకుండా ఉండేందుకు, ఎటువంటి చీడపీడలు సోకకుండా ఉండేందుకు క్రిమిసంహారక మందులు కొనుగోలు చేస్తుంటారు. రైతుల అవసరాన్ని గుర్తించిన ఆరుగురు సభ్యుల ముఠా మాయ మాటలు చెప్పి సింజెంటా సంస్థకు చెందిన నకిలీ క్రిమి సంహారక మందులను రైతులకు అంటగడుతోంది.

సీజన్ కావడంతో నకిలీ విత్తనాలపై నిఘా ఉంచిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు రాము సింజెంటా సంస్థలో గుమస్తాగా పని చేస్తున్నారు. ఆయన సోదరుడు మూర్తి కూడా అదే సంస్థలోని గోడౌన్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. వీరద్దరూ మరో నలుగురితో కలిసి హైదరాబాదు నుంచి నకిలీ మందులు తయారు చేసేందుకు అవసరమైన ముడి సరకు తీసుకొచ్చి, గుంటూరులోని ఫార్చ్యూన్ హోమ్ కేర్ ఇండస్ట్రియల్ ప్లాస్టిక్ కంపెనీ కేంద్రంగా… సింజెంటా కంపెనీ పేరుతో నకిలీ క్రిమిసంహారక మందులు భారీ ఎత్తున తయారు చేసి, ప్యాక్ చేసి రైతులకు విక్రయిస్తున్నారు. అలాగే సింజెంటా సంస్థకు చెందిన కాలం చెల్లిన (ఎక్సైపైర్డ్) మందులు విక్రయించి భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి 4.5 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు.

Next Story

Most Viewed