పాతబస్తీలో దారుణం.. విడాకులు ఇప్పించి అక్కాచెల్లెళ్లపై అత్యాచారం

by  |
పాతబస్తీలో దారుణం.. విడాకులు ఇప్పించి అక్కాచెల్లెళ్లపై అత్యాచారం
X

దిశ, చార్మినార్: మూడనమ్మకాల పేరుతో మాయల మాంత్రికుల చేతిలో పాతబస్తీకి చెందిన ఎందరో మగువలు బలవుతున్నారు. మంత్రాల నేపంతో వైద్యం చేస్తానని తల్లికి తాయత్తు కట్టి ఆమె ఇద్దరు కూతుళ్లను మాయమాటలతో బురిడీ కొట్టించాడు. మొదట పెద్దకూతురుపై కన్నేసిన మాంత్రికుడు ఆమె భర్తతో ఆమెకు విడాకులిప్పించాడు. వాళ్ల ఇల్లు వాస్తుకు లేదని, ఇల్లు అమ్మించి వేసి కొంత డబ్బులను నొక్కేశాడు. మాయమాటలతో బండ్లగూడలోని ఓ అద్దె ఇంటికి అక్కా చెల్లెల్లెను రప్పించి అత్యాచారం చేయసాగాడు. తండ్రికి భూత వైద్యంలో సహాయకుడిగా ఉండే కొడుకు కూడా అక్కపై అత్యాచారానికి పాల్పడేవాడు.

వారి అరాచకాలను ఆలస్యంగా గుర్తించిన అక్కా చెల్లెల్లు తల్లితో కలిసి తండ్రీ కొడుకులపై చాంద్రాయణగుట్ట పోలీస్​స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డ తండ్రీకొడుకులను అరెస్ట్​ చేసి రిమాండ్‌కు తరలించారు. చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్, ఫలక్‌నుమా ఏసీపీ మాజిద్, చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్​కేఎన్​ప్రసాద్​వర్మ, డిటెక్టివ్​ ఇన్‌స్పెక్టర్​ వీరయ్యలు వివరాలను వెల్లడించారు.

చంచల్‌గూడ రహమతియా స్కూల్‌కు చెందిన సయ్యద్​ హసన్​ అస్కరి(52) చెప్పుల వ్యాపారంతో పాటు భూతవైద్యం చేస్తుంటాడు. అతనికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య పిల్లలు మలక్‌పేట‌లో నివాసముంటుండగా, రెండవ భార్య పిల్లలు రెయిన్‌బజార్‌లో నివసిస్తున్నారు. పెద్ద భార్య కుమారుడు ఓల్డ్​మలక్‌పేట వాహెద్‌నగ‌ర్‌కు చెందిన సయ్యద్ అఫ్రోస్(23) రైతుబజార్‌లో పనిచేస్తుంటాడు. భూతవైద్యంలో తండ్రికి సహాయం చేసేవాడు.

ఈ క్రమంలోనే కిషన్​బాగ్‌‌కు చెందిన మహిళకు ఆరోగ్యం క్షీణించడంతో అతని సోదరుడు 2005లో సయ్యద్​హసన్​అస్కరి అనే భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పట్లో ఆమెకు వైద్యం పేరుతో ఆమె కుటుంబానికి దగ్గర అయ్యాడు. ఆ మహిళకు ఇద్దరు కూతుళ్ళు, కుమారుడు సంతానం. పెద్దకుమార్తె (32), చిన్న కుమార్తె (23)లు ఉన్నారు. భూతవైద్యుడు సయ్యద్​హసన్​అస్కరి వైద్యంతోనే ఆమెకు ఆరోగ్యం నయమైనదని ఆ కుటుంబం విశ్వసించసాగారు. ఈ నేపధ్యంలోనే అతను తరచూ వాళ్ల ఇంటికి వచ్చి వెళ్ళేవాడు.

ఈ క్రమంలో ఆమె పెద్ద కూతురుపై కన్నేసిన భూతవైద్యుడు ఆమెకు మాయమాటలతో బురిడీ కొట్టించసాగాడు. ఎలాగైనా ఆమెను లోబరుచుకోవాలని ప్రయత్నించసాగాడు. 2015లో ఆమెకు మరో యువకుడితో పెళ్ళైన విషయాన్ని జీర్ణించుకోలేక పోయిన భూతవైద్యుడు ఎలాగైనా విడగొట్టాలని కుట్రలు కుతంత్రాలకు పాల్పడ్డాడు. నీ మొగుడి కారణంగానే నీ ఆరోగ్యం దెబ్బతిన్నదని మాయమాటలతో నమ్మించాడు. చివరకు 2016లో ఆమె భర్తకు విడాకులు ఇప్పించాడు. కిషన్​బాగ్‌లో ఉన్న ఇంటిని విక్రయించగా వచ్చిన కొంత డబ్బును కూడా ఈ భూత వైద్యుడు వాడుకున్నాడు.

అక్కా చెల్లెల్లను కిషన్‌బాగ్ నుంచి బండ్లగూడ తులసీనగర్‌లో అద్దె ఇంటికి మకాం మార్పించాడు. అప్పటి నుంచి అక్కా చెల్లెల్లను మాయమాటలతో లోబరుచుకున్నాడు. ఇద్దరిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. భూతవైద్యుడు సయ్యద్ హసన్‌తో పాటు పెద్ద కుమారుడు సయ్యద్​అఫ్రోస్​ కూడా అక్కపై అత్యాచారం చేయసాగాడు. అతని మాయమాటలలో పడ్డ ఇద్దరు అక్కా చెల్లెల్లు ఇల్లు అమ్మగా తీసుకున్న డబ్బులు ఇవ్వమని ఎన్ని సార్లు అడిగినా సయ్యద్​హసన్​అస్కరి డబ్బులు ఇవ్వలేదు.

దీంతో తమను మాయమాటలతో మోసగించాడని ఆలస్యంగా గ్రహించిన అక్కా చెల్లెల్లు జరిగిన విషయం అంతా తల్లికి చెప్పారు. ముగ్గురు కలిసి తండ్రి సయ్యద్ హసన్ అస్కరి(భూతవైద్యుడు), కొడుకు సయ్యద్​అఫ్రోస్‌ల అరాచకాలపై చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసంతో పాటు అత్యాచారం కేసులు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి భూతం వైద్యంకు సంబంధించిన సామాగ్రి, మూడు తాయత్తులు, జీడిగింజలు, సాంబ్రాని పొడి తదితర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Next Story

Most Viewed