అమ్మకానికి ఫేస్‌బుక్ యూజర్ల డేటా.. డార్క్‌వెబ్‌లో ప్రత్యక్షం

by  |
అమ్మకానికి ఫేస్‌బుక్ యూజర్ల డేటా.. డార్క్‌వెబ్‌లో ప్రత్యక్షం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరోసారి డేటా లీక్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఫేస్‌బుక్ యూజర్లకు చెందిన డేటాను డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టారు. 267 మిలియన్ మంది యూజర్ల డేటాను అమ్మకానికి పెట్టిన వెంటనే అమ్ముడుపోయినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘సైబుల్’ వెల్లడించింది. 26 కోట్ల మంది ఐడీలు, పూర్తి పేర్లు, ఈమెయిల్ అడ్రస్‌లు, వ్యక్తిగత అడ్రస్‌లు, వయసు, రిలేషన్‌షిప్ స్టేషన్, ఫోన్ నెంబర్లు వంటి వివరాలన్నీ కలిసి ఒక ప్యాకేజీ రూపంలో ‘డార్క్‌వెబ్’లో విక్రయించినట్లు సదరు సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. ఫేస్‌బుక్‌లో ఉపయోగించే థర్డ్ పార్టీ యాప్స్‌లోని లోపాల ఆధారంగా ఈ డేటాను సేకరించి అమ్మేసి ఉంటారని సైబుల్ అభిప్రాయపడుతోంది. ఇప్పటికే ఈ డేటా మొత్తం అమ్మేశారని సైబుల్ ధృవీకరించింది. అసలు విషయం ఏంటంటే 26 కోట్ల మంది యూజర్ల డేటాను కేవలం రూ. 41,600 (543 డాలర్లు)కే అమ్మేశారట. అత్యంత కఠినమైన భద్రత నియమాలు పాటించే ఫేస్‌బుక్ డేటాను తస్కరించడమే కాకుండా.. మరీ ఇంత చీప్‌గా అమ్మేయడంపై అనుమానాలు నెలకొన్నాయి. గతంలోనే ఫేస్‌బుక్ డేటా లీక్ కుంభకోణంలో ఇరుక్కొని అనేక ఆరోపణలు ఎదుర్కొంది. ఏకంగా అమెరికా కాంగ్రెస్ విచారణను కూడా ఎదుర్కోవాలసి వచ్చింది. ఇప్పుడు ఈ తాజా డేటా లీక్‌పై మాత్రం ఫేస్‌బుక్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. కాగా, ప్రస్తుతం లీకైన డేటాతో సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడవచ్చని సైబుల్ హెచ్చరిస్తోంది. డేటా మొత్తం అమ్మినా పాస్‌వర్డ్స్ మాత్రం చోరీ కాకపోవడం వల్ల ఆ డేటాను ఉపయోగించి డూప్లికేట్ అకౌంట్లు క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :Facebook, Social Media, Dark Web, Profile Details, Sold Out, Cyber Attack, Cybul


Next Story

Most Viewed