సొంతంగా ఫేస్‌బుక్ సుప్రీంకోర్టు

by  |
సొంతంగా ఫేస్‌బుక్ సుప్రీంకోర్టు
X

సోషల్ మీడియాలో పోస్టులు, అభిప్రాయాల కారణంగా ఎన్నో సమస్యలు తలెత్తుతుండటంతో.. ఏ కంటెంట్ ఉంచాలి? ఏ కంటెంట్ తీసేయాలి? ఉంచితే ఎందుకు ఉంచారు? తీసేస్తే ఎందుకు తీసేశారు? అనే విషయాల గురించి ఫేస్‌బుక్ గత కొన్నేళ్లుగా సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమస్య పరిష్కారం కోసం ఓ ప్రత్యేక బోర్డ్ ఉండాలని వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ 2018లోనే అనుకున్నారు. కానీ, అమల్లోకి తీసుకురాలేకపోయారు. ఎట్టకేలకు బుధవారం ‘20 మంది సభ్యులతో ఓవర్‌సైట్ బోర్డును నియమించుకున్నట్లు’ ఫేస్‌బుక్ తమ బ్లాగులో తెలిపింది. ఈ బోర్డు ఫేస్‌బుక్‌కు ఒక సుప్రీం కోర్టులాగా పనిచేస్తుందని పేర్కొంది.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలలో పోస్టులు, పేజీలు, ప్రొఫైళ్లు, గ్రూపులు, ప్రకటనలకు సంబంధించిన వివాదాలను ఈ బోర్డు పరిశీలించి, సంబంధిత పోస్టు ఉండాలా? తీసేయాలా? ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను నిర్ణయిస్తుంది. ఈ వివాదాల మీద ఓవర్‌సైట్ బోర్డుదే తుది నిర్ణయం. ఇందులో మార్క్ జుకర్‌బర్గ్ కల్పించుకోవడానికి కూడా వీలు లేదు. యూజర్లు.. కేసులను ఫేస్‌బుక్‌కుగానీ ఈ బోర్డుకుగానీ పంపించవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను కూడా పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే పరిష్కరించే అర్హత ఉన్న కేసులను మాత్రమే బోర్డు స్వీకరిస్తుంది. ఈ 20 మందికి ఫేస్‌బుక్ సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదు. వారు పూర్తిగా సామాజిక రంగాల్లో నిపుణులైన థర్డ్ పార్టీ వ్యక్తులు. కాబట్టి నిర్ణయంలో గానీ, తీర్పులో గానీ ఎలాంటి తారతమ్యాలు ఉండకుండా ఈ బోర్డ్ అందరికీ సరైన నిర్ణయాన్నే తీసుకుంటుందని ఫేస్‌బుక్ బ్లాగులో ప్రస్తావించింది.

Next Story

Most Viewed