తెలంగాణలో మెడికల్ పీజీ ప్రవేశాలకు గడువు పొడిగింపు

by  |
తెలంగాణలో మెడికల్ పీజీ ప్రవేశాలకు గడువు పొడిగింపు
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలోని వైద్య కళాశాలల్లో పీజీ కోర్సుల్లో చేరడానికి ఆగస్టు 31వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణలోని ప్రైవేటు వైద్య కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన సుప్రీంకోర్టు ఆగస్టు 31వ తేదీ వరకు అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించవచ్చని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం, కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యలాయం ఇచ్చిన అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ తెలంగాణ ప్రైవేటు వైద్య కళాశాలలు ఈ పిటిషన్‌ను దాఖలు చేశాయి.

పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ హెల్త్ వర్శిటీ చాలా తక్కువ గడువు మాత్రమే ఇచ్చాయని, దీంతో ప్రవేశాల ప్రక్రియకు తగిన సమయం లేదని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో తక్కువ సమయంలో అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయడం సాధ్యం కాదని, చాలా పరిమితుల నడుమ ఇంత తక్కువ సమయం సరిపోదని వాదించాయి. పిటిషన్‌లు లేవనెత్తిన వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, పీజీ కోర్సుల్లో విద్యార్థులు ప్రవేశం పొందడానికి చాలా రకాలుగా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వం, హెల్త్ వర్శిటీ విధించిన గడువు సరిపోదని, విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని వ్యాఖ్యానించింది. పీజీ కోర్సుల్లో చేరడానికి గడువును ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి, వైద్య వర్శిటీకి ఆదేశాలు జారీ చేసింది.


Next Story

Most Viewed