వరుసగా పదకొండవ నెలలోనూ పెరిగిన భారత ఎగుమతులు!

by  |
business
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది అక్టోబర్ నెలకు సంబంధించి భారత మొత్తం ఎగుమతులు రూ.4.02 లక్షల కోట్లతో వరుసగా 11వ నెలలో పెరిగాయి. ఇది గతేడాదితో పోలిస్తే 35.16 శాతం వృద్ధి అని సోమవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో దిగుమతులు రూ.5.06 లక్షల కోట్లతో 57.32 శాతం వృద్ధి సాధించాయి. సరుకులు, ప్రధానంగా ఇంజనీరింగ్ వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, పెట్రోలియం, కాఫీ, కెమికల్స్, ఇతర వస్తువులకు అధిక డిమాండ్ వృద్ధికి దోహదపడిందని గణాంకాలు తెలిపాయి.

కరోనాకు ముందు 2019, అక్టోబర్‌తో పోలిస్తే ఎగుమతుల వృద్ధి 36 శాతం పెరిగింది. దిగుమతులు కరోనాకు ముందునాటితో పోలిస్తే 45.7 శాతం పెరిగినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే వాణిజ్యలోటు సెప్టెంబర్‌లో రూ.1.68 లక్షల కోట్లకు చేరిన తర్వాత అక్టోబర్‌లో రూ.1.46 లక్షల కోట్లకు తగ్గింది. ఇక, ప్రసుత ఏడాది ఏప్రిల్-అక్టోబర్ మధ్య మొత్తం ఎగుమతులు(వస్తువులు, సేవలు కలిపి) రూ.27.47 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇది 39.83 శాతం వృద్ధి. కరోనా ముందునాటి కాలంతో పోలిస్తే 19.97 శాతం ఎక్కువ. అలాగే ఈ ఏడాది ఏప్రిల్-అక్టోబర్ మధ్య దిగుమతులు రూ.30.44 లక్షల కోట్లతో 63.64 శాతం పెరుగుదల నమోదైనట్టు మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి.



Next Story

Most Viewed