కార్పొరేట్ స్కూల్స్‌లో కలెక్షన్ ‘కింగ్’.. పాఠ్యపుస్తకాల పేరుతో దోపిడీ

by  |
కార్పొరేట్ స్కూల్స్‌లో కలెక్షన్ ‘కింగ్’.. పాఠ్యపుస్తకాల పేరుతో దోపిడీ
X

దిశ,గోదావరిఖని : ఓ కార్పొరేట్ పాఠశాల కలెక్షన్స్ కింగ్‌గా మారిందనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక్క వివాదంతో పాఠశాల కొనసాగుతున్నా, సంబంధించిన శాఖ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అడ్డగుట్టపల్లి‌లోని ఓ కార్పొరేట్ పాఠశాల వేల రూపాయలను ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వసూళ్లు చేయడమే కాకుండా పుస్తకాల పేరుతో సైతం దందా నిర్వహిస్తు దోపిడీకి పాల్పడుతున్నా, అధికారులు పట్టించుకోవడంపై బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇలా ఉంటే కొంతమంది అధికారుల కనుసన్నల్లోనే పాఠశాలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా ఈ కార్పొరేట్ పాఠశాలపై ఫిర్యాదు చేస్తే ఓ అధికారి వెంటనే పాఠశాల యాజమాన్యం‌కు సమాచారం అందిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఆయా అధికారిపై కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు ఫిర్యాదులను సైతం ఉన్నతాధికారులకు చేయడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఇలాగే సదరు కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం కరోనా సమయంలోను ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి ఇబ్బందులకు గురి చేయడంతో పాఠశాలలో ఆందోళనలు చేసిన సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. అంతే కాకుండా సదరు పాఠశాల యాజమాన్యం అడ్మిషన్ల పేరుతో టీచర్లకు టార్గెట్‌లు పెట్టి కరోనా సమయంలో క్యాపనింగ్ నిర్వహించి వివాదాస్పదంగా మారింది. టార్గెట్ పూర్తి చేయలేదని, ఫీజులు వసూలు చేయడం లేదని కొంతమంది టీచర్లను గతంలో ఫోన్‌లో బూతులు తిట్టిన ఘటనలు ఉన్నాయి. ఇలా ఏదో ఒక్క వివాదం జరగడం వెంటనే సదరు బ్రాంచ్ నుండి ప్రిన్సిపాల్‌ను మార్చడం యాజమాన్యం‌కు పరిపాటిగా మారిందని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు అనుకుంటున్నారు. అయితే కొంత మంది అధికారుల ఆధినంలో తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గదుల నిండా పుస్తకాలే..

గోదావరిఖని అడ్డగుట్టపల్లికి చెందిన ఓ కార్పొరేట్ పాఠశాల కొంత దూరంలో ఓ ఇల్లును అద్దెకు తీసుకుని గదుల నిండా పాఠశాలకు సంబంధించిన అనుమతి లేని పుస్తకాలను నింపి పెట్టినా అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్ధి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. పాఠశాల ఒక్క చోట నిర్వహిస్తు మరో చోట పుస్తకాల గోదాంను నిర్వహిస్తుంది. గతంలో ఇలాగే పుస్తకాలు విక్రయించడంతో విద్యార్థి సంఘాలు నాయకులు ఆందోళనలు నిర్వహించారు. అయిన తీరు మార్చుకోకుండా మరో దగ్గరికి మార్చి అధిక ధరలకు విద్యార్థుల తల్లిదండ్రులకు విక్రయిస్తూ దోపిడీకి గురి చేస్తున్నారని పలువురు వాపోతున్నారు.

ఇన్ఫార్మర్ల పాఠశాల..

ఎవరైనా సదరు కార్పొరేట్ పాఠశాలకు సంబంధించి సరైన అనుమతి లేదనో, పుస్తకాలు అక్రమంగా విక్రయిస్తున్నారనే లేక వేరే ఏదైనా కారణాలతో అయిన కార్పొరేట్ పాఠశాలకు ఎవరైనా వెళ్లాడమే ఆలస్యం తమ ఇన్ఫార్మర్ల తో వారికి ఫోన్లు చేయించి సదరు పాఠశాల మనవాళ్లదే అక్కడి నుండి వెళ్లిపోండి అంటూ సమాచారం చెరవేస్తారు. ఎవరైనా కాదని ఫిర్యాదులు చేస్తే ముందుగానే సదుర్కొని తమ పైరవీలను ఉపయోగిస్తారు. లేదంటే తమకు వాళ్లు తెలుసు వీళ్లు తెలుసు అంటూ కొంతమంది పేర్లతో యథేచ్ఛగా నియమ నిబంధనలను తుంగలో తొక్కుతూ వాళ్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

Next Story

Most Viewed