మద్యం దుకాణాలకు టెండర్లు.. సర్కారు కొత్త పాలసీపై ఉత్కంఠ

by  |
liquor sales
X

దిశ, భద్రాచలం : డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం దుకాణాలు రాబోతున్నాయి.‌ ప్రస్తుతం నడుస్తున్న మద్యం దుకాణాల గడువు అక్టోబర్ 31న ముగియాల్సి ఉండగా, కొవిడ్ లాక్‌డౌన్ కారణంగా నష్టాలు వచ్చాయని వ్యాపారులు చెప్పడంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం గడువును నవంబర్ 30 వరకు పొడిగించింది. ఈలోపే విధి విధానాలు ప్రకటించి టెండర్ల ప్రక్రియ పూర్తిచేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే రెండేళ్ళ కాలానికి సంబంధించిన కొత్త మద్యం పాలసీ ఎలా ఉండబోతుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మద్యం వ్యాపారంలో దశాబ్దాల అవుభవం కలిగిన వారికి లాస్ట్‌టైమ్ లాటరీలో దుకాణాలు దక్కలేదు. దీంతో గత లోపాలు సరిచేసుకొని ఈసారి ఎలాగైనా మద్యం దుకాణాలు దక్కించుకోవాలనే పట్టుదలతో పలువురు వ్యాపారులు కనిపిస్తున్నారు. క్రిందటిసారి దుకాణాలు రావడంతో షాపుల కంటే బెల్ట్‌షాపుల్లోనే అన్నిరకాల మద్యం అందుబాటులోకి తెచ్చి అధిక ధరలకు వ్యాపారులు విక్రయించారు. దీంతో అధిక లాభాలు అర్జించిన వ్యాపారులు ఈసారి రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. దీనికి తోడు కొత్తగా మద్యం వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి పలువురు ఆసక్తి చూపుతున్నట్లుగా సమాచారం.‌ ఎత్తులు, పొత్తుల సమీకరణాల్లో మద్యం వ్యాపారులు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు.

కొత్త మద్యం పాలసీపై సర్వత్రా ఉత్కంఠ..

కొత్త మద్యం పాలసీ ఎలా ఉంటుందో అని మద్యం వ్యాపారులు ప్రభుత్వ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.‌ ప్రభుత్వం గత పాలసీ ప్రకారం 5 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాలకు ఏడాదికి రూ 50 లక్షలు, 5 వేలు-50 వేలలోపు రూ 55 లక్షలు.. ఇలా జనాభా పెరిగిన కొద్దీ లైసెన్స్ ఫీజును నిర్ణయించి వసూలు చేసింది. అయితే కొత్త మద్యం పాలసీలో లైసెన్స్ ఫీజు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈసారి మద్యం దుకాణాల సంఖ్య కూడా పెరిగే చాన్స్ ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం.

మద్యం అమ్మకాలు జోరుగా సాగే ప్రాంతాల్లో కొత్త దుకాణాలు నెలకొల్పేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. భద్రాచలం జిల్లాలో ప్రస్తుతం 76 దుకాణాలు ఉండగా, మరో 10 నుంచి 15 దుకాణాలు కొత్తగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. భద్రాద్రి జిల్లాలో దరఖాస్తుల రూపంలో క్రిందటిసారి రూ. 44 కోట్ల ఆదాయం రాగా, దరఖాస్తు ఫీజు పెంపు, దుకాణాల పెంపు వలన ఈసారి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

దరఖాస్తుదారుల కోసం వేట..

ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు మాత్రమే మద్యం షాపులకు టెండర్లు దాఖలుచేసే అవకాశం ఉన్నందున ఏ క్షణంలోనైనా మద్యం పాలసీ వెలువడవచ్చుననే ఉద్దేశంతో మద్యం వ్యాపారులు ముందుచూపుతో దరఖాస్తుదారుల వేటలో నిమగ్నమయ్యారు. దుకాణం వస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పెట్టని బుద్ధిమంతుల కోసం వ్యాపారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఓకే అనుకున్న వారికి అవసరమైన సర్టిఫికెట్లు ఇప్పించే పనిలో వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తోంది.

హుజూరాబాద్ ఎన్నికలు ముగియగానే కొత్త మద్యం పాలసీ వెలువడుతుందని అంతా భావిస్తున్నారు. నవంబర్ 15-20 తేదీకల్లా టెండర్, లాటరీ ప్రక్రియ పూర్తిచేయడానికి అధికారులు ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా సమాచారం. మద్యం దుకాణం ఏర్పాటు కోసం పీసా కమిటీ తీర్మానం చేయాల్సి ఉన్న కారణంగా కమిటీలు లేనిచోట కొత్త పీసా కమిటీల ఏర్పాటులో గ్రామ పంచాయతీ అధికారులు తలమునకలయ్యారు. మద్యం దుకాణాలకు సంబంధించిన అధికార ప్రక్రియ అంతా చకచకా జరిగిపోతోంది.



Next Story

Most Viewed