ఆ నైతిక హక్కు కేసీఆర్ కు లేదు: ఈటల రాజేందర్

by  |
ఆ నైతిక హక్కు కేసీఆర్ కు లేదు: ఈటల రాజేందర్
X

దిశ,జడ్చర్ల/ రాజపూర్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఏడేళ్ల కాలంలో ఏ నాడు రైతుల నుండి ఒక్క వడ్ల గింజకూడ కొనలేదని, కొన్నది మొత్తం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం మహాబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఈద్గాన్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానందుని విగ్రహాన్ని జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రైతుల ముందు కపట నాటకాలు ఆడుతున్నారని అన్నారు. యాసంగి వడ్లు కేంద్రం కొనడం లేదని రాజకీయ ఆరోపణలు చేస్తున్న కేసీఆర్ ఏడేళ్ల కాలంలో రాష్ట్ర సర్కారు రైతుల నుండి కొనుగోలు చేసిన వడ్లు ఎన్ని అని ప్రశ్నించారు.

ఏడేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వమే రైతుల వడ్లు కొనుగోలు చేస్తే, వాటిని రాష్ట్రమే కొంటున్నదని ఓట్ల కోసం అబద్దాలు చెప్పిన ఘనత ఆయనదే అన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఓట్ల ముందు ఓడమల్లయ్య, ఓట్లు దాటాక బోడమల్లయ్య అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. దీన్ని గుర్తించిన హుజూరాబాద్ ఓటర్లు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పారని అన్నారు. ఇదే ఫలితాలు వచ్చే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కేసీఆర్ కు ఓట్లు అడిగే హక్కు లేదని, టీఆర్ఎస్ పార్టీని గద్దే దించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు.

డీకే అరుణ మాట్లాడుతూ.. త్వరలోనే సీఎం కేసీఆర్ అవినీతి బట్ట బయలు అవుతుందని అన్నారు. హుజూరాబాద్ ఎలక్షన్ లో ఈటల రాజేందర్ ను ఓడించడానికి ప్రత్యేక జీవో తీసుకువచ్చి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టారని, అయినా ప్రజలు బీజేపీ ని ఆదరించారని అన్నారు. ఇక పై కేసీఆర్ ఎన్ని దొంగ పాచికలు వేసినా రాష్ట్రంలో కేసీఆర్ నాటకాలను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాల్లో పాల్గొన్న వారి పై నేడు కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని విమర్శించారు.

రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ వీరబ్రహ్మచారి, జిల్లా ఉపాధ్యక్షుడు రాజేష్, మహిళా మోర్చ ప్రధాన కార్యదర్శి సాహితి, మండల బీజేపీ ప్రెసిడెంట్ కావలి రామ, బీజేపీ ఓబీసీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ గౌడ్, నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలు తధితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed