ధనవంతులు కావాలంటే అదొక్కటే మార్గం: ఈటల

by  |
ధనవంతులు కావాలంటే అదొక్కటే మార్గం: ఈటల
X

దిశ, కరీంనగర్: ప్రభుత్వం చెప్పిన పంటలను సాగు చేస్తే ప్రతి ఒక్క రైతు దండిగా సంపాదించడం ఖాయమని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇలా చేస్తేనే రానున్న కాలంలో రైతులు ధనవంతులు అవుతారని హితవు పలికారు. కరీంనగర్ కలెక్టరేట్‎లో పంటల సాగుపై మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి జలాలు కరీంనగర్‎ను ముద్దాడడంతో రైతులు సంతోషంగా ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ, ఎల్.ఎం.డి ద్వారా చెరువులు నింపేందుకు తూములు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే, మిడ్‌మానేరు, లోయర్ మానేరు ప్రాజెక్టుల దిగువ భాగంలో ఎక్కడెక్కడ కాలువ పూడికతీత పనులు ఆగిపోయాయో.. అవి కూడా పూర్తి చేసి రైతులకు నీళ్లందిస్తామని ఈటల భరోసా ఇచ్చారు. ఏ సమయంలో ఏ పంట వేయాలో సీఎం సమావేశం తర్వాత స్పష్టత ఇస్తామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మినిస్టర్ గంగుల కమలాకర్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed