నా నెక్ట్స్ టార్గెట్ అదే.. ఈటల సంచలన నిర్ణయం

by  |
Etala Rajender
X

దిశ, కమలాపూర్: నవంబర్ 2వ తేదీన హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా అగ్గి పెట్టి, కేసీఆర్ పార్టీని కూల్చే ప్రయత్నం చేస్తానని బీజేపీ హుజురాబాద్ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన వ్యా్ఖ్యలు చేశారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శ్రీరాములపల్లి, అంబాల, నేరెళ్ల, గూడూరు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఒకనాడు కేసీఆర్ మాట్లాడితే తెలంగాణ పలకరించేదని, అడుగులో అడుగేసేదని, కానీ, ఇప్పుడు కేసీఆర్‌ను ఎవరు ఎక్కువ తిడితే వారికి చప్పట్లు కొడుతున్నారని అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రగతి భవన్‌లో కూర్చొని కుట్రలు, కుతంత్రాలు చేసి హరీష్ రావుకి కత్తి ఇచ్చి నన్ను పొడిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ పంచే పైసలు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావువి కాదని, మన పైసలే అని అన్నారు. మన పైసలే మనకు ఇస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో పోరాటం చేసి, కేసులు, జైలుకు వెళ్ళిన ఒక బక్కపలచని వ్యక్తిని అయిన తనపై ఇంతమంది ఐదు నెలల నుండి ఉద్యమం చేస్తున్నారని అని మండిపడ్డారు.

‘దళితబంధు’ ఆపాలని అబద్ధపు ఉత్తరాలు సృష్టించి నాపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే, ఎన్నికల కమిషన్ చెంప చెల్లుమనిపించింది అని తెలిపారు. అలాగే ఈటల కేసీఆర్ కాళ్లమీద పడి క్షమించాలని కోరినట్లు మరో ఉత్తరం సృష్టించారని, ఈటల అనేటోడు చావనైనా చస్తాడు గానీ మోకరిల్లడం అనేది ఉండదని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, నయీమ్ ముఠా భయపెట్టినా బెదర లేదని స్పష్టం చేశారు. ఈటల కేసీఆర్ తాటాకు చప్పులకు భయపడడని అన్నారు. హుజురాబాద్ గడ్డ చైతన్యవంతమైన గడ్డ అని, 30వ తేదీన కాషాయం జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతకొన్ని నెలలుగా ఎమ్మెల్యేలు, మంత్రులు లారీల్లో మద్యం, డబ్బు సంచులు తీసుకొచ్చి హుజురాబాద్ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ జేజమ్మ వచ్చినా నన్ను ఓడించలేరని, హుజరాబాద్‌లో ఎగిరే జెండా కాషాయ జెండానే అన్నారు. మీ బిడ్డగా నన్ను మర్చిపోవద్దు. 30వ తేదీన జరిగే ఉప ఎన్నికల్లో పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు.

బొడిగె శోభ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బాపు కాకా అని సంబోధిస్తూ.. ‘మా బాపు భారతదేశ చరిత్రలోనే అబద్ధాల ఆడటంలో, మోసం చేయడంలో పెద్దబాలశిక్ష చదివాడు. ఉద్యమ బిడ్డలమైన మాతో పెట్టుకున్న కేసీఆర్ భరతం పడతాం. నిన్ను వదిలిపెట్టే సమస్యే లేదు.’ అని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌కు రాజకీయ సమాధి కట్టాలంటే ఈటలకు ఓటు వేయాలని కోరారు. ‘ఇక్కడకు వచ్చి టీఆర్ఎస్ తరపున ప్రచారాలు చేస్తున్న మొగోళ్ళు వాళ్ల నియోజకవర్గాల్లో పనులు చేసుకోలేకపోతున్నారు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పోసిన మద్యం తాగి ఈటలపై ఉద్యమం చేస్తున్నారని, చిత్తశుద్ధి, ఖలేజా ఉంటే, ఒక అబ్బకు, అయ్యకు పుడితే మీ పదవులకు రాజీనామా చేయాలని ఆమె సవాల్ విసిరారు. అలా చేస్తే మీ నియోజకవర్గ ప్రజలకు దళిత బంధు, పింఛన్లు వస్తాయని అన్నారు.

అనంతరం గూడూరు గ్రామ ప్రచారంలో పాల్గొన్న ఈటల మట్లాడుతూ… తాను ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేసినప్పుడు తెలంగాణ ప్రజల హృదయాలను చోటు సంపాదించానని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు సైతం గొప్పగా పనిచేశానని తనకు కితాబు ఇస్తే, సభలో ఉన్న సీఎం కేసీఆర్ మాత్రం తనను కంట్లో నలుసులా చూశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకునూరి మురళి దళిత బిడ్డను అవమానిస్తే రాజీనామా చేసి ఆంధ్రాకు పోయిండని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను హింస పెడితే రాజీనామా చేసి బయటకు వచ్చిండని అన్నారు. తాను మంత్రిగా పని చేసినప్పుడు ఒక ఎస్సీ, బీసీ, మైనార్టీ అధికారి లేరని అడిగితే తన నోరు మూయించాడు అని, బయటికి వచ్చి అడిగితే ఇప్పుడు రాహుల్ బొజ్జను నియమించాడు అన్నారు. ఈసారి ఈటల దెబ్బకు హుజురాబాద్‌కే కాదు.. రాష్ట్రమంతా లాభం జరిగిందని అన్నారు. ఎవరి జాగాలో వారికి ఇల్లు కట్టుకోవడానికి జీవో వచ్చిందని, ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.


Next Story

Most Viewed