ఈటల అత్యాశకు పోయాడు : ఎంపీ లక్ష్మీకాంతరావు

by  |
ఈటల అత్యాశకు పోయాడు : ఎంపీ లక్ష్మీకాంతరావు
X

దిశ, హుజురాబాద్ : పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం నేరమని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నారు. బుధవారం హుజురాబాద్ మండలం సింగాపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈటెల రాజేందర్ అక్రమంగా అసైన్డ్ భూములు ఉన్నట్టుగా అక్కడి రైతులు సీఎం కేసీఆర్ కు విన్నవించుకున్నట్లు చెప్పారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటలపై అభియోగం వచ్చిన వెంటనే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే భావనతో విచారణను వేగవంతం చేసి సీఎం కేసీఆర్ ప్రాథమిక చర్యలు చేపట్టారని అన్నారు. అధికారుల విచారణలో 66 ఎకరాల అసైన్డ్ భూమి ఈటల రాజేందర్ ఆక్రమించడం పద్ధతి కాదన్నారు.

ఈ విషయం తెలిసి కేసీఆర్ విచారణకు ఆదేశిస్తే తప్పు ఎలా అవుతుంది? బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి భూములపై సొంత, వ్యక్తిగత లాభం కోసం కన్నేయడం తప్పు.. ఒక మంత్రిగా తెలుసుకోవాల్సిన అంశం అన్నారు. అవి ఎలాంటి భూములైన వాటి పరిధిలోకి వెళ్లడం చట్ట వ్యతిరేకమన్నారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఒకవైపు ఆర్డీవో కార్యాలయం హుస్నాబాద్ లో ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు జరుగుతుండగా అక్కడ మంజూరైన ఆర్డీవో కార్యాలయాన్ని హుజురాబాద్‌కు తరలించే యత్నాలు అప్పటి మంత్రి ఈటల రాజేందర్ చేశారన్నారు. హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయ ఏర్పాటుకు జీఓ ఇచ్చిన అప్పటి మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభోత్సవానికి హాజరు కాలేదన్నారు. ఈ విషయమై హుస్నాబాద్‌లో సందిగ్దత ఏర్పడిన ఈ విషయాన్ని గుర్తు చేశారు.

హుజురాబాద్ ఎంపీపీగా ఉన్న వొడితల సరోజినీదేవి పై సొంత పార్టీ ఎంపీటీసీలే అవిశ్వాసం పెడితే చూస్తూ ఉండిపోయాడే తప్ప దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఈటల రాజేందర్ చేయలేదన్నారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించి హుజురాబాద్, జమ్మికుంటలోని మున్సిపాలిటీల్లో చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలను అప్పటి మంత్రి ఈటల ప్రోత్సహించారని ఆరోపించారు. పార్టీలో కష్టపడి పనిచేస్తున్నవారిని అణగదొక్కడం, బయటి వారిని ప్రోత్సహించడం చేశారన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి ఫోటోలు ఫ్లెక్సీల్లో పెట్టవద్దని మంత్రి ఈటల హెచ్చరించేవారనే విషయం పలుమార్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని ఈటల రాజేందర్ అత్యాశకు పోయి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed