నివ్వెరపోయిన అధికారులు.. పోస్ట్‌మార్టం చేసే చోట ఉద్యోగాలకు ఇంజినీర్లు, పీజీ గ్రాడ్యుయేట్లు అప్లై

by  |
నివ్వెరపోయిన అధికారులు.. పోస్ట్‌మార్టం చేసే చోట ఉద్యోగాలకు ఇంజినీర్లు, పీజీ గ్రాడ్యుయేట్లు అప్లై
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం చేసే చోట ఉద్యోగాలకు భారీగా ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు, పీజీ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవడం అధికారులను నివ్వెరపరిచింది. ఈ ఆశ్చర్యకర విషయం కోల్‌కతాలో చోటుచేసుకుంది. కోల్‌కతాలోని నీల్ రతన్ సిర్కార్ మెడిసిన్ కాలేజీ, ఆస్పత్రి పోస్ట్‌మార్టం చేసే ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ డిపార్ట్‌మెంట్‌లో ల్యాబ్ అసిస్టెంట్ల భర్తీకి ప్రకటన జారీ చేసింది. డోమ్ అని ఈ ఉద్యోగాలను పిలుస్తారు.

ఖాళీగా ఉన్న 6 వేల పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయగా.. ఏకంగా 8 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉద్యోగాలకు విద్యార్హతను 8వ తరగతిగా నిర్ణయించారు. కానీ వీటికి ఇంజినీరింగ్, గ్రాడ్యుయేట్లు, పీజీ గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకోవడం చూసి ఆస్పత్రి సిబ్బంది బిత్తరపోయారు. 100 మంది ఇంజినీర్లు, 500 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 2,200 మంది గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకున్నట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపింది.

ఆస్పత్రి దరఖాస్తులను పరిశీలించి చివరికి 784 మందిని రాతపరీక్షలకు ఎంపిక చేశారు. వీరికి ఆగస్టు 1న రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగాలకు వయోపరిమితి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలని ప్రకటనతో పేర్కొనగా.. జీతం రూ.15 వేలుగా నిర్ణయించారు. కాగా చిన్న పోస్టులకు ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవడం బట్టి చూస్తే.. దేశంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.



Next Story