రూ. 2,000 నోట్ల గురించి భయపడొద్దు!

by  |
రూ. 2,000 నోట్ల గురించి భయపడొద్దు!
X

దిశ, వెబ్‌డెస్క్ : నిజంగానే రూ. 2000 నోట్లు ఇక మీదట కనబడవా? వీటి ప్రింటింగ్ నిలిపేస్తున్నారా? ఇండియన్ బ్యాంక్ మార్చి 1నుంచి రూ. 2000 నోట్లను ఉంచమని ఎందుకు చెప్పాయి? దీని గురించి ప్రభుత్వం ఏం చెప్తుంది? గత వారం రోజులుగా ఈ ప్రశ్నలు సాధారణ ప్రజల్ని అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. ఇటీవల సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఆర్‌బీఐ స్పందిస్తూ..రూ. 2000 నోట్ల ప్రింటింగ్‌ను ఆపేసినట్టు చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో బ్యాంకుల ఏటీఎంల్లో రూ. 2000 నోట్లకు బదులుగా రూ. 500 నోట్లే ఎక్కువగా వస్తున్నాయని కొందరు చెబుతున్నారు. అధిక విలువ ఉన్నటువంటి కరెన్సీని క్రమంగా ఆర్‌బీఐ వెనక్కు తీసుకుంటుందనే దానికి ఇది సంకేతమని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.

ఆర్‌బీఐ డేటా ప్రకారం…చెలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్లలో రూ. 2000 నోట్ల వాటా 2016-17లో 3.3 శాతం ఉండేది. 2018-19 నాటికి ఇది 3 శాతానికి పడిపోయింది. 2016-17లో జారీ చేసిన మొత్తం రూ. 2000 నోట్ల విలువ 6,57,100 కోట్లు. 2017-18లో రూ. 15,500 కోట్ల విలువైన రూ. 2000 నోట్లు మాత్రమే జారీ చేయబడ్డాయి. ప్రస్తుతం మొత్తం రూ. 2000 నోట్ల విలువ రూ. 6,72,600 కోట్లకు చేరుకుంది.

ఇటీవల ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ తమ ఏటీఎంల్లో రూ. 2000 నోట్లు ఉంచబోమని చెప్పింది. ఈ నిర్ణయం మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు స్పష్టం చేసింది. దీంతో సాధారణ ప్రజల్లో ఆందోళన పెరిగింది. అయితే, తమ ఏటీఎంల్లో రూ. 2000 నోట్లను నింపేందుకు అప్‌గ్రేడ్ చేయాల్సి రావడంతో బ్యాంకులపై ఇది అదనపు భారమైంది. అందుకే ఎక్కువ శాతం బ్యాంకులు రూ. 2000 నోట్లను ఏటీఎంల్లో నింపేందుకు ఆసక్తి చూపించడంలేదు. పైగా, అధిక విలువ కలిగిన రూ. 2000 నోట్లను మార్పిడి చేసుకోవడంలో వినియోగదారులకు అసౌకర్యంగా ఉందని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. కస్టమర్లు తక్కువ విలువ కలిగిన నోట్లను బ్యాంకుల్లో అడుగుతున్నారని, దానికోసం ఎంతసేపైనా క్యూల్లో నిల్చునేందుకు సిద్ధమవుతున్నారని వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో రూ. 2000 నోట్లను ఏటీఎంల నుంచి తీసేయాలని నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంక్ వెల్లడించింది. ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం ఇండియన్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 3,988 ఏటీఎంలు ఉన్నాయి. వీటిలో 3,289 ఏటీఎంలు ఆన్-సైట్ కాగా, మిగిలిన 699 ఏటీఎంలు ఆఫ్-సైట్‌లో ఉన్నాయి.

ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. రూ. 2000 నోట్లను నిలిపేయాలని కేంద్రం ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేదని ఆమె స్పష్టం చేశారు. బుధవారం బ్యాంకుల అధికారులతో జరిగిన సమావేశమనంతరం ఆర్థిక మంత్రి వివరణ ఇచ్చారు. బ్యాంకులకు తాము అటువంటి సూచనలేమీ ఇవ్వలేదని, అవన్నీ కేవలం పుకార్లెనని తెలిపారు. రూ. 2000 నోట్లు ఎప్పటిలాగే చలామణిలో ఉంటాయని, అవాస్తవమైన పుకార్లను అస్సలు నమ్మవద్దని చెప్పారు.

Next Story

Most Viewed