ఏపీపై ఎంఫాన్ ప్రభావం ఇదే..!

by  |
ఏపీపై ఎంఫాన్ ప్రభావం ఇదే..!
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌పై ఎంఫాన్ తుపాను ప్రభావం పెద్దగా కనిపించలేదు. చెదురుమదురు జల్లులు తప్ప పెద్దగా వర్షాలు కురవలేదు. ఎంఫాన్ తుపాను తీరం దాటిన సమయంలో గాలులు తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. సముద్ర తీర ప్రాంతాల్లో సముద్రం వంద అడుగులకు పైగా ముందుకు దూసుకురావడంతో మత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు.

మరోవైపు ఏపీలోని అన్ని ఓడరేవు కేంద్రాల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వైజాగ్, భీమిలి, కలింగపట్నం తీరాల్లో సముద్రపు అలలు నాలుగైదు మీటర్ల మేర ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. అయితే తుపాను తీరం దాటిన తరువాత సముద్రం వెనక్కి వెళ్లింది. ముందుకొచ్చిన సముద్రం కెరటాలతో విరుచుకుపడడంతో తీరప్రాంత వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే, తుపాను నిన్న తీరం దాటిన నేపథ్యంలో సముద్రం వెనక్కి వెళ్లింది. దీంతో మత్స్యకారులు ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు, సముద్రం అల్లకల్లోలంగా మారడంతో లోపలి నుంచి రొయ్యలు తీరానికి కొట్టుకొచ్చాయి. దీంతో వాటిని ఏరుకునేందుకు మత్స్యకారులు పోటీపడ్డారు. తీరం వెంబడి అరటి, బొప్పాయి, కొబ్బరి, మామిడి, జీడి మామిడి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పంటలు నేలకొరిగాయి. అయితే ఇది తుపాను తీవ్రత అంత నష్టం కాదని రైతులు అభిప్రాయపడుతున్నారు.

ఏపీలోని ఓడరేవుల్లో తుపాను హెచ్చరికలు తొలగించారు. తుపాను గమనం, తీవ్రతకు సంబంధించిన ఛాయాచిత్రాలను వైజాగ్‌లోని ప్రముఖ పర్యాటక క్షేత్రం కైలాసగిరిపై ఏర్పాటు చేసిన డాప్లర్ రాడార్ నమోదు చేసింది. కైలాసగిరిపై డాప్లర్ వెదర్ రాడార్ ఏర్పాటు చేసిన తరువాత ఏర్పడిన సూపర్ సైక్లోన్ ఇదే కావడంతో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కేంద్రమే అందించింది.



Next Story

Most Viewed