రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు పోటీగా ఎలన్ మస్క్

by  |
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు పోటీగా ఎలన్ మస్క్
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్ ఎక్స్’ కంపెనీ ఇండియాలో లాంచ్ అయింది. స్థానికంగా బ్రాడ్‌బ్యాండ్ ఆపరేషన్స్ ప్రారంభించాలనే ప్రణాళికలతో స్పేస్‌ఎక్స్ భారత్‌లో అడుగుపెట్టింది. ఈ మేరకు విషయాన్ని తమ అనుబంధ సంస్థ ‘స్టార్ లింక్‌’ను భారత్‌లో రిజిస్టర్ చేసుకున్నట్లు సోమవారం ప్రకటించింది. అంతేకాకుండా బ్రాడ్‌బ్యాండ్, ఇతర ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవలను అందించేందుకు లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు కంపెనీ సిద్ధమవుతుంది.

భారత్ బ్రాడ్‌ బ్యాండ్‌ స్పేస్‌లో దిగ్గజాలుగా పేరొందిన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో, సునీల్ మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్‌టెల్‌తో పాటు మల్టినేషనల్ కంపెనీ వొడాఫోన్- ఐడియా నుంచి స్టార్ లింక్ గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా భారతీ గ్రూప్-మద్దతుగల వన్‌వెబ్‌కు స్టార్‌లింక్ ప్రత్యక్ష పోటీదారుగా ఉంటుంది. కాగా కంపెనీ తన కార్యకలాపాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్రయత్నిస్తోంది.

నిజానికి SpaceX శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ విభాగమైన స్టార్‌లింక్ డిసెంబర్ 2022 నుంచే ఇండియాలో తన బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే రెండు లక్షల యాక్టివ్ టెర్మినల్స్‌తో పని చేయనున్న సంస్థ ప్రభుత్వ అనుమతిని పొందాల్సి ఉంటుంది. స్టార్‌లింక్ ఇప్పటికే ఇండియా నుంచి 5,000 ప్రీ-ఆర్డర్స్ పొందడం విశేషం. కంపెనీ ఒక్కో కస్టమర్‌కు USD 99 లేదా రూ.7,350 డిపాజిట్‌ను చార్జ్ చేయనుండగా.. బీటా దశలో సెకనుకు 50 నుంచి 150 మెగాబైట్స్ పరిధిలో డేటా స్పీడ్‌ను అందజేస్తుందని పేర్కొంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడంపైనా కంపెనీ దృష్టి సారించింది.

‘SpaceX ఇప్పుడు భారతదేశంలో అనుబంధ సంస్థను కలిగి ఉందని తెలిపేందుకు సంతోషిస్తున్నాను. కంపెనీ పేరు SSCPL – స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, విలీన తేదీ నవంబర్ 1, 2021. హ్యాపీ బర్త్‌డే SSCPL. మేము ఇప్పుడు లైసెన్స్‌లు, ఓపెన్ బ్యాంక్ ఖాతాలు మొదలైన వాటి కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించవచ్చు’ అని స్టార్‌లింక్ కంట్రీ డైరెక్టర్ ఇండియా సంజయ్ భార్గవ్ సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించారు.

Next Story

Most Viewed