హుజూరాబాద్‌ బైపోల్ కౌంటింగ్‌.. ఎన్నికల అధికారి కీలక ఆదేశాలు

by  |
Huzurabad by-election
X

దిశ, కరీంనగర్ సీటీ: హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా నవంబర్ 2వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణన్ శంకర్ నారాయణ, హుజూరాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సీహెచ్. రవీందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఓట్లను లెక్కించాలని కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసిన 5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కించాల్సి ఉంటుందని, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ల లెక్క సరిగ్గా ఉండాలన్నారు. అలాగే, ఫారం 17సీని చెక్ చేయాలన్నారు. కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రంలో ఉదయం 6 గంటలకే రిపోర్ట్ చేయాలని సూచించారు. కౌంటింగ్ టేబుల్స్ వద్ద నియమించిన కౌంటింగ్ సిబ్బంది.. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంటుందని అన్నారు.

మొదటగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలని, అనంతరం బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు లెక్కించాల్సి ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్ సిబ్బంది చేపట్టే లెక్కింపు కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలించాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించవద్దని, అభ్యర్థుల తరఫున కౌంటింగ్‌లో పాల్గొనే ఏజెంట్లతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి ఏజెంట్లకు ఎప్పటికప్పుడు వివరించాలని అన్నారు. కౌంటింగ్ సమయంలో సొంత నిర్ణయాలు తీసుకోవద్దని, ఏమైనా సందేహాలుంటే రిటర్నింగ్ అధికారికి తెలపాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రానికి సెల్ ఫోన్లు, పెన్నులు తీసుకురావద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, ఎన్నికల నోడల్ అధికారులు వీ శ్రీధర్, బీ రవీందర్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed