ఎన్నికల వ్యూహకర్త పీకే సంచలన నిర్ణయం

by  |
Prashant Kishore
X

కోల్‌కతా : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి తాను ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోనని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ఎన్ని బీరాలు పలికినా, హిందూత్వ కార్డును ఎంతగా రెచ్చగొట్టినా ఆ పార్టీ డబుల్ డిజిట్ దాటదని చెప్పిన పీకే అన్నట్టుగానే కమలనాథులు సెంచరీ కొట్టడానికి పడరాని కష్టాలు పడుతున్నారు. బీజేపీ డబుల్ డిజిట్ దాటితే తాను ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకుంటానని ప్రశాంత్ కిషోర్ బహిరంగంగానే ప్రకటించిన విషయం విదితమే. అయితే ఆయన అంచనా వేసినట్టుగానే బీజేపీ త్రిబుల్ డిజిట్‌కు ముందు బొక్క బోర్లా పడినా ఆయన మాత్రం ఎలక్షన్ స్ట్రాటజిస్టుగా తప్పుకుంటానని ప్రకటించడం గమనార్హం.

ఇదే విషయమై పీకే ఎన్డీటీవీతో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘ఇక నుంచి నేను చేస్తున్న పనిలో కొనసాగాలని నాకు లేదు. నేను బ్రేక్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎంతోకాలంగా ఈ పని చేయాలనుకుంటున్నాను. కానీ బెంగాల్ ఎన్నికలు నాకు ఆ అవకాశాన్నిచ్చాయి. నేను ఈ స్పేస్ (ఎలక్షన్ స్ట్రాటజిస్టుగా) ను వదిలేయాలనుకుంటున్నాను’ అని అన్నారు. బెంగాల్ లో టీఎంసీ విజయం ఏకపక్షమే అయినా ఇందుకోసం హోరాహోరి (టఫ్ ఫైట్)గా పోరాడామని తెలిపారు.

వ్యక్తిగత కారణాల దృష్ట్యా తాను స్ట్రాటజిస్టుగా వైదొలిగేందుకు యోచిస్తున్నానని పీకే చెప్పారు. తాను స్థాపించిన ఐపాక్((I-PAC) లో చాలా మంది టాలెంటెడ్ వ్యూహకర్తలున్నారని ఆయన చెప్పుకొచ్చారు. తాను వైదొలిగినా ఐపాక్ మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ పాపులారిటీ బెంగాల్ లో పనిచేయలేదని కిషోర్ తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా బెంగాల్ ఎన్నికలలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా దేశంలోని పార్టీలన్నీ ఐక్యం కావలసిన అవసరం ఉన్నదని పీకే కామెంట్ చేశారు.


Next Story