Budget: కాగిత రహిత బడ్జెట్లో...కాంతల కామితాలు తీరుతాయా?

by Disha edit |
Budget: కాగిత రహిత బడ్జెట్లో...కాంతల కామితాలు తీరుతాయా?
X

ఇందిరాగాంధీ తర్వాత కేంద్ర బడ్జెట్‌ను ఎక్కువ సార్లు ప్రవేశపెట్టిన ఘనత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కి ఉంది. తెలుగింటి కోడలిగా నిర్మలమ్మ ఈ సారి బడ్జెట్‌లో మహిళల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోంటారనే ఆశలు ఉన్నాయి. భారత్‌లో చాలా మంది మహిళలు మంచి విద్యాభ్యాసం చేసి కూడా ఇంటికే పరిమితమైపోతారు. పలు రకాల కారణాలతో వీరు ఉద్యోగాల వైపు ఎక్కువగా మొగ్గుచూపరు. మహిళలు ఎవరిపైనా ఆధారపడకుండా జీవించాలంటే.. విద్యా, వైద్యం, సామాజిక భద్రత చాలా అవసరం. ఈ సారి బడ్జెట్‌లోనైనా తమ అవసరాలు, ఆకాంక్షలకు నిర్మలమ్మ సరైన సాక్షర రూపం కల్పిస్తారని యావత్ మహిళా లోకం ఆశగా ఎదురుచూస్తోంది. అలాగే వివిధ రంగాలలో దేశాభివృద్ధికి దోహదకారిగా ఉంటూ ఉత్ప్రేరకంగా మారేది విద్యారంగం. ఉచితాలు, సంక్షేమ పథకాల ప్రతిఫలాలే పరమావధిగా కాకుండా, దేశ సుదీర్ఘ ప్రయోజనాల దృష్ట్యా విద్యారంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.

త్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః'' ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలను దేవతగా భావించి పూజిస్తారో, అక్కడ సర్వసంపదలు కొలువై ఉంటాయి అన్నది ఆర్యోక్తి. ఈ అర్యోక్తికి ఈ సారి బడ్జెట్‌లోనైనా సరైన సాక్షర రూపం కల్పిస్తారని యావత్ మహిళా లోకం ఆశగా ఎదురుచూస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ని గత నాలుగేళ్లుగా ప్రవేశపెడుతున్నారు. ఆమెకు వరుసగా ఇది ఐదో బడ్జెట్. ఇంతవరకు నాలుగు బడ్జెట్లను ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రి ఎవ్వరూ లేరు. గతంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా ఇందిరాగాంధీ చరిత్ర సృష్టించారు. ఆమె తర్వాత రెండో మహిళా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ఎక్కువసార్లు(నాలుగుసార్లు) బడ్జెట్ ప్రవేశపెట్టి ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. తెలుగింటి కోడలిగా నిర్మలమ్మ ఈ సారి బడ్జెట్‌లో అతివల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోంటారనే ఆశలు ఉన్నాయి. భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల కల సాకారం కావాలంటే మహిళా శక్తిని భారత్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకోగలగాలి. ప్రపంచ జీడీపీ సగటులో కూడా 37 శాతం మహిళల నుంచే వస్తోంది. కానీ, భారత్‌లో ఆ వాటా దాదాపు 17-18 శాతం వరకు మాత్రమే ఉందంటే ఎంత వెనుకబడిందో అర్థం చేసుకోవచ్చు.

భారత్‌లో చాలా మంది మహిళలు మంచి విద్యాభ్యాసం చేసి కూడా ఇంటికే పరిమితమైపోతారు. చాలా మందికి ఉద్యోగాలు చేయాలని ఉన్నా.. పని వాతావరణాల్లో సమస్యలు, వేతనాలు తక్కువగా ఉండటం వంటి పలు రకాల కారణాలతో వీరు ఉద్యోగాల వైపు ఎక్కువగా మొగ్గుచూపరు. మహిళలు ఎవరిపై ఆధారపడకుండా జీవించాలంటే.. విద్యా, వైద్యం, సామాజిక భద్రత చాలా అవసరం. ప్రభుత్వం ఇప్పటికే 'బేటీ బచావ్‌, బేటీ పడావ్‌', 'జాతీయ గ్రామీణ జీవనోపాధి' లాంటి పథకాలు నిర్వహిస్తోంది. వీటికి నిధులను పెంచితే ఎక్కువ మంది మహిళలకు ఇవి చేరుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 17 ఏళ్లుగా జీడీపీతో పోలిస్తే జెండర్‌ బడ్జెట్‌ కేటాయింపుల శాతం పెరగడం లేదు. ఇది ఎప్పుడూ బడ్జెట్‌ మొత్తం వ్యయంలో 5 శాతం కంటే తక్కువే ఉంటోంది. ఇక జీడీపీతో పోలిస్తే 1 శాతం కన్నా తక్కువగా ఉంటోంది. 2023 బడ్జెట్‌లో అయినా మహిళల కోసం చేపట్టిన స్కీంలకు ప్రభుత్వ కేటాయింపులు గణనీయంగా పెరగాలి.

మహిళా స్కీమ్‌లకు కేటాయింపులు మస్ట్

మహిళలకు ఆదాయపన్ను మినహాయింపులో మరిన్ని రాయితీలు ప్రకటించాలి. ఈ బడ్జెట్‌లో పథకాల సంఖ్య మరింత పెరిగాలి. దీంతోపాటు శ్రామిక మహిళల సంఖ్య ఆధారంగా కేటాయింపులు ఉండాలి. మహిళా శిశు సంక్షేమానికి మరిన్ని నిధులు కేటాయించాలి బాలింతలకు వైద్య సౌకర్యం పౌష్టిక ఆహారం అందించే పథకాలకి నిధులతో పాటు మౌలిక సౌకర్యాలను పెంచాలి. కేవలం మహిళలకు సంబంధించిన పథకాల్లో కేటాయింపులు పెంచితే చాలదు. అన్ని పథకాల్లో కూడా మహిళల వాటా పెరిగేట్లు చూడాలి. ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో మహిళల స్టార్టప్‌లకు ప్రత్యేక రిజర్వేషన్లు కేటయించడం వారిని వ్యాపార రంగంలో బలోపేతం చేస్తుంది. ఉన్నత విద్య విదేశీ విద్యకు అర్హులైన మహిళలకు రుణాలు రాయితీలు కల్పించాలి. ఉపాధి కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళలకు ఆస్తిపై యాజమాన్య హక్కులను ప్రోత్సహించేలా పన్ను రాయితీలు ఇవ్వాలి. ఇది వారిలో ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పెంచుతుంది.

మహిళలు నిర్వహించే సంస్థలకు సులువుగా రుణాలు వచ్చేలా పథకాలను ప్రవేశ పెట్టాల్సి ఉంది. దీంతోపాటు పన్ను రాయితీలు కల్పిస్తే.. మహిళా వ్యాపారవేత్తల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ప్రధాన మంత్రి మాతృ వందన యోజనను మరింత బలోపేతం చేయాలి. ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలు చేసేలా ప్రోత్సహించేందుకు 'ఛైల్డ్‌కేర్‌'ను మరింత చౌకగా అందుబాటులోకి తీసుకురావాలి. ప్రస్తుతం ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలకు మొగ్గు చూపకపోడానికి ప్రధాన కారణాల్లో శిశు సంరక్షణ కూడా ఒకటి. నాణ్యమైన శిశు సంరక్షణ కేంద్రాలు అందుబాటులోకి వస్తే మహిళలు ఉద్యోగాన్ని, కుటుంబాన్ని సమతౌల్యం చేసుకోగలరు. వితంతు, ఒంటరి మహిళకు అవసరమైన పింఛను పథకాలను మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. కాగిత రహిత బడ్జెట్‌లో కాంతల కామితాలు తీరుతాయో లేదో వేచి చూద్దాం.

విద్యారంగం భారీ అంచనాలు

2024 సంవత్సరంలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆఖరి బడ్జెట్ కావడంతో అనేక రంగాలకు చెందిన వారి ఆశలన్నీ ఈ బడ్జెట్ పైనే ఉన్నాయి. ఈ బడ్జెట్‌పై విద్యా రంగం కూడా భారీ అంచనాలను పెట్టుకుంది. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) కింద ప్రభుత్వం ఇటీవల కొత్త కార్యక్రమాలు, విధాన మార్పులను ప్రవేశపెట్టడంతో ఈ ఏడాది బడ్జెట్‌పై విద్యారంగం భారీ ఆశలు పెట్టుకుంది. 2047 సంవత్సరం నాటికి ప్రపంచ శ్రామిక శక్తిలో 25 శాతం మంది భారతీయులే ఉండాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం ప్రారంభ దశలోనే పెట్టుబడులు పెట్టాలని విద్యారంగ నిపుణుల సూచన. ఈ దిశగా కేటాయింపులు ఏమాత్రం వుంటాయో చూడాలి.

నైపుణ్యాభివృద్ధి, ఉపాధి హామీలపై దృష్టి సారించేందుకు అంకుర సంస్దలకు (స్టార్టప్)లకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహం ఉండాలి. అక్షరాస్యత, వయోజన విద్య అక్షరాస్యత, వయోజన విద్య, బాలిక విద్య, పై శ్రద్ధ చూపాలి. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులను డిజిటలైజ్ చేయడం, ప్రతి పాఠశాలలో ఆంతర్జాలం ద్వారా దృశ్య శ్రవణ విధానంలో బోధన, వివిధ ఆంశాలలో విద్యార్థులకు శిక్షణ, ఉపాధ్యాయ శిక్షణ, వయోజన విద్య, సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) వంటి కార్యక్రమాలకు ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయింపులను పెంచడంతో పాటు, విద్యకు సంబంధించిన సర్వీసులపై జీఎస్టీని పది సంవత్సరాల పాటు ఎత్తివేయాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాలను పట్టించుకోండి ప్లీజ్

తెలుగు రాష్ట్రాలలో ఏర్పాటైన కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాల కేటాయింపు, స్థలం, భవన నిర్మాణానికి నిధుల మంజూరు. అలాగే జిల్లా కేంద్రాలలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు లేదా కేంద్రీయ విద్యాలయాల సీట్ల పెంపు, నూతన ఐఐటీ, ఐ.ఐ.యంల ఏర్పాటు. ప్రస్తుతమున్న ఐఐటీ, ఐ.ఐ.యం వసతుల అభివృద్ధి. కేంద్ర విశ్వ విద్యాలయాలలో నాణ్యమైన విద్యతో పాటు శిక్షణ మరియు ఉపాధికల్పనలకు అనువుగా ఏర్పాటు దాని కోసం బహుళ జాతి సంస్దలతో ఒప్పందం లేదా విదేశీ విశ్వ విద్యాలయాలతో అనుసంధానం కోసం విధానాలు ప్రకటించాలి.

యూజీసీ వేతన ఆమలు ఉపాధ్యాయుల నియామకాలు వేతనాలు పదవీ విరమణ తర్వాత వారికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులో జాప్యాన్ని నివారించటానికి. అలాగే దీర్ఘ కాలం అపరిష్కృతంగా ఉన్న నవోదయ విద్యాలయాల ఉద్యోగుల పెన్షన్ పధకంపై ప్రకటన పెన్షన్ చెల్లింపు కోసం మానవ వనరుల అభివృద్ధి శాఖతో సమన్వయంతో పాటు, ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి నిధులను కేటాయించాలి. దీంతో రానున్న కేంద్ర బడ్జెట్ ప్రకటనలపై విద్యా రంగం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అలాగే భారతదేశంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడటానికి కావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని విద్యా రంగం ఆశిస్తోంది.

-శ్రీధర్ వాడవల్లి

హైదరాబాద్

99898 55445

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

జోడో యాత్ర ముగిసింది- ఇక జోడీ యాత్ర కావాలి



Next Story