ఉద్యోగుల తొలగింపు... సంక్షోభాన్ని పరిష్కరిస్తుందా?

by Disha edit |
ఉద్యోగుల తొలగింపు... సంక్షోభాన్ని పరిష్కరిస్తుందా?
X

దేశంలోని ఐ.టి కంపెనీల్లో అతి పెద్దవైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌ రెవిన్యూలో దాదాపు 80 శాతానికి పైగా ఉత్తర అమెరికా, యూరోపియన్‌ మార్కెట్ల నుంచే వస్తుంది. ఈ దేశాల్లో వచ్చే సంక్షోభ ప్రభావం భారత ఐ.టి రంగంపై తీవ్రంగా వుంటుంది. ఇప్పటికే గత ఏడాదితో పోలిస్తే 18 శాతం నియామకాలు ఐ.టి రంగంలో తగ్గాయి. కేవలం ఐ.టి రంగానికే ఇది పరిమితం కాలేదు. విద్యా రంగానికి చెందిన ఎడ్‌ టెక్‌ కంపెనీలు కూడా ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. గత నెలలో ట్విట్టర్‌ 50 శాతం ఉద్యోగులను (12 వేల మందిని), అమెజాన్‌ 10 వేల మందిని, ఫేస్‌బుక్‌ ఆధ్వర్యంలోని మెటా కంపెనీ 3 వేల మందిని తొలగించాయి. ఇంతేకాదు, లక్ష పదిహేను వేల మంది పని చేస్తున్న ఇంటెల్‌ 20 శాతం, స్నాప్‌ 20 శాతం, రాబిన్‌హుడ్‌ 13 శాతం ఉద్యోగులను, సేల్స్‌ ఫోర్స్‌ 2 వేల మందిని, ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ 2,500 మందిని, మైక్రోసాఫ్ట్‌ వెయ్యి మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. వీరు కాకుండా మరో లక్ష మంది లే ఆఫ్‌ల ద్వారా పని, జీతం లేకుండా త్రిశంకు స్వర్గంలో వున్నారు.

వివిధ కంపెనీలు కొత్త నియామకాలకు ఇంటర్వ్యూలు పూర్తి చేసి ఆఫర్‌ లెటర్లు ఇచ్చి, జాయినింగ్‌ లెటర్లు ఇవ్వకుండా సుమారు లక్ష మంది భవిష్యత్తును ఆందోళనలో వుంచాయి. టిసిఎస్‌ సంస్థ ఉద్యోగులకు లే ఆఫ్‌ ప్రకటించనున్నదని వార్తలు వస్తున్నాయి. మూన్‌ లైటింగ్‌, ఫేక్‌ సర్టిఫికెట్స్‌ లాంటి పేర్లతో గత సెప్టెంబర్‌ నుండి ఐ.టి ఉద్యోగుల తొలగింపు భారీగా పెరిగింది. ఈ విషాద క్రమం ఇంతటితో పూర్తయినట్లు కాదు. అసలు మాంద్యం ప్రభావం ముందుంది అంటున్నారు నిపుణులు. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు రానున్న ప్రమాద హెచ్చరికలు చేసేస్తున్నాయి. 'ఉన్న డబ్బును కార్లకు, టీవీలకు, జల్సాలకు ఖర్చు చేయకండి...' అంటూ పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలతో పాటు అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ లాంటి దిగ్గజ వ్యాపార సంస్థల అధినేతలు ఆపత్కాల ప్రవచనాలు చేస్తున్నారు. ఈ ప్రళయం మనలను తాకదు అంటూ చెప్పిన మన దేశ పాలకులు,ఆర్థిక నిపుణులు గొంతులు సవరించుకుంటున్నారు. గత నెలలో హైదరాబాద్‌లో రిజర్వు బ్యాంక్‌ నిర్వహించిన ఒక సెమినార్‌లో సాక్షాత్తు ఆర్‌బిఐ గవర్నర్‌ రానున్నది ముప్పేనని, అందుకు అందరూ సిద్ధం కావాలన్నారు.

ఆగిపోయిన అభివృద్ధి

ప్రపంచ అభివృద్ధి 2021లో 6.0 శాతం నుండి 2022లో 2.7 శాతానికి, 2023లో 2.3 శాతానికి తగ్గిపోతున్నట్లు 2022 అక్టోబర్‌లో ఐఎంఎఫ్‌ ప్రకటించిన ప్రపంచ ఆర్థిక నివేదిక తెలిపింది. గత పది సంవత్సరాలలో ఇదే అత్యంత బలహీనమైన ప్రపంచ అభివృద్ధి. 2023 అక్టోబర్‌ నాటికి అమెరికాలో ఆర్థిక మాంద్యం రావడం నూరు శాతం జరగవచ్చునని బ్లూమ్‌బెర్గ్‌ అంచనా వేసింది. ప్రపంచ ద్రవ్యోల్బణం 2021లో 4.7 శాతం నుండి 2022లో 8.8 శాతానికి పెరుగుతుందని అంచనా. 2008లో ప్రపంచ ఆర్థిక సంస్థలు కుప్పకూలిపోవడంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ కోలుకోలేకపోతుంది. ప్రపంచ జిడిపి వృద్ధి 2009లో 5.4 శాతం వుండగా, 2019 నాటికి 2.8 శాతానికి దిగజారింది. ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రావడంతో ఆర్థిక వ్యవస్థలు ఘోరంగా పతనమయ్యాయి. కరోనా పోయినా ప్రపంచ అభివృద్ధి మాత్రం 2.7 శాతం దగ్గరే నిలిచిపోయింది. మన దేశంలో 2019-20 లో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) రూ.71,28,238 కోట్లు ఉంటే, 2021-22 నాటికి రూ. 68,11,471 కోట్లకు పడిపోయింది. 2023 నాటికి 8.7 శాతం అభివృద్ధి సాధిస్తామని మార్చిలో రిజర్వు బ్యాంకు అంచనా వేసింది. నెలలు గడుస్తున్న కొద్దీ ఈ సంఖ్య క్షీణిస్తుంది. ఏప్రిల్‌లో 7 శాతం, అక్టోబర్‌లో 6.5 శాతానికి తగ్గించుకున్నారు. మార్చి వచ్చే నాటికి ఈ సంఖ్య రూపాయి విలువ లాగా ఎక్కడి వరకు దొర్లుతూ పోతుందో చూడాలి.

కార్పొరేట్లకు ప్యాకేజీలు ఇస్తే...

పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతర్భాగంగా వున్న ఆర్థిక సంక్షోభాన్ని కరోనా పైకి నెట్టి, ప్రపంచ కుబేర సంస్థలు వివిధ దేశాల ప్రభుత్వాల నుండి ఆర్థిక ప్యాకేజిల (ఉద్దీపన పథకాలు) పేరుతో భారీగా ప్రజల సంపదను కాజేశాయి. అమెరికా 1.9 లక్షల కోట్ల డాలర్లు (1.9 ట్రిలియన్‌ డాలర్లు), యూరోపియన్‌ యూనియన్‌ 1.8 లక్షల కోట్ల యూరోల (2.2 ట్రిలియన్‌ డాలర్లు) ప్యాకేజీలలో కార్పొరేటు కంపెనీలు అత్యధికం దోచుకున్నాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ప్రకటించిన ప్యాకేజీల విలువ 16.9 ట్రిలియన్‌ డాలర్లు ఉంటుందని ఐఎంఎఫ్‌ ప్రకటించింది. మన దేశంలో బిజెపి ప్రభుత్వం ఉద్దీపన పథకాలలో భాగంగా కార్పొరేట్‌ పన్ను రేటును 30 శాతం నుండి 22 శాతానికి తగ్గించింది. కరోనాకు సంబంధం లేకుండానే గత ఐదు సంవత్సరాల్లో 10.72 లక్షల కోట్ల బడా కార్పొరేట్‌ రుణాలు రద్దు చేశారు. ఇది కాకుండా 13 కంపెనీలు వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రూ.4.5 లక్షల కోట్ల రుణాలను కేవలం 1.61 లక్షల కోట్లకు 'సెటిల్‌' చేశారు.

కరోనా కాలంలో ప్రజలు తీవ్రమైన కష్టాల్లో వుంటే కార్పొరేట్‌ దిగ్గజాలు మాత్రం మరింత బలపడ్డాయి. ముఖేష్‌ అంబానీ, ఆదానీలు గంటకు రూ. 90 కోట్లు సంపాదిస్తూ ప్రపంచ కుబేరులుగా మారారు. దేశంలోని 24 శాతం మంది భారతీయులు నెలకు రూ. 3000 కంటే తక్కువ ఆదాయం పొందుతుంటే వారి కొనుగోలు శక్తి ఎలా పెరుగుతుంది కరోనా సమయంలో ప్రపంచం మొత్తంలో పేదరికంలోకి దిగజారిన పేదల సంఖ్యలో భారతదేశం లోనే 60 శాతం మంది వున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. 2021లో 68 లక్షల మంది వేతన జీవులు ఉపాధి కోల్పోయారు. 2013లో ఉద్యోగాలు వున్న భారతీయుల సంఖ్య 44 కోట్లు వుంటే 2021 నాటికి 38 కోట్లకు పడిపోయింది. ఈ కారణాల వల్లనే ప్రపంచంలోనూ, భారతదేశంలోనూ ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతుంది.

మేకల రవికుమార్

82474 79824

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ ౭౯౯౫౮౬౬౬౭౨

ఇవి కూడా చదవండి : 31 మంది ఎంపీలు ఏం ఉద్ధరించారు?



Next Story

Most Viewed