వర్గీకరణ కమిటీ కాలయాపనేనా !?

by Disha edit |
వర్గీకరణ కమిటీ కాలయాపనేనా !?
X

మన దేశ సామాజిక సంక్లిష్ట కుల వ్యవస్థలో మాదిగలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గత మూడు దశాబ్దాలుగా అవిశ్రాంత పోరాటం చేశారు. ముఖ్యంగా రిజర్వేషన్లలో మాదిగిలకు జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా మాదిగలందరినీ దేశవ్యాప్తంగా ఐక్యం చేసి ఆత్మగౌరవ ప్రతీకగా మందకృష్ణ మాదిగ అనేక ఉద్యమాలు చేశాడు. మాదిగలకు ఏ.బీ.సీ.డీ. లుగా వర్గీకరణ చేసినట్లయితేనే తమకు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తద్వారా రాజకీయ చైతన్యం తో రాజకీయ అధికారాన్ని చేపట్టి తమ తలరాతను తామే మార్చుకొనే రోజు వస్తుందని, మాదిగలకు గతంలో లేని రాజకీయ జాతి చైతన్యాన్ని, మాదిగ జాతి స్పృహను అనేక సభలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి వారిలో ఆత్మవిశ్వాసం కల్పించాడు. ఆయన నాయకత్వంలో ఉద్యమ పోరాట బాట పట్టిన అనేక మంది మాదిగ సోదరులు తమ అమూల్య ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు.

మోడీకి..ఈ ఉద్యమం తెలియదా?

ఈ ఉద్యమ ప్రస్తానంలో అంతిమంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో హైదరాబాద్‌లో విశ్వరూప మహాసభను భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఏర్పాటు చేయించడం చరిత్రలో చెరగని ఒక మైలురాయి. ఈ సభలో మాదిగలకు సరైన న్యాయం జరిగేలా పార్లమెంటులో చట్టం చేస్తామని మోడీ ప్రకటన చేస్తారని లక్షలాదిమంది మాదిగ సోదరులు ఆశగా ఎదురు చూశారు. రాజ్యాంగ సవరణ చేసి 30 సంవత్సరాల పోరాటానికి స్వస్తి పలికి ఒక నవోదయం వస్తుందని అందరూ ఆశించారు. కానీ, మోడీ వారి ఆశలను మరోసారి వమ్ము చేశాడు. దళిత ఉద్యమ జ్వాలలపై నీళ్ళు కుమ్మరించాడు. ఈ సమస్య పరిష్కారానికి కాలయాపన చేసే మరో కమిటీని వేస్తానని మరో బూటకపు వాగ్ధాన ప్రకటనతో ఒక్కసారిగా మాదిగ సోదరులు నిర్ఘాంతపోయారు. నిరాశతో శాపనార్ధలతో వెనుదిరిగారు. అయితే, మోడీ రాజకీయ ప్రస్థానం తెలిసిన వారికి, ఆయన రాజకీయ ఎత్తుగడలు, గత చరిత్ర ఎరిగిన వారికి ఆయన వాగ్ధానాలలో ఎంత మోసం ఉందో ఇట్టే పసిగట్టగలరు. ఈ విషయాలను మరింత లోతుగా చర్చిస్తూ.. మందకృష్ణ మాదిగ ఏమి ఆశించారు, ఏమి సాధించారు అశేష మాదిగ సోదరుల భవిష్యత్తు ఏమి కానుంది మోడీ వాగ్ధానాలలోని మర్మం ఏమిటనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మాదిగల ఆత్మగౌరవ పోరాటం, వారి డిమాండ్లు ఏమిటో మోడీకి గత పదేళ్ళుగా తెలియదా? నిజానికి మోడీకి చిత్తశుద్ధి అంత ఉంటే పదేళ్లుగా పార్లమెంట్‌లో మెజారిటీ ఉన్న బీజేపీ వర్గీకరణ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఇప్పటికే తాను అనుకున్న బిల్లులను పార్లమెంటులో సుదీర్ఘంగా చర్చలు జరపకుండానే తన పార్టీ కున్న అఖండ మెజార్టీతో అనేక బిల్లులను పాస్ చేయించుకోగలిగిన మోడీకి, ఈ మాదిగల వర్గీకరణ విషయం వచ్చేవరకు మరో కమిటీ విచారణ దాని రికమండేషన్ల అవసరం ఏం వచ్చింది? గత రిపోర్టుల ఆధారాలు సరిపోవా? లేదా మాదిగలకు రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందని ఆయన వ్యక్తిగతంగా విశ్వసించటం లేదా, ఇంతకాలం మాదిగ సమస్యలు పట్టని మోడీజీకి ఇప్పుడే జ్ఞానోదయం అయిందనుకోవాలా?

ఎన్నికల కోసమే సరికొత్త డ్రామానా?

తరచి చూస్తే, తెలంగాణాలో, ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికలలో మాదిగల ఓట్ల కోసమే మోడీ ఈ కొత్త డ్రామా ఆడారు. ఆ ట్రాప్‌లో మందకృష్ణ మాదిగ అమాయకంగా చిక్కుకున్నారా లేక తెలిసే ఇరువురు కలిసి మాదిగ జాతి ఓట్లను గంపగుత్తగా బీజేపికి పడేలా మరో నాటకానికి తెరలేపారా ఇదివరకే, ఈ సమస్యపై అనేక కమిటీల సానుకూల రిపోర్టులు ఉండగా మరో కమిటీ అవసరం ఏమొచ్చింది అనవసర కాలయాపన తప్ప దానితో కొత్తగా మాదిగలకు ఒరిగేదేముంది? మాదిగ సోదరులారా ఇకనైనా మేల్కొనండి, మాదిగల ఆత్మగౌరవాన్ని మనువాద బీజేపీకి తాకట్టుపెట్టకండి. మరోసారి అమాయకపు గొర్రెలలా తల ఊపుతూ మోడీ బూటకపు మాటలకు, ఆశ గొలిపే వాగ్ధానాలకు మోసపోకండి. ఒకటికి పది సార్లు ఆలోచించండి. తన స్వకష్టంతో పెంచి, పోషించిన ఎమ్మార్పీయస్ ఉద్యమాన్ని మోడీ పాదాల వద్ద తాకట్టు పెట్టకండి. మీ భవిష్యత్తును మీరే హేతుబద్ధంగా నిర్ణయించుకోండి. మందకృష్ణ మాదిగపై నమ్మకంతో ఆయన మాటలకు ఇంతకాలం ఎంతో విధేయతతో పోరాటం చేశారు. ఎంతో విలువైన కాలాన్ని, ప్రాణాలను బలి పెట్టారు. చివరకు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ఏ గతి పట్టనుందో మరోసారి ఆలోచన చేయండి.

దళితుల నోటికాడి బుక్క లాగేసి...

అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అనేక సవరణలు చేస్తూ దాని మౌలిక లక్ష్యాలను, ఆదర్శాలను కాలరాసే క్రమంలో ఆర్ఎస్ఎస్ కనుసన్నలలో బీజేపీ మనువాదం వైపు మాదిగలను నడిపించే కుట్ర జరుగుతుంది. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపైన 300 రెట్లు దాడులు పెరిగాయి. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం దళితులపై దాడులకు సంబంధించి 45,398 సంఘటనలు జరిగితే 2023 నాటికి 50,900కు దాడులు పెరిగాయి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని నీరుగార్చడానికి దళితుల జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించకుండా నీతిఆయోగ్‌ను వాడుకుంది. అత్యధికంగా జాబ్ కార్డులు పొంది ఉపాధికి పనికి వెళుతున్న దళితులకు రూ.1.18 లక్ష కోట్ల నుంచి 63 వేల కోట్లకు బడ్జెట్‌ను తగ్గించి వేసింది. దీనితో దళితుల నోటికాడి బుక్క లాగేసింది. జనాభాలో సుమారు 70 శాతం ఉన్న బీసీల కులగణనను చేపట్టబోమని బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు బాహాటంగా వెల్లడించింది. అలాంటప్పుడు మాదిగ సోదరులకు ఎలా న్యాయం చేస్తుంది?

ఒకవైపు మణిపూర్‌లో ఎస్సీ,ఎస్టీలను ఊచకోత కోస్తూ, వారు రిజర్వేషన్ల మంటల్లో దగ్ధమౌతుంటే, అక్కడి మైనార్టీ స్త్రీలపై జరిగిన అకృత్యాలు, అత్యాచారాలు, అవమానాలు మీకు గుర్తుకు రావటం లేదా? దీనిపై మోడీ ఉద్దేశ పూర్వక మౌనంలో అంతరార్ధం మీకు బోధపడటం లేదా? బీజేపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రయోజనాలను కాపాడుతుందని మీరు మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నారా? ఈ పదేళ్ళలో ప్రజా ఉద్యమాలపై బీజేపీ సాగించిన అణచివేతలను గుర్తుకు తెచ్చుకోండి. మానవ హక్కుల కోసం గొంతెత్తిన ఉద్యమకారులకు మోడీ పాలనలో ఏం గతి పట్టిందో మీకు తెలియదా? మైనార్టీ జాతులకు, తెగలకు ఏం జరిగిందో... యదార్ధ సంఘటనలను నిష్పాక్షికంగా సమీక్ష చేయండి.

బిక్షమడుక్కునేవారు బానిసలే!

2018 సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన ఘనత బీజేపీదే. సామాజిక ప్రజా ఉద్యమాల ద్వారా ఆ తీర్పును వెనక్కి పంపి రక్షించుకోవాల్సి వచ్చిన గతాన్ని నెమరువేసుకోండి. గత పదేళ్ల కాలంలో వర్గీకరణ గురించి పల్లెత్తు మాట మాట్లాడని మోడీజీ ఇప్పుడు ఎన్నికల ముందు ఎందుకు మాట్లాడుతున్నారో ఒకసారి దళిత సోదరులు ఆలోచించండి. మాదిగల ఓట్లపై ఉన్న ప్రేమ వర్గీకరణపై లేదని గత పదేండ్ల అనుభవం రుజువు చేయటం లేదా? ఈ బీజేపీ వైఖరి, నక్కజిత్తులను నమ్మకండి. గతంలో వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి వంటి బీజేపీ నేతలు వర్గీకరణ గురించి పలు వాగ్దానాలు చేశారు. మందకృష్ణ మాదిగ వెంకయ్యనాయుడు కాళ్ళు కూడా మొక్కాడు. కానీ వర్గీకరణ అయిందా?

హక్కుల కోసం పోరాట మార్గాన్ని వదిలి బిక్షమడుక్కునేటువంటి వాళ్లు బానిసలే అవుతారని అంబేడ్కర్ చెప్పిన విషయాన్ని దళితులు గుర్తు చేసుకోవాలి. మోడీ రాముడైతే మంద కృష్ణ మాదిగ లక్ష్మణుడుగా ఉండే హక్కు ఆయనకు ఉంది. అది ఆయన వ్యక్తిగతం. ఆయన ఇష్టం. దానితో మాదిగల ఆత్మగౌరవంతో ముడిపెట్టడం ఎందుకు? మంద కృష్ణ మాదిగ కాషాయ కండువా కప్పుకోని బీజేపీలో చేరి చిన్న తమ్ముడిగా ఉండాలనుకొంటే ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. అది ఆయన స్వవిషయం. దానికోసం మాదిగల పోరాట పటిమను బలిపెట్టడం న్యాయం కాదు. కాలయాపన చేసే మరో కమిటీతో మాదిగల డిమాండులు నెరవేరవు. మాదిగ సోదరులు ఈ బూటకపు వాగ్దానాలకు మరోసారి మోసపోరు. బీజేపీ పట్ల మాదిగలు అప్రమత్తంగా ఉండాలి. మాదిగల ఆత్మగౌరవాన్ని ఎవరికి తాకట్టు పెట్టొద్దు. హక్కుల కోసం పోరాటమే మార్గం తప్ప మనువాద పాలకుల పంచన చేరడం సరికాదు. రాజ్యాంగబద్ధంగా హక్కుల కోసం తిరుగుబాటు చేయాలి. రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో మాదిగ సోదరులు స్వేచ్చగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలరు. రాజ్యాంగాన్ని, దళితుల హక్కులను వారే రక్షించుకోవాలి.

డా. కోలాహలం రామ్ కిషోర్

98493 28496


Next Story

Most Viewed