అప్పులు, రాజధానిపై కాగ్ చెప్పిందేంటి?

by Disha edit |
అప్పులు, రాజధానిపై కాగ్ చెప్పిందేంటి?
X

రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, రాజధాని ఏర్పాటు పైన వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలు, విమర్శలు నిరంతరం కొనసాగుతున్నాయి. అప్పులు మీ పాలనలో ఎక్కువ అంటే కాదు మీ పాలనలో ఎక్కువని, రాజధాని ప్రకటనలో చంద్రబాబు లాబీ ఆర్థిక ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని వైసీపీ, రాజధాని మార్పు విషయంలో వైసీపీ లాబీ ప్రయోజనాలు ఉన్నాయని టీడీపీ పరస్పరం వాదులాడుకుంటున్నాయి. ఈ విమర్శల, ప్రతి విమర్శల నేపథ్యంలో కాగ్ నివేదిక వీటిపై నిగ్గు తేల్చిన విషయాలు ఏమిటన్నది చూద్దాం!

ఏపీ ఆర్థిక స్థితిగతులపై 2022 మార్చి 31న కంట్రోలర్ అండ్ ఆడిటర్ (కాగ్) నివేదిక సమర్పించింది. ఇందులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, రెవెన్యూ, రవాణా, రాజధాని తదితర అంశాలను ప్రస్తావించింది. 2021-22 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పులు 3,72,503 కోట్లుగా ఉందని కాగ్ నివేదిక పేర్కొంది. ఇందులో 99% మేర రుణాలు 13.99% వడ్డీతో తీసుకున్నవని చెప్పింది. 2018 నుండి 2022 వరకు అంతర్గత రుణాలు 77.54% పెరిగాయని నివేదిక వెల్లడించింది. గడిచిన ఐదు సంవత్సరాల్లో తలసరి రుణం 61% పెరిగిందని, బడ్జెటే తర రుణాలు కూడా కలుపుకుంటే తలసరి రుణభారం 92,796 రూపాయలు పేర్కొంది. వచ్చే ఏడేళ్లలో 1,29,817 కోట్ల రుణాల్ని తీర్చాల్చి ఉందని కాగ్ వివరించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రెవిన్యూ ఖర్చులు 4.25% పెరిగాయి.

టీడీపీ చేసిన అప్పులు

మొత్తం అప్పుల్లో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు చేసిన అప్పులను కూడా నివేదిక ప్రస్తావించింది. 2014-15 నుంచి 2019 ఫిబ్రవరి వరకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఈ విధంగా ఉన్నాయని, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పుల వాటా 97,123.93 కోట్లుగా ప్రస్తావించింది. 2014-15 లో కొత్తగా చేసిన అప్పు 21,481 కోట్లు కాగా, పాత అప్పుల చెల్లింపు 9,099 కోట్లు, నికర అప్పు 1,48,743కోట్లు. 2015-16లో కొత్త అప్పులు 77,265 కోట్లు ఉంటే తీర్చిన అప్పు 50,859కోట్లు, నికర అప్పు 1,73,854 కోట్లు. 2016-17 లో చేసిన అప్పు 93,619 కోట్లు అయితే, తీర్చిన పాత అప్పు 61,963 కోట్లు కాగా నికర అప్పు 2,01,314 కోట్లు. 2017-18 లో చేసిన కొత్త అప్పు 1,33,687 కోట్లు, తీర్చిన అప్పు 1,08,853 కోట్లు. నికర అప్పు 2,23,706 కోట్లు. 2018-19లో చేసిన అప్పు 1,36,084 కోట్లు, పాత అప్పుల తీర్చినది 97,940కోట్లు. నికర అప్పు 2,37,510 కోట్లు.

వైసీపీ చేసిన అప్పులు

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులు ఇలా ఉన్నాయి. 2019-20 లో కొత్తగా చేసిన అప్పు 1,57,859 కోట్లు కాగా ,పాత అప్పులు తీర్చింది 1,13,197 కోట్లు. పాత అప్పుతో కలిపి నికర అప్పు 3,01,802 కోట్లు. అది 2020-21లో 3,60,333 కోట్లకు, 2021-22 కి 3,98,903 కోట్లకు నికర అప్పు చేరుకుంది. 2023 నాటికి రాష్ట్రం మొత్తం అప్పు 4.42 లక్షల కోట్లని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటించారు. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు 2,37,510 కోట్లు కాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది 2లక్షల 5వేల కోట్లు. టీడీపీ మాత్రం వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు ఇంకా ఎక్కువగా చెబుతున్నది. టీడీపీ, వైసీపీ చేసిన అప్పులలో అత్యధిక మొత్తం వడ్డీల చెల్లింపులకే వినియోగించడం గమనించాల్సిన అంశం. వడ్డీల భారం ఏ విధంగా ఉందో దీన్ని బట్టి వెల్లడవుతోంది.

కేంద్ర ప్రభుత్వం పంచాయితీలకు ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బకాయిలకు జమచేసిందని చెబుతున్నారు. పరిమితికి మించి అప్పులు ఉండటం వలన రాష్ట్రం అప్పుల పాలైందని, ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని తన నివేదికలో కాగ్ పొందుపర్చింది. ఇందుకు కారణం సంక్షేమ పథకాలుగా పేర్కొంటూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 7 నెలల్లో రాష్ట్రానికి వచ్చిన మొత్తం రాబడులు 1,25,111 కోట్లు కాగా, అందులో సగం సంక్షేమ పథకాలకు ఉపయోగించారని, మిగతా సగం పాత అప్పుల మీద వడ్డీలు చెల్లించటానికి, సబ్సిడీ బిల్లులు, ఉద్యోగుల జీతాలకు, పెన్సన్లకు వినియోగించారని, కేవలం 8,739 కోట్లు మాత్రమే పెట్టుబడి వ్యయం చేశారని పేర్కొంది.

సంక్షేమమొక్కటే అప్పులకు కారణమా?

అయితే సంక్షేమ పథకాల వల్లే రాష్ట్రం అప్పుల పాలైందని కాగ్ చెప్పటం సరైన విశ్లేషణ కాదు. బడా పెట్టుబడిదారులకు ఇస్తున్న లక్షల కోట్ల రాయితీలను గమనిస్తే, సంక్షేమ పథకాలకు ఇచ్చేది చాలా తక్కువ. ప్రజల చేతుల్లో డబ్బులు అందటం వలన మార్కెట్‌లో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అందువల్ల సంక్షేమ పథకాలు రాష్ట్ర అప్పులకు కారణం కాదు. సంక్షేమ పధకాల అవసరం లేకుండా ప్రజల ఆర్థిక పరిస్థితి పెరిగే విధంగా భూ సంస్కరణలు అమలు జరపకపోవడం, ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం, పారిశ్రామిక విస్తరణకు చర్యలు తీసుకోకపోవడం వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా మెరుగు పడుతుంది? రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి, పరిశ్రమల అధిపతులకు రాయితీలు కారణంగా రాష్ట్రం అప్పుల పాలైంది. గత టీడీపీ ప్రభుత్వం, నేటి వైసీపీ ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలే. రెండు ప్రభుత్వాలు బడా పెట్టుబడిదారుల, భూస్వాముల ప్రయోజనాలు కాపాడేవే. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వీరి ప్రయోజనాల కోసం ఉపయోగించటం వల్లే రాష్ట్రం అప్పుల పాలైంది. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు అప్పులపై అప్పులు చేస్తూ ప్రజలపై రుణ భారం మోపుతున్నాయి. ప్రజలు ఉద్యమాల్లోకి రాకుండా తమ చట్టూ తిప్పుకునేందుకే సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నాయి.

అమరావతితో అంతులేని ఆర్థిక భారం

అమరావతి రాజధాని గురించి కూడా తన నివేదికలో కాగ్ పేర్కొన్నది. అమరావతి రాజధాని అనేది రాష్ట్రంపై అంతులేని ఆర్థిక భారాన్ని మోపుతుందని కాగ్ నివేదిక హెచ్చరిక చేసింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తక్షణం, భవిష్యత్తులోనూ మోయలేని ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని నివేదిక స్పష్టం చేసింది. గ్రీన్ ఫీల్డ్ రాజధాని పేరుతో నిపుణుల కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా ప్రభుత్వ భూములు విస్తారంగా ఉండే భూముల ప్రాంతాన్ని వదిలి వేసి బయట వ్యక్తుల నుంచి చాలా ఎక్కువ భూములను పూలింగ్ పేరుతో సేకరించిందని స్పష్టం చేసింది. రాజధాని విషయంలో టీడీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలను, భూసేకరణను కాగ్ తీవ్రంగా తప్పు పట్టింది. తగిన విధానం లేకుండా నామినేషన్లపై మాస్టర్ ప్లాన్ కన్సల్టెంట్ ఎంపిక, ఆర్థిక ప్రణాళిక లేకుండా సీఆర్‌డీఏ చేసుకున్న 33,476 కోట్ల ప్యాకేజీ ఒప్పందాలను తప్పు పట్టింది. నిబంధనలకు విరుద్ధంగా జలవనరుల పరిధిలో అనధికారిక గ్రీవెన్స్ సెల్ నిర్మాణం చేపట్టి పనులను 2017 నుంచి 2019 వరకు ప్రారంభించలేదని వెల్లడించింది. కాంట్రాక్ట్ పనుల్లో 1,282.83 కోట్లు అడ్డగోలుగా టీడీపీ ప్రభుత్వం అడ్వాన్స్‌లు ఇచ్చిందని, నామినేషన్లపై కన్సల్టెన్సీలకు, కన్సెల్టెట్లకు ధార పోసింది 28.96 కోట్లుగా నివేదిక వెల్లడించింది. అంతే కాకుండా లోప భూయిష్టంగా డీపీఆర్‌లు ఉన్నాయని, కేంద్రం వివరణ కోరినా స్పందించలేదని, అమరావతిలో పేదలకు, రైతులకు కౌలు చెల్లింపుల్లోనూ అక్రమాలు జరిగాయని కాగ్ నివేదిక వెల్లడించింది. ’కాగ్‘ నివేదిక రాజధానిగా అమరావతిని ప్రకటించడాన్ని తప్పుపట్టింది. శివరామకృష్ణ కమిషన్ సిఫార్సులకు, నిపుణుల సూచనలకు భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం సరికాదని, ఆ నిర్ణయంలో స్వార్థపర ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంది.

పరస్పర ఆరోపణల పర్వం

‘కాగ్’ నివేదికను వైసీపీ, టీడీపీ పార్టీలు తమకు అనుకూలంగా ఉన్న భాగాలను తీసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి కాగ్ పేర్కొన్న దాన్ని తీసుకుని తన రాజకీయ ప్రయోజనం కోసం వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ విమర్శలకు ఉపయోగించుకుంటున్నది. రాజధాని విషయంపై టీడీపీపై విమర్శ కోసం కాగ్ పేర్కొన్న దాన్ని వైసీపీ ఉపయోగిస్తున్నది. ఈ రెండు పార్టీలు కాగ్ నివేదికను తమ రాజకీయ ప్రయోజనాల కోణంలోనే చూస్తున్నాయి తప్ప, అప్పులు, రాజధాని విషయంలో తమ తప్పుడు విధానాలను అంగీకరించే స్థితిలో లేవు.

బొల్లిముంత సాంబశివరావు

రైతు కూలీ సంఘం కార్యవర్గ సభ్యులు

98859 83526



Next Story

Most Viewed