తెలంగాణ ముందు..తర్వాత మేధావుల తీరేంటి!?

by Disha edit |
తెలంగాణ ముందు..తర్వాత మేధావుల తీరేంటి!?
X

ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా తెలంగాణ అస్తిత్వ ఉద్యమం కొనసాగిందో, తెలంగాణ అనంతరం అధికార పరంగా, ఆర్థిక పరంగా అదే ఆధిపత్య వర్గాల కౌగిలిలో ఒదిగిపోయింది. ఇదొక విచిత్రమైన పరిస్థితి. దీన్ని అర్థం చేసుకోవడం తెలంగాణ ఆలోచన పరులకు ఒక అసంబద్ధ సంక్లిష్ట సంశయాత్మక విషయమైపోయింది. అసలు తెలంగాణ ఉద్యమాన్నే, ఈ ప్రాంత ఆధిపత్య వర్గాలు ఒక పద్ధతి ప్రకారం ఒక పథకంగా అమలు చేస్తూ అంతర్గతంగా లోపాయికారిగా తమ చెప్పు చేతుల్లో ఉండేలా, వివిధ ఉద్యమ శక్తుల్ని, వ్యక్తుల్ని ఒక పనిముట్టుగా పరికరంగా క్రమంగా మార్చి వాడుకున్నాయి. మేధావులు అని పిలవబడే ప్రొఫెసర్‌లు, కవులు, కళాకారులు, కాకలుతీరిన కొమ్ములు తిరిగిన అనుభవశాలురు, జర్నలిస్టులు... అందరూ ఆధిపత్యం ఏ రూపంలో ఉన్న దాని స్వరూప స్వభావాలను బేరిజు వేయడంలో, నిర్వచించుకోవడంలో విఫలం చెందారు. అంతేగాక మేధావులు వ్యాఖ్యాతలుగా మారిపోయి అనేక పరిమితులతో భాషా సంస్కృతులపై పని చేశారు. ఇప్పటికీ కొందరు 'అక్షరాల ఊడిగం' చేస్తూనే ఉన్నారు. భౌతిక తెలంగాణ పేరు మీద జనావళికి ఒక భ్రమను సమర్థవంతంగా నాయకత్వం కలిగించగలిగింది. ఆ దిశగా ప్రజలను ధాటిగా మళ్ళించగలిగింది.

అసలు పైకి కనపడే పార్లమెంటరీ ప్రభుత్వాల వెనుక దాగి నడిపించే పెట్టుబడిదారులకు, పాలకులు ఎవరైనా ఫ్రాక్సిలే. ఇది సేవలే అభివృద్ధి అని పిలవబడుతున్న వేళలో బాహాటంగా ప్రాంతీయ దేశీయ అంతర్జాతీయ యవనిక మీద దృశ్యీకరిస్తుంది. వీటి ప్రతి ఫలనాలే నేపథ్యంగా తెలంగాణకు ముందు తెలంగాణ అనంతరం జరిగిన, జరుగుతున్న పరిణామాలను పరివర్తనలను లోతుగా విశ్లేషించే ఒక ప్రయత్నం ఇది.

టీఆర్ఎస్ పురుడుపోసుకొని

తెలంగాణను ఆంధ్రలో కలిపినప్పటి నుండే, అశేష తెలంగాణీయుల మదిలో తమ 'తెలంగాణ రాష్ట్ర కాంక్ష 'అగ్నిపర్వతం కింది లావాలా ఒక్కోసారి మంద్రంగా మరోసారి తీవ్రస్థాయిలో తుకతుక ఉడుకుతూనే ఉంది. అప్పుడప్పుడు ఎగిసి పడుతూనే ఉంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రత్యేక తెలంగాణ పిలుపు తెరపైకి వచ్చి. 1996, నవంబర్ 1న వరంగల్‌లో తెలంగాణ విద్రోహ దినంగా ఎగిరే జెండాల సాక్షిగా, పిదప 1997 ఆగస్టులో సూర్యాపేట కేంద్రంగా మారోజు వీరన్న నిర్వహించిన తెలంగాణ సభ. అనంతరం 1997 డిసెంబర్ 39,30 లలో రెండు లక్షల మందితో వరంగల్‌లో జరిగిన ‘వరంగల్ డిక్లరేషన్’ మలిదశ తెలంగాణ ఉద్యమంలో మైలురాయి. అయితే దీని తర్వాత హైదరాబాద్ కేంద్రంగా 1998 జూలై 4, 5 తేదీలలో జన సభ ఏర్పాటు కావడం తెలంగాణ కాంక్షకు మిక్కిలి నైతిక శక్తిని బలాన్ని చేకూర్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జనసభ తీర్మానాలు నిప్పు మీద కప్పిన నివురును రగిలింప చేశాయి. ఆనాటి అధికార కేంద్రం పంపకాలలో కేసీఆర్ ఊహించిన స్థాయిలో నాటి ప్రభుత్వ అధినాయకుడు సమాదరించకపోవడం దీనికి ఒక ముఖ్య కారణంగా చూడాలి. అదే సమయంలో తెలంగాణపై అమలవుతున్న వివక్ష గురించి మేధావుల భావ ప్రచారం ఊరు వాడని కలుపుతూ వేగంగా సామాన్య ప్రజలలోకి చొచ్చుకపోవడం జరుగుతుండడం జరిగింది. వీటన్నిటి గుండు గుత్తగా తెలంగాణ నాటి నేటి ప్రత్యేక వాదులను, నాయకులను ప్రారంభంలో కలుపుకొని టీఆర్ఎస్ పురుడు పోసుకుంది.

మరోవైపు దేశంలో ఆధునిక అత్యాధునిక భావాల ఘర్షణ రాపిడులు కొనసాగుతున్నాయి. 1990 సంవత్సరంలో దేశంలో ప్రవేశపెట్టబడ్డ నూతన ఆర్థిక విధానాలు ప్రపంచ వాణిజ్య అంతర్జాతీయ జాతీయ పరస్పర అవగాహన ఒప్పందాలు ఒడంబడికలు వేగంగా జరుగుతున్నాయి. రైతులను ముందెప్పుడూ లేనంత వేగంగా కార్మికులుగా మార్చే కార్యక్రమం కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి పాలకుడు సాంఘిక సామాన్య శాస్త్రాల పట్ల తెలిసో తెలియకో తృణీకారం వ్యక్తం చేయడం జరిగింది. వీరు సృష్టించిన వృత్తి విద్యా కోర్సుల అధ్యయనం కోసం విద్యార్థులకు ప్రైవేటు ఇంజనీరింగ్ మెడికల్ కళాశాల ఏర్పాటు ఇబ్బడి ముబ్బడిగా జరిగింది. అప్పుడు ఏ ఇజం లేదు.. ఉన్నదల్లా టూరిజం ఒక్కటే అనే ఊదరగొట్టే ప్రేలాపనలు ఊపందుకున్నాయి .

అందుకే ప్రజాసంఘాలంటే.. చిన్నచూపు

ఈ దశలో దేశంలోని ఒక రాష్ట్రంలో తమ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ అస్తిత్వ ఉద్యమం ఊపిరి పోసుకుంది. ఇది యాదృచ్ఛికంగా వచ్చిన ఉద్యమం కాదు. దీని వెనుక కావలసినంత నేపథ్యం ఉంది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వర్గం ఉమ్మడి రాష్ట్రంలో కమ్మ, రెడ్డిలకే అధికారం తప్ప కలిసి ఉంటే తమకు ఎప్పటికీ అధికారం రాదని గ్రహించింది. అప్పటి అన్ని పార్టీలలోని ఆ కులం నుంచే ఎదిగివచ్చిన నాయకుల మనస్సులలో ఈ వేర్పాటు బీజాలు బలంగా నాటుకున్నాయి. ఈ అదను కాలంలో టీఆర్ఎస్ నాయకత్వం మహామహులను, మేధావులను ఉపయోగించుకోవడం మాత్రమే కాక అవమానించి, అవహేళన చేయడం జరిగింది. అప్పటి ప్రజాసంఘాలన్నిటికీ (తెలంగాణ రచయితల వేదిక ఒక విధంగా మినహాయింపు) టీఆర్‌ఎస్ యే అన్ని విధాల ఆర్థిక అర్థబలాలను బలగాలని చేకూర్చింది. చివరాఖరికి వారిని ప్రీపెయిడ్ నాయకులుగా, ఆర్టిస్టులుగా మార్చి వేసింది.

అందుకే ప్రజా సంఘాల ఉనికి పట్ల దాని నాయకుల పట్ల టీఆర్ఎస్ నాయకత్వం మొదటి నుంచి చిన్నచూపు న్యూనత ప్రదర్శించింది. తెలంగాణ అనంతరం అది మరింత పె(హె)చ్చరిల్లిపోయింది .ఆంధ్ర పెట్టుబడిదారుల గేట్ల ముందు ధర్నాలు, వ్యతిరేక రాస్తారోకోలు, బతుకమ్మ జాతరలు, పత్రికా ప్రకటన అదిరింపులు నిర్వహించి నయాన భయాన పరోక్షంగా, ప్రత్యక్షంగానూ 'ఈతాకు వేసి తాటాకు తీసుకునే' చందాల దందాకు అంకురార్పణ జరిగింది. ఇది ఇలా ఉంటే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నాయకుడు అందుబాటులో ఉండకపోవడం, ఒకవేళ ఉన్నప్పటికీ దర్శనం దొరకకపోవడం, దొరికితే ప్రచారం పేరున డబ్బులు వసూలు చేయడం ఆది నుంచి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూనే ఉంది.

ఫక్తు రాజకీయ పార్టీగా మారి..

ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న మేధావులు ఎన్నడు కూడా ఈ ఖర్చులు వ్యయం నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయని తమను తాము ప్రశ్నించుకోలేదు. తెలిసినా కూడా నాయకత్వాన్ని కించిత్తు అడగ సాహసించలేదు. పైగా నాయకుని పంచలో కాకుంటే చంకలో చేరారు. దీనిని తెలంగాణ ఉద్యమ పరిణామ క్రమంలో పసిగట్టడంలో ప్రజాసంఘాలు విఫలం అయ్యాయి. చివరికి రాష్ట్రం సిద్ధించాక వీరి పాత్ర పెద్ద విషాదాంతంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రజాసంఘాల నాయకులు పట్ల, వాళ్ల బలహీనతల పట్ల నాయకునికి స్పష్టమైన అవగాహన ఏర్పడింది. అందుకే అనంతర కాలంలో అటు రాజకీయ రంగంలో తీసివేతకు గురై, ఇటు ప్రజాసంఘాలలో కూడా నాయకులు నామమాత్రంగా మిగిలిపోయారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ ఉద్యమానికి తిలోదకాలిచ్చి ఫక్తు రాజకీయ పార్టీగా ఎప్పుడైతే మారిందో అవకాశవాద రాజకీయాలకు బాహాటంగా తెర లేపినట్టు అయింది. అర్థం చేసుకున్న నాయకులు కొందరు అసమ్మతి వెలిబుచ్చిన క్షణాల్లో అంచనాలకు అందకుండా వారిని అణచివేశారు. అసలు తెలంగాణ అస్తిత్వం మెల్లమెల్లగా కనుమరుగయింది. సెల్ ఫోన్ల నుండి మెల్ల మెల్లగా తెలంగాణ పాటల రింగుటోన్లు మాయమైపోవడం దీనికి ప్రబల నిదర్శనం.

చేపలు ఇవ్వడమా... పట్టడం నేర్పడమా?

ఉద్యమ కాలంలోనే నాయకుడు చాలామంది పెద్దలకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. అటువంటి నాయకుడు పూర్తి కాల రాజకీయ లీడర్‌గా పరివర్తనం చెందాక అధికారంలోకి వచ్చాక ఆ అవకాశమే బొత్తిగా లేకుండా అయిపోయింది. తన ఇంద్రజాల మ్యాజిక్ బాక్స్‌లోంచి కేవలం ఓట్లను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క పథకాన్ని బయటకు తీసి ప్రజలకు మేలు చేస్తున్నామని భ్రమలు కలిగించాడు నాయకుడు. తన వ్యక్తిత్వంలోని అసలైన మనిషి బయటకు వచ్చి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తత్పలితంగానే ఉపాధి పథకం లాంటి తెలంగాణ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు పుట్టుకొచ్చాయి. ఏ పథకాలు ప్రవేశపెట్టినా ఒక కథ గుర్తుకువస్తుంది. అదేమిటంటే, ఒక రాజు తన ప్రజలకు రోజు ఒక చేప ఇస్తూ నేను ప్రజలకు చాలా మేలు చేస్తున్నాను అనుకున్నాడట. నిజానికి ఏమి జరుగుతుంది అని జనం కళ్ళు తెరిచేసరికి జరగవలసిన నష్టం జరిగింది. ప్రజలకు చేపలు పట్టడం నేర్పాలి.. కానీ చేపలు ఇవ్వడం ఏమిటి? ప్రజలను సమర్థవంతంగా పక్కదారి పట్టించొచ్చని ఏలికలు భావిస్తుంటారు. తెలంగాణ 9 ఏళ్ల పాలనలో అచ్చంగా ఇదే జరిగింది. దానికి తోడు వందలాది సంవత్సరాల నుండి పోగుపడిన సహజ వనరుల సంపద తరలింపు ఇబ్బడి ముబ్బడిగా జరిగింది. ఇది అంతా అభివృద్ధి పేరున జరిగినట్టు ప్రచార ఆర్భాటంతో నమ్మించగలిగారు.

జనాల్ని ఎల్లకాలం మోసగించలేరు

అయితే వామపక్ష మేధావులు, కవులు, రచయితలు, ఈ క్రమాన్ని ప్రజలకు విశదీకరించడంలో విప్పి చెప్పడంలో, గత అనుభవాల నుంచి గతంలోని గుణపాఠాలను అంచనా వేయడంలో వైఫల్యం చెందడం వలన నేటి తెలంగాణలో స్థితిగతులు ఇంత దారుణంగా ఉన్నాయి. ఏదేమైనా కొందరిని కొన్నిసార్లు మోసం చేయవచ్చు.. కానీ అందర్నీ అన్నిసార్లు మాటలతో, బోలు వాగ్దానాలతో మోసం చేయలేమని పాలకవర్గాలు తెలుసుకోవాల్సిన వాస్తవం గ్రహించాలి. దీన్ని నేటి మేటి నాయకమ్మన్యులు తెలుసుకోవడానికి ఇచ్చగించకపోతే వచ్చే ఎన్నికల బరిలో ప్రజా బోనులో ఊహించని విషమ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరికి చేదు అనుభవాన్ని మిగిల్చినా ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు.

జూకంటి జగన్నాథం

కవి, రచయిత

94410 78095



Next Story