ఇది చరిత్రాత్మక మలుపు

by Disha edit |
ఇది చరిత్రాత్మక మలుపు
X

అందుకనే తెలంగాణ రాజకీయ పరిణామాలపై జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తున్నది. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జరగబోయే బహిరంగసభ ఈ దిశలో ఓ స్పష్టమైన సందేశాన్ని ఇవ్వనున్నది. కేవలం బహిరంగసభలకు, ప్రచారాలకే పరిమితం కాకుండా ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులను జాతీయ నాయకత్వం పర్యవేక్షిస్తుంది. దేశం మొత్తం మీద బీజేపీ బలహీనంగా ఉన్న 144 లోక్‌‌సభ నియోజకవర్గాలను పార్టీ నాయకత్వం గుర్తించింది. ఆయా నియోజకవర్గాలలో పోలింగ్‌ బూత్‌ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం చేయడానికి సిద్ధపడుతోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయింది. ఈ కాలంలో ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు, దేశం స్థితిగతులను మార్చిన కీలక నిర్ణయాలు, సాహసోపేత విధానాల గురించి దేశవ్యాప్తంగా ప్రజలకు సవివరంగా వివరించే ప్రయత్నం జరిగింది.

రెండు దశాబ్దాల తర్వాత జూలై రెండు, మూడు తేదీలలో హైదరాబాద్‌‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. కరోనా మహమ్మారి మొత్తం దేశాన్ని కకావికలం చేసిన తరుణంలో రెండున్నరేళ్ల తర్వాత మొదటిసారిగా పూర్తిస్థాయిలో బీజేపీ జాతీయ నేతలందరూ ఓ చోట సమావేశం అవుతున్నారు. జేపీ నడ్డా పార్టీ సారథ్యం స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఈ సమావేశాలు ఈ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ సమావేశాలను హైదరాబాద్‌‌లో ఓ విడిదిగా కాకుండా, భారీ లక్ష్యాలు, రాజకీయ వ్యూహాలతో జరపాలని జాతీయ నాయకత్వం నిర్ణయించింది.

పార్టీ దృష్టి 2024 నాటి ఎన్నికలపైనే ఉన్నదన్నది అందరికి తెలిసిందే. 2014 కన్నా, 2019లో మరిన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఈ పర్యాయం ఇంకా ఎక్కువ స్థానాలను సాధించుకునేందుకు, ఇప్పటి వరకు పార్టీ అంతగా విస్తరించని ప్రాంతాలకు చేరుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. మరోవంక, మనం 75 ఏళ్ల స్వాతంత్ర్యానికి గురుతుగా 'ఆజాదీకా అమృత్ మహోత్సవ్'ను జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా 'నూతన భారత్‌' కోసం ప్రధాని మోడీ దేశ ప్రజలను సమాయత్తం చేస్తున్నారు. వచ్చే 25 ఏళ్లలో దేశాభివృద్ధికి కార్యప్రణాళికను రూపొందించే విధంగా అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు, వ్యవస్థలకు మార్గదర్శనం చేస్తున్నారు. అటువంటి చారిత్రక నేపథ్యంలో ఇక్కడ బీజేపీ సమావేశాలు జరగడం ముదావహం.

ఇక్కడ అధికారం దిశగా

2014లోనే మోదీ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టగానే ఇప్పటివరకు అధికారంలోకి రాని దక్షిణాది రాష్ట్రాలతోపాటు తూర్పు ప్రాంతంలో ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేయడం పట్ల దృష్టి సారించారు. కర్ణాటకలో తప్ప మరెక్కడా ఈ రాష్ట్రాలలో బీజేపీ ఎప్పుడూ అధికారంలోకి రాలేదు. ఒడిశాలో బీజేడీ ప్రభుత్వంలో, ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో కొంతకాలం భాగస్వామిగా మాత్రం ఉంది. ఆ తర్వాత అస్సాం, త్రిపురతోపాటు పలు ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌‌లో అధికారం కోసం గత ఏడాది పెద్ద ప్రయత్నం చేసింది. సుదీర్ఘకాలం ప్రధాన రాజకీయ పక్షాలుగా ఉన్న కాంగ్రెస్‌, సీపీఎంను ఉనికి లేకుండా చేసి, నేడు కీలక ప్రతిపక్షంగా ఉంది.

ఇక ఆ రాష్ట్రంలో భవిష్యత్‌ బీజేపీదే అనడంలో సందేహం లేదు. ఇప్పుడు మొత్తం బీజేపీ నాయకత్వం దృష్టి తెలంగాణపై పడింది. రాబోయే రోజులలో దేశం మొత్తం మీద బీజేపీ మొదటిసారిగా అధికారంలోకి రాగాల రాష్ట్రంగా తెలంగాణను గుర్తించారు. దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో సాధించిన అనూహ్య విజయాలే అటువంటి భరోసా కలిగిస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది బీజేపీయే అన్న ధీమాతో పార్టీ అడుగులు వేస్తున్నది.

ప్రజల వద్దకు విధానాలు

అందుకనే తెలంగాణ రాజకీయ పరిణామాలపై జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తున్నది. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జరగబోయే బహిరంగసభ ఈ దిశలో ఓ స్పష్టమైన సందేశాన్ని ఇవ్వనున్నది. కేవలం బహిరంగ సభలకు, ప్రచారాలకే పరిమితం కాకుండా ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులను జాతీయ నాయకత్వం పర్యవేక్షిస్తుంది. దేశం మొత్తం మీద బీజేపీ బలహీనంగా ఉన్న 144 లోక్‌‌సభ నియోజకవర్గాలను పార్టీ నాయకత్వం గుర్తించింది. ఆయా నియోజకవర్గాలలో పోలింగ్‌ బూత్‌ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం చేయడానికి సిద్ధపడుతోంది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయింది. ఈ కాలంలో ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు, దేశం స్థితిగతులను మార్చిన కీలక నిర్ణయాలు, సాహసోపేత విధానాల గురించి దేశవ్యాప్తంగా ప్రజలకు సవివరంగా వివరించే ప్రయత్నం జరిగింది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా ఎదురైన ఎదురు దెబ్బల నుంచి ప్రపంచంలోని సంపన్న దేశాలకన్నా వేగంగా భారత్‌ కోలుకొంటున్నది. అత్యంత వేగంగా చేపట్టిన టీకాల పంపిణీ ద్వారా దేశంలో 42 లక్షల మంది మృత్యువాతను తప్పించుకున్నారని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేస్తున్నారు. అగ్నిపథ్‌ ద్వారా సైన్యంలోకి ఎంపికలు చేపడుతున్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు అందుబాటులోకి వస్తున్నాయి. తద్వారా భారతీయ యువత ఉజ్వల భవిష్యత్‌ పొందేందుకుకు మార్గాలు ఏర్పడుతున్నాయి.

సాహసోపేత నిర్ణయాలు

అత్యంత వెనుకబడినవర్గానికి చెందిన ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం సాహసోపేత నిర్ణయమే కాగలదు. అట్టడుగు, అణగారిన వర్గాల సాధికారత కోసం ఏ విధంగా బీజేపీ దృష్టి సారిస్తున్నారో ఈ నిర్ణయం వెల్లడి చేస్తున్నది. ఇటువంటి సానుకూల అంశాలతో ప్రజలలోకి మరింతగా చొచ్చుకుపోయే విధంగా హైదరాబాద్‌‌లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశం పార్టీకి దిశా, నిర్ధేశం కావించనున్నది. సుదీర్ఘ మేధోమథనం తరువాత సైన్యం ఎంపికలో సమూల సంస్కరణలకు అవకాశం కల్పించే విధంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ విధానం పట్ల యువతలో ఆగ్రవేశాలు నింపడం కోసం కొన్ని ప్రతిపక్షాలు ప్రయత్నం చేసినా ఎక్కువ రోజులు నిలవలేదు. వాస్తవాలు గ్రహించి నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్దేశ్యాలను అర్థం చేసుకుంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల పట్ల అపోహాలు కలిగించడంలో ప్రతిపక్షాలు పాక్షికంగా విజయవంతమయ్యాయి. ఉద్యమాలు తీవ్రంగా జరిగిన ఉత్తరప్రదేశ్‌‌లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించింది. హర్యానాలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికలలోనూ రైతు ఉద్యమం తీవ్రంగా కొనసాగిన పట్టణాలలో సహితం విజయాలు సాధించడం గమనార్హం. క్రమంగా ప్రజానీకం ప్రతిపక్షాల కుయుక్తులను అర్థం చేసుకొంటున్నారని దీన్ని బట్టి స్పష్టం అవుతున్నది. ఒడిశాలో ప్రస్తుతం బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. తెలంగాణాలో పేరుకు కాంగ్రెస్‌ ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ ఆ పార్టీకి ఓటు వేస్తే, గెలుపొందినవారు ఆ తర్వాత అమ్ముడుపోతారని ప్రజానీకం తెలుసుకున్నారు. బీజేపీ మాత్రమే కేసీఆర్‌ అరాచక పాలన నుంచి విముక్తి కలిగించగలదని గ్రహిస్తున్నారు. బీజేపీకి లభిస్తున్న అనూహ్య స్పందనే ఇందుకు ఉదాహరణ.

మోదీ పిలుపునకు స్పందనలు

ఈ సంవత్సరం చివరిలో గుజరాత్‌, హిమాచల్‌‌ప్రదేశ్‌‌లో, వచ్చే ఏడాది కర్ణాటక, తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌‌గడ్‌ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ దృష్ట్యా హైదరాబాద్‌ లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కీలకం కానున్నాయి. పార్టీ శ్రేణులకు స్పష్టమైన సందేశం, కార్యాచరణ ప్రణాళికలను ఇవ్వడంతోపాటు రాబోయే రోజులలో బీజేపీ ప్రభుత్వాలు అనుసరించే విధానాలకు మార్గదర్శనం కూడా చేసే అవకాశం ఉంది.

ఇప్పటికే దేశంలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాలలో దేశ ప్రజలకు పిలుపిచ్చారు. ఈ పిలుపునకు ప్రజల నుంచి నిర్ణయాత్మక స్పందనలు ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో చూసాం. ఈ పిలుపు కారణంగా దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న కాంగ్రెస్‌ నిస్తేజంగా మారుతున్నది. మహారాష్ట్రలో శివసేన పరిస్థితితోపాటు, తెలంగాణలోని టీఆర్‌ఎస్ సొంత శ్రేణుల నుంచి తిరుగుబాటు ధోరణులను ఎదుర్కొంటున్నాయి. దేశంలో జాతిహితం, ప్రజల శ్రేయస్సు, దేశ అభివృద్ధి లక్ష్యంగా విధానపరమైన రాజకీయాల కోసం బీజేపీ ఆరాటపడుతుంది. అవినీతి లేని, వారసత్వ రాజకీయాలు లేని దేశభవిష్యత్‌ను బీజేపీ కాంక్షిస్తుంది. ఉజ్జ్వల భారతావని నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేస్తుంది. ప్రతి భారతీయ పౌరుడు దేశాభివృద్ధికి పాల్పడేలా బీజేపీ చైతోన్ముఖుడిని చేస్తుంది.

బండి సంజయ్‌‌కుమార్‌

ఎంపీ, కరీంనగర్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు


Next Story

Most Viewed