నో డ్రగ్స్ కంట్రీగా మార్చలేమా?

by Disha edit |
నో డ్రగ్స్ కంట్రీగా మార్చలేమా?
X

మాదకద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగిపోతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి విముక్తి పొందడానికి డి-అడిక్షన్ కేంద్రాలు ఉన్నప్పటికీ, అవీ కేవలం ఆల్కహాల్, కల్లు అలవాటును మాన్పించేందుకే పని చేస్తున్నాయి. మాదక ద్రవ్యాలను మాన్పించే కేంద్రాలు పెద్ద పెద్ద నగరాలలోనే ఉండటంతో చాలా మందికి ఉపయోగపడడం లేదు. వాస్తవాలను పంచుకోవడానికి ముందుకు రండి. సంక్షోభ సమయాలలో చికిత్స- సంరక్షణ వనరుల వరకు సహకరించండి.

ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపెడుతున్న అంశాలలో 'మాదక ద్రవ్యాల తయారీ-అక్రమ రవాణా- క్రయవిక్రయాలు-వినియోగం' అతి ముఖ్యమైనవి. వీటిని అరికట్టడానికి వివిధ దేశాలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కఠిన చట్టాలనూ, శిక్షలనూ అమలు చేస్తున్నాయి. కొన్ని దేశాలు అయితే దీనిని 'యుద్ధ సమాన' తీవ్రతగా పరిగణించి చర్యలు తీసుకుంటున్నాయి. అయినా, మాదక ద్రవ్యాల నిర్మూలనలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం యేటా జూన్ 26న జరుపుతారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలు ఈ సందర్భంగా, చట్టవిరుద్ధ మాదకద్రవ్యాలు సమాజానికి కలిగించే ప్రధాన సమస్యపై అవగాహన కలిగించడంలో సహాయపడతాయి. అందరూ కలిసి పోరాడితే సమస్యను మనం పరిష్కరించగలం. మాదక ద్రవ్యాలు మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగించే పదార్థాలు. వీటిని ప్రపంచమంతా డ్రగ్స్ అని వ్యవహరిస్తారు. మాదకద్రవ్యాల వాడకం ఒక ప్రమాదకర వ్యసనం (Addiction). యువతరాన్ని దారి మళ్లించి చెడు మార్గాలలో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కన్నా తీవ్ర ప్రభావం ఉంటుంది. ప్రపంచ‌వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6 శాతం జనాభా అనగా 185 మిలియన్‌ల మంది ఇలా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనా.

అనేక రకాలుగా

మాదక ద్రవ్యాలు నల్ల బజారులో అందుబాటులో ఉంటున్నాయి. వివిధ ప్రాంతాలలో సంకేత నామాలతో చెలామణిలో ఉన్నాయి, నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్, గంజాయి, మారిజువానా, కొకైన్, ఎల్ఎస్‌డీ ఇందులో ముఖ్యమైనవి. వీటిని కొందరు అక్రమ వ్యాపారాలతో దొంగ రవాణాకు పాల్పడుతూ కోట్లాది రూపాయలను గడిస్తుంటే, యువత వానిని వినియోగిస్తూ చెడిపోతున్నారు. వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులవుతున్నారు. ఒకసారి దీనికి బానిసలైన తర్వాత వీటిని సంపాదించడానికి ఎంతటి అకృత్యాలు, నేరాలు చేయడానికైనా వారు వెనుకాడరు.

అలవాటుకు కారణాలు

తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పిల్లల ముందే మత్తు పదార్థాలను వినియోగించడం. ఒత్తిడిని తట్టుకోలేని సున్నిత మనస్కులు. పట్టణాలలో పెరుగుతున్న వలసల ప్రభావం. పెరిగిపోతున్న సామాజిక, ఆర్థిక అంతరాలు. కనుచూపుమేరలో దొరికే మత్తు పదార్థాలు. బిజినెస్‌మెన్ ,సేల్స్‌మెన్, నిరుద్యోగులు, ప్రేమ, పరీక్షలో ఫెయిల్ అయినవారు. పాశ్చాత్య పోకడలు-టీవీ, మీడియా ప్రభావం, పలు జాతీయ సర్వేల ప్రకారం మత్తు పదార్థాలు సేవించే వారిలో 25 శాతం మందిలో ఆత్మహత్య ఆలోచనలు కలుగుతాయి.

25 శాతం మంది శారీరక సమస్యలకు గురవుతారు. 42 శాతం ఒత్తిడికి, మానసిక సమస్యలతో బాధపడతారు. 25 శాతం మంది భార్యల నుండి విడాకులు కోరుతున్నారు. 40 శాతం నేరపూరిత ఆలోచనలతో గడుపుతున్నారు. యువత 45 శాతానికి పైగా సెక్స్ లో విఫలమవుతున్నారు. 24 శాతం మంది స్థూలకాయంలాంటి సమస్యలతో బాధపడుతుంటారు. మద్యం మత్తులోనే 90 శాతం నేరాలు. ఘోరాలు జరుగుతున్నాయి.

ఆదాయమే ముఖ్యమా?

తెలంగాణ సర్కారు ఆదాయం పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలతో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. గంజాయి, డ్రగ్స్ లాంటివి లక్షలాది కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లు, బెల్ట్ షాపులకు (అనధికార) సర్కారు యథేచ్ఛగా అనుమతులిచ్చింది. ఎనిమిదేండ్ల క్రితం 30 నుంచి 32 పబ్బులుంటే, నేడు వాటి సంఖ్య 100కు దాటింది. ఇందులో 70 శాతం రాజకీయ నాయకులు లేదా వాళ్ల అనుచరులే నడిపిస్తున్నారు. పర్మిషన్ ఇవ్వడంలో ఉన్న శ్రద్ధ, వాటి నియంత్రణలో లేకపోవడం చాలా బాధాకరం.

తెలంగాణ వచ్చినప్పుడు 2,216 వైన్ షాప్స్ ఉండగా, వాటి సంఖ్య ప్రస్తుతం 2,620 కి పెరిగింది, 2014లో 1,060 బార్లు ఉండగా, నేడు 1,220కి పెరిగాయి. తెలంగాణ వచ్చిన 2014 సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు లిక్కర్ ఆదాయం మూడు రెట్లు పెరిగింది. అనాడు రూ 10,800 కోట్లు ఉండగా, 2021-22 లో 31 వేల కోట్లు దాటింది. నేడు పల్లెలలో మద్యం ఏరులై పారుతోంది. ఫలితంగా యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు.

డి -అడిక్షన్ కేంద్రాలు

మాదకద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగిపోతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి విముక్తి పొందడానికి డి-అడిక్షన్ కేంద్రాలు ఉన్నప్పటికీ, అవీ కేవలం ఆల్కహాల్, కల్లు అలవాటును మాన్పించేందుకే పని చేస్తున్నాయి. మాదక ద్రవ్యాలను మాన్పించే కేంద్రాలు పెద్ద పెద్ద నగరాలలోనే ఉండటంతో చాలా మందికి ఉపయోగపడడం లేదు.

వాస్తవాలను పంచుకోవడానికి ముందుకు రండి. సంక్షోభ సమయాలలో చికిత్స- సంరక్షణ వనరుల వరకు సహకరించండి. భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. 'రండి చేయీ చేయీ కలుపుదాం. భారత్‌ను 'నో డ్రగ్స్ కంట్రీ' గా చేసే మహా యజ్ఞములో భాగస్వాములం అవుదాం. అందరూ కలిసి పోరాడితే సమస్యను పరిష్కరించగలం.

(నేడు యాంటీ డ్రగ్స్ డే)

డా. బి. కేశవులు ఎండీ

చైర్మన్, తెలంగాణా మేధావుల సంఘం

85010 61659



Next Story