ఆపద్బాంధవుడు వైఎస్ఆర్

by Disha edit |
ఆపద్బాంధవుడు వైఎస్ఆర్
X

దేశంలో ఉన్న అందరు రాజకీయనాయకులు తాము పేదల కోసం పరితపిస్తున్నామనే విధంగా రాజకీయ అస్తిత్వం చాటుకునే ప్రయత్నం చేస్తారు. పేదల బతుకులు బాగు చేస్తామని అనేక మాటలు చెప్పి అధికారాన్ని సంపాదించుకున్నవారే తప్ప వారి కోసం నిజంగా చిత్తశుద్ధితో పని చేసినవారు అరుదు. దళితులు, గిరిజనులు, సామాన్యుల కోసం పాటుపడిన ప్రభుత్వాలు ప్రస్తుతం కనిపించడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలలో న్యాయం జరుగుతుందని తెలంగాణ వాసులు ఆశించారు. కానీ, ఏం జరుగుతోందో కండ్ల ముందు కనిపిస్తూనే ఉంది. పేదల కోసమే కాకుండా అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కృషి చేసిన ఏకైక నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా, రెండుసార్లు సీఎంగా పనిచేసిన ఆయన పేద ప్రజల గుండెలలో దేవుడిగా నిలిచిపోయారు.

ఉమ్మడి రాష్ట్రంలో 1,467 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేదల కష్టసుఖాలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉచిత కరెంటు, పంట రుణాల మాఫీని అమలు చేసి రైతుల రందిని తీర్చారు. 1949 జూలై 8న కడప జిల్లా జమ్మలమడుగులో జయమ్మ-రాజారెడ్డి దంపతులకు వైఎస్‌ఆర్ జన్మించారు. బళ్లారిలో పాఠశాల విద్యను అభ్యసించారు. విజయవాడ లయోలా కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్యవిద్యలో పట్టా అందుకున్నారు. విద్యార్థి దశలోనే ఎస్‌వీఆర్ఆర్ కళాశాలలో హౌస్‌ సర్జన్స్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వైద్యాధికారిగా జమ్మలమడుగు, పులివెందులలో కొంతకాలం పనిచేశారు. తదుపరి రాజకీయాలలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ప్రవేశపెట్టిన ప్రతీ పథకం పేదల ప్రజల జీవితాలలో గొప్ప వెలుగులు నింపింది.

ప్రతి పథకం పేదల కోసమే

ప్రతిష్టాత్మక ప్రభుత్వ పథకాలకు వైఎస్‌ఆర్ ఆపద్బాంధవుడిలా నిలిచారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించారు. ఏక కాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచారు. దళిత, బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం ఫీజు రియింబర్స్‌మెంట్ పథకం అమలు చేశారు. ఎందరో పేద విద్యార్థులను ఇంజినీర్లుగా, డాక్టర్లుగా తీర్చిదిద్దారు. ప్రతీ నిరుపేదకూ ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో లక్షలాది ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి వారి సొంతింటి కలను నిజం చేసిన మహోన్నత నాయకుడు.

సామాన్య, మధ్యతరగతి ప్రజల కోసం నిరంతరం కృషి చేసి గుణాత్మక విలువలతో కూడిన పాలన అందించి, అనేక మంది ఆప్తులను సంపాదించుకున్న మహానేత వైఎస్ఆర్. తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోతారనడంలో సందేహం లేదు. ఆయన పట్టుదల, ప్రజల పట్ల ప్రేమ, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలనే తపన, సంక్షేమంలో విశేష కృషి ఆదర్శనీయం. వైఎస్‌ఆర్ నడక, ఆలోచన అంతా పేదల కోసమే. 'మీ కోసం నేనున్నాను' అంటూ అనేక మందికి అండగా నిలిచారు. అందుకే ఆయన చిరస్మరణీయుడు.

(నేడు డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి)


సంపత్ గడ్డం

దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు

కామారెడ్డి, 7893303516.



Next Story

Most Viewed