మనం చేసే వృథా ఆహారం విలువెంతో తెలుసా?

by Disha edit |
మనం చేసే వృథా ఆహారం విలువెంతో తెలుసా?
X

దేశంలో ఆహార ఉత్పత్తులు జనాభాకు సరిపడా పెరగడం లేదు. దానికి కారణాలు రియల్ ఎస్టేట్, రోజూ రెండు వేల మంది వ్యవసాయం వదిలేయడం, వాతావరణం అనుకూలించకపోవడం. వ్యవసాయ రంగంపై పరిశోధనలు జరగకపోవడం, పండించిన పంట వృధా చేయడం, పంట కోత వంటి కారణాలతో ఆహార కొరత ఏర్పడుతుంది. ఇది తీరాలంటే ఆహార నిల్వ సామర్థ్యం పెంచాలి, ఆహార వృథాపై అవగాహన పెంచాలి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలి. వీటిపై ప్రభుత్వాలు ప్రజలు చిత్తశుద్ధితో పని చేయాలి. ఆహార ప్రాముఖ్యత తెలియజేస్తూ పాఠాలు కార్యక్రమాలతో ప్రజలకు అవగాహన కల్పించాలి. రైతులకు రుణ సదుపాయం పెంచాలి, వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించాలి.

నం తినే ప్రతి ఆహారపు గింజను వృథా చేయకుండా కాపాడితే, మనం గింజను పండించినట్టే. ఆహారం వృథా చేయకపోతే దేశ సంపద సృష్టించినట్టే. మనం బతకాలంటే ఆహారం తినాలి. దానిని వృథాగా పారేయడానికి నిమిషం చాలు, కానీ అదే ఆహారాన్ని పండించడానికి ఆరు నెలల సమయం పడుతుంది. విత్తనం నుంచి తినే వరకు 18 రూపాలలో 22 మంది వ్యక్తుల కష్టంతో అది ఆహారపు గింజగా మారుతుంది. రైతు, భూమి, నీరు, పశువులు, ఎరువులు, కూలీలు, కరెంట్ మొదలైనవి.

మన దేశంలో పేదలు తాను సంపాదించిన డబ్బులలో 60 నుంచి 80 శాతం వరకు ఆహారానికే ఖర్చు పెడుతున్నారు. అయినా వారికి పోషకాహారం అందడం లేదు. ప్రపంచ దేశాలలో చాలా దేశాలు తిండి లేకుండా మాడుతున్నాయి. మరోవైపు ఉత్పత్తవుతున్న ఆహారధాన్యాలలో 35 శాతం వృథా అవుతున్నాయి. 'ఫుడ్ ఆండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్' ప్రకారం ప్రపంచవ్యాప్తంగా యేటా 130 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు వృథా అవుతున్నాయి. దీని విలువ సుమారు 75,000 కోట్ల డాలర్లు.

ఇంకో తరానికి వెళ్లే చక్రం

ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం దేశంలో పండించిన పండ్లు, కూరగాయలు రైతు నుంచి వినియోగదారుడికి చేరే మధ్యకాలంలో 40 శాతం వృథా అవుతున్నాయి. వీటి విలువ సుమారు రూ.58 వేల కోట్ల రూపాయలు. ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో 822 మిలియన్ల మంది బాధపడుతున్నారు. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలో ఆకలి చావులు పెరుగుతున్నాయి ఆకలి సూచి 2021-22 ప్రకారం 101 స్థానంలో, ఫుడ్ సెక్యూరిటీలో 71 వ స్థానం ఉంది. దేశంలో ఆకలి, పోషకాహార లక్ష్యాలను 2025 నాటికి కోల్పోతుందని 'గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్టు-2020' తెలిపింది. ప్రతి సంవత్సరం 'ఫుడ్ ఆండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్' ఏర్పడిన అక్టోబర్ 16 ను 'ప్రపంచ ఆహార దినోత్సవం' గా జరుపుకుంటాం.

దీని ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆహార భద్రత, ఆరోగ్యకర జీవితం, నాణ్యమైన ఆహారం అందించడం. ఈ సంస్థ 2030 నాటికి ఆకలి లేని ప్రపంచంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్థ 130 పైగా దేశాలలో పని చేస్తుంది. పోషకాహార లోపం ఒక తరం నుండి ఇంకో తరానికి వెళ్లే చక్రం. దీంతో పుట్టే పిల్లలు ప్రతి ఐదు నిమిషాలకు ఒకరు పొత్తిళ్లలోనే చనిపోతున్నారు, పిల్లలలో మానసిక, శారీరక ఎదుగుదల తగ్గుతోంది, పాఠశాలకు ఎక్కువగా డ్రాపౌట్ అవుతున్నారు, చదువు రాక తక్కువ స్థాయి ఉద్యోగాన్ని చేసుకొని జీవిస్తున్నారు.

వాటిపై అవగాహన పెంచాలి

దేశంలో జనాభా 130 కోట్లు. ఎఫ్‌ఏఓ అంచనా ప్రకారం పీడీఎస్ ద్వారా 81 కోట్ల మందికి నిత్యావసర సరుకులు అందుతున్నాయి. పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు 20 కోట్లు. ఈ సంఖ్య ప్రపంచంలో మూడవ వంతు ఉండటం బాధాకరం. ఐదు సంవత్సరాల లోపు పిల్లలు 34 శాతం, వృద్ధులు 15 శాతం, 15 నుంచి 49 సంవత్సరాల లోపు మహిళలు 51 శాతం పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 'ఎఫ్‌సీఐ గోడౌన్లలో ఆహారధాన్యాలు- ప్రజల కడుపులో ఆకలిమంటలు' లాగా ఉంది పరిస్థితి. దేశంలో ఆహార ఉత్పత్తులు జనాభాకు సరిపడా పెరగడం లేదు. దానికి కారణాలు రియల్ ఎస్టేట్, రోజూ రెండు వేల మంది వ్యవసాయం వదిలేయడం, వాతావరణం అనుకూలించకపోవడం. వ్యవసాయ రంగంపై పరిశోధనలు జరగకపోవడం, పండించిన పంట వృథా చేయడం, పంట కోత వంటి కారణాలతో ఆహార కొరత ఏర్పడుతుంది. ఇది తీరాలంటే ఆహార నిల్వ సామర్థ్యం పెంచాలి, ఆహార వృథాపై అవగాహన పెంచాలి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలి. వీటిపై ప్రభుత్వాలు ప్రజలు చిత్తశుద్ధితో పని చేయాలి. ఆహార ప్రాముఖ్యత తెలియజేస్తూ పాఠాలు కార్యక్రమాలతో ప్రజలకు అవగాహన కల్పించాలి. రైతులకు రుణ సదుపాయం పెంచాలి, వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించాలి. వ్యవసాయం లాభసాటిగా చేస్తే యువత వ్యవసాయ రంగం వైపు వస్తారు. దీనితో ప్రజలకు తగినంత ఆహారం అందించగలము. అప్పుడే ఆహార భద్రత సాధించగలము.

(నేడు ప్రపంచ ఆహార దినోత్సవం)


పులి రాజు

సామాజిక కార్యకర్త

9908383567

Next Story

Most Viewed