రియల్ వకీల్‌సాబ్ ఎవరో తెలుసా?

by Disha edit |
రియల్ వకీల్‌సాబ్ ఎవరో తెలుసా?
X

చుండూరు హత్యాకాండ కేసులో హైకోర్టులో అత్యున్నత వాదనలు వినిపించి దళిత హక్కులకు బాసటగా నిలిచారు. అటవీ హక్కుల కోసం గిరిజనులు చేసిన పోరాటానికి బాసటగా నిలిచారు. ఈ చట్టం ద్వారానే గిరిజనులకు 2009లో భూముల పంపిణీ జరిగింది. ఉన్నత న్యాయస్థానం లో బలమైన వాదనలువినిపించి 'పోలీసులపై కూడా న్యాయ విచారణ జరిపించాలి' అనే తీర్పుని తీసుకురాగలిగారు. ఆ తీర్పు రావడం వెనకా బాలగోపాల్ 30 యేళ్ల నిర్విరామ కృషి ఉంది. అనేక హక్కుల సంఘాలతో మిళితమైన ఈ కేసులో బాలగోపాల్‌తో పాటు కేజీ కన్నబీరన్, బొజ్జా తారకం తదితరులు వాదనలు వినిపించారు. హక్కుల అమలు కోసం ఉద్యమిస్తూనే, ఎన్నో కేసులు వాదించి 'అత్యంత నిబద్ధత గల న్యాయవాది'గా చరిత్ర సృష్టించారు.

సాధారణ మేధస్సు, నిరంతర అధ్యయనం, విస్తృత విషయ పరిజ్ఞానం, వాగ్ధాటి, రచనా కౌశలం, ఆత్మీయత, ఆచరణ శీలత, నిబద్ధత, నిమగ్నత, కార్యదీక్ష, అంకితభావం, మానవీయతా సుగుణం ఈ లక్షణాలన్నింటిని తనలో మూర్తీభవింపజేసుకున్న అపురూప మేధావి బాలగోపాల్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తలెత్తిన హక్కుల ఉల్లంఘనలపై ఆయన ఉద్యమించారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హక్కుల ఉద్యమాలకు ఆయన 'దశ-దిశ'ను నిర్దేశించారు.

బాలగోపాల్ మధ్య తరగతి బ్రాహ్మణ పండిత కుటుంబంలో 1952 జూన్ 10న నాగమణి, పార్థనాథశర్మ దంపతులకు జన్మించారు. నిరంతరం పేద, దళిత, గిరిజన, మైనారిటీ, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. గణితశాస్త్ర విద్యార్థి అయిననూ చరిత్ర, తత్వశాస్త్రం, అర్థశాస్త్రాలను విస్తృతంగా అధ్యయనం చేసి సమాజ పోకడలను సునిశితంగా పరిశీలించారు. రాజ్యాంగంలో పటిష్టంగా కల్పించిన హక్కులను కూడా నిరంకుశ ప్రభుత్వాల అణచివేత విధానాలతో పౌరులు పొందలేకపోవడాన్ని చూసి చలించారు. అందరూ హక్కులు పొందే స్థితి ఒనగూరాలని ఆశించి హక్కుల ఉద్యమ దిశగా ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగించారు.

బాధితులకు అండగా

'అసమానతలు లేని సమాజం ఆవిష్కరింపబడాలి' అనే ఆదర్శం బాలగోపాల్‌లో బలంగా ఉండేది. ప్రతి మనిషికి ఒకే విలువ ఉన్నపుడు, ప్రతి హక్కుని ప్రతి మనిషి అమలు చేయించుకోగలిగినపుడు అసమానతలు లేని సమాజం సాధ్యం అవుతుంది' అని ఆయన బలంగా విశ్వసించారు. వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఆర్‌ఈసీ)లో చదువుతున్నపుడు రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్‌ఎస్‌యూ) కార్యక్రమాలను చూసి రాజకీయ, తాత్విక సంఘర్షణలకు లోనయ్యారు. నమ్మిన రాజకీయాల కోసం విద్యార్థులు ప్రాణాలు పణంగా ఇవ్వడం ఆయనను ప్రభావితం చేసింది. కమ్యూనిస్టులు వాస్తవాన్ని అతిశయం చేసి చెబుతారని మొదట అనుకున్న బాలగోపాల్ ఆ తరువాత వారు తమ విశ్వాసాల కోసం ప్రాణాలు పణంగా పెట్టడాన్ని గమనించి తన వైఖరిని మార్చుకున్నారు.

ఆర్‌ఎస్‌యూ నాయకులు సూరపనేని జనార్దన్ ఎన్‌కౌంటర్, జన్ను చిన్నాలు హత్య తర్వాత ప్రజల కోసం క్రియాశీలక కార్యకర్తగా పని చేయాలని నిర్ణయించుకున్నారు. 1981లో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం లో చేరారు. వరంగల్ రాజకీయ పరిస్థితులు లెక్కల మేధావిగా ఉన్న బాలగోపాల్‌ను హక్కుల కార్యకర్తగా తీర్చిదిద్దాయి. 1983 ఖమ్మంలో జరిగిన రాష్ట్ర రెండవ మహాసభలో బాలగోపాల్ పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో అధ్యాపక ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి కాలపు హక్కుల కార్యకర్తగా కొనసాగారు. పౌర హక్కుల సంఘంలో గుణాత్మక మార్పులు తీసుకువచ్చారు. తదనంతర పరిణామాలతో పౌర హక్కుల సంఘం నుంచి వైదొలిగి 1998 అక్టోబర్ 11న 'మానవ హక్కుల వేదిక'ను స్థాపించారు.

ఆ కేసులే వాదిస్తూ

బాలగోపాల్ 1997లో హైకోర్టులో న్యాయవాదిగా తన పేరుని నమోదు చేయించుకున్నారు. సీనియర్ న్యాయవాది కేజీ కన్నబీనర్ దగ్గర సలహాలు తీసుకొని ముందుకు సాగారు. ప్రధానంగా హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులను వాదించేవారు. బాధితుల పక్షాన నిలబడి, ఉన్నంత మేరకు ఫలితాలను అందించారు. ఉచితంగానే చాలా కేసులు వాదించారు. దళితులు, గిరిజనులు, కార్మికులు, ఉద్యోగులు భూ వివాదాలకు సంబంధించిన అన్ని కేసులను వాదించారు. నక్సల్స్‌కు సంబంధించి అనేక హెబియస్ కార్పస్ పిటిషన్‌లు వేశారు. వారిని కోర్టులకు హాజరుపరిచేలా నిరంతర కృషి చేశారు. చుండూరు హత్యాకాండ కేసులో హైకోర్టులో అత్యున్నత వాదనలు వినిపించి దళిత హక్కులకు బాసటగా నిలిచారు.

అటవీ హక్కుల కోసం గిరిజనులు చేసిన పోరాటానికి బాసటగా నిలిచారు. ఈ చట్టం ద్వారానే గిరిజనులకు 2009లో భూముల పంపిణీ జరిగింది. ఉన్నత న్యాయస్థానం లో బలమైన వాదన వినిపించి 'పోలీసులపై కూడా న్యాయ విచారణ జరిపించాలి' అనే తీర్పుని తీసుకురాగలిగారు. ఆ తీర్పు రావడం వెనకా బాలగోపాల్ 30 యేళ్ల నిర్విరామ కృషి ఉంది. అనేక హక్కుల సంఘాలతో మిళితమైన ఈ కేసులో బాలగోపాల్‌తో పాటు కేజీ కన్నబీరన్, బొజ్జా తారకం తదితరులు వాదనలు వినిపించారు. హక్కుల అమలు కోసం ఉద్యమిస్తూనే, ఎన్నో కేసులు వాదించి 'అత్యంత నిబద్ధత గల న్యాయవాది'గా చరిత్ర సృష్టించారు. ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుని 2009, అక్టోబర్ 8న కన్నుమూశారు.

(నేడు బాల గోపాల్ వర్ధంతి)


జేజేసీపీ బాబూరావు

94933 19690

Next Story

Most Viewed