సమాన గ్రాట్యుటీ అందించాలి!

by Disha edit |
సమాన గ్రాట్యుటీ అందించాలి!
X

ఒకే కుటుంబం ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అనే నినాదంతో సింగరేణి సంస్థలో కార్మికులు, అధికారులు కలిసికట్టుగా పనిచేస్తూ ప్రతి సంవత్సరం ఉత్పత్తి లక్ష్యాలు సాధిస్తున్నారు. సింగరేణిలో పనిచేసి దిగిపోయిన అధికారులకు, కార్మికులకు భారత ప్రభుత్వం రూపొందించిన ‘గ్రాట్యుటీ పేమెంట్ యాక్ట్ 1972’ ప్రకారం 20 లక్షల గ్రాట్యుటీ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా చెల్లించబడుతుంది. గ్రాట్యుటీ చెల్లింపు పనిచేసిన 30 సంవత్సరాల సర్వీసుకు ప్రతి సంవత్సరానికి 15 రోజుల జీతం, 30 సంవత్సరాల సర్వీస్ దాటిన ప్రతి సంవత్సరానికి 30 రోజుల జీతం చొప్పున లెక్కగట్టి చెల్లిస్తున్నారు.

కానీ బొగ్గు సంస్థలైన సింగరేణి, కోల్ ఇండియా మాత్రం దీనిని గతంలో రెండు విధాలుగా చెల్లించాయి. అధికారులకు వారి పే రివిజన్ అమలు తేదీ 1-1-2017 గ్రాట్యుటీ సీలింగ్ 20 లక్షలు అమలు పరచి చెల్లిస్తున్నారు. కానీ బొగ్గుగని కార్మికులకు పదవ బొగ్గు జాతీయ వేతన ఒప్పందం (నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ -10) ప్రకారం 1-7-2016 చొప్పున జీతాలు చెల్లించారు. అయితే కార్మికులకు కూడా 20 లక్షల గ్రాట్యుటీ సీలింగ్ తేది 29-3-2018 నుంచి అమలుపరిచి దీని ప్రకారం చెల్లిస్తున్నారు. కానీ పాత గ్రాట్యూటి అమలుపరిచిన రెండు సంవత్సరాల మధ్యకాలంలో సింగరేణిలో దాదాపు 7,000 పనినుంచి దిగిపోయినారు. వారికి 20 లక్షల గ్రాట్యుటీ సీలింగ్ అమలు పరచకపోవడంతో తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది.

గత ఐదు సంవత్సరాల నుంచి విశ్రాంత కార్మికులు అధికారులకు, కార్మిక సంఘ నాయకులకు, రాజకీయ నాయకులకు అధికారులకు, కార్మికుల మధ్య వ్యత్యాసం లేకుండా సమాన తేదీ నుంచి గ్రాట్యుటీ సీలింగ్ అమలు చేయాలని వివిధ మాధ్యమాల ద్వారా విన్నవిస్తూనే ఉన్నారు. కానీ వారి ఆవేదన తీర్చే నాథుడు కరువైనాడు. దేశంలో ఎన్నోసార్లు చట్టసభల ద్వారా రాజ్యాంగాన్ని సవరించుకొని నూతన ప్రజామోద పథకాలు ప్రవేశపెడుతున్నారు కానీ ఆ మధ్య కాలంలో రిటైరైన కార్మికులకు కూడా గ్రాట్యుటీ సీలింగ్ తేదీ అమలుపరిస్తే దాదాపు 7,000 మంది విశ్రాంత చీకటి సూర్యులకు ఊరట కలిగిస్తుందని విశ్రాంతి ఉద్యోగులు కోరుకుంటున్నారు.

ఆళవందార్ వేణు మాధవ్

ఉపాధ్యక్షులు,సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్

86860 51752


Next Story