తెలంగాణ ప్రజలకు... విద్రోహదినం!

by Disha edit |
తెలంగాణ ప్రజలకు... విద్రోహదినం!
X

ప్రజలు తమ గత చరిత్రను సరైన విధంగా తెలుసుకున్నప్పుడు, వర్తమానంలో ఏం చేయాలో భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలో నిర్ణయించుకుంటారు. కానీ నేడు 1948 సెప్టెంబర్ 17 కేంద్రంగా ప్రజలు ఏ చరిత్రను సృష్టించుకున్నారో, ఏ పోరాటాలను నిర్మించుకొని భవిష్యత్తును కలలుగన్నారో అది ఉన్నది ఉన్నట్టుగా నేడు పాలకులు, పాలకవర్గ పార్టీలు చెప్పడం లేదు. ప్రజల వీరోచిత పోరాటాల చరిత్ర కూడా ప్రచారంలో ఉండాలి. లేదంటే పాలకవర్గాలు చెప్పే తప్పుడు చరిత్రనే అసలైన చరిత్రగా మిగిలిపోతుంది. అదే నిజమని నమ్మే ప్రమాదం ఉంటుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 17న తెలంగాణకు ఏం జరిగింది అనే విషయంపై చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇది ఎన్నికలు జరిగే సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం మరింత చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న బీజెపి, బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో పాటు, ఎన్నికల పంథా అవలంబిస్తున్న కమ్యూనిస్టు పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నాయి. కొందరు విలీనం అని, మరికొందరు విమోచనమని, ఇంకొందరు స్వాతంత్రం అని, తమ స్వార్థ రాజకీయ కార్యాచరణను మొదలుపెట్టారు. వారి వారి స్వలాభం కోసం ప్రజల చరిత్రను మభ్య పెట్టే పనిలో ఉన్నాయి. సరిగ్గా ఇక్కడే మనం మన గత చరిత్రను సరిగా అర్థం చేసుకోవాలి.

ఆరోజు ఏం జరిగింది?

1948కి ముందు భారతదేశంలో 568 సంస్థానాలు ఉన్నాయి. ఈ అన్ని సంస్థానాల్లో బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పాలన ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంది. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పాలన అంతమైంది. ఈ 568 సంస్థానాల్లో ఒక నాలుగు తప్ప మిగతావన్నీ యూనియన్ ప్రభుత్వంలో విలీనమయ్యాయి. ఈ నాలుగు సంస్థానాలు నిజాం, జమ్మూకాశ్మీర్, జునాగర్, త్రిపుర, ఇవి నాటి యూనియన్ ప్రభుత్వంలో విలీనం అవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయలేదు. కానీ నెహ్రూ ప్రభుత్వం వీటిని కలుపుకోవడానికి తీవ్రప్రయత్నం చేసింది. హైదరాబాద్ సంస్థానాన్ని వైజాం పరిపాలించేవాడు. నాటి నిజాం రాష్ట్రంలో 16 జిల్లాలు ఉన్నాయి. ఇందులో తెలంగాణలో 8 జిల్లాలు (వరంగల్, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆత్రాఫ్‌బల్దా -నాడు హైదరాబాద్ పేరు-), మరఠ్వాడాలో 5 జిల్లాలు (నాందేడ్, పర్బనీ, బీడ్, ఔరంగాబాద్, ఉస్మానాబాద్), కన్నడ ప్రాంతంలో 3 జిల్లాలు (బీదర్, రాయచూర్, గుల్బర్గా) ఉండేవి. ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు నజరాణాలు, పన్నులు చెల్లిస్తూ వారి తాబేదారులుగా కొనసాగుతూ వచ్చింది. నైజాం పాలనలో హైదరాబాద్ సంస్థాన ప్రజలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నారు. నైజాం రాజు. తెలంగాణ ప్రజలతో వెట్టిచాకిరి చేయించుకోవడం, అధిక పన్నులను గుంజడం, హత్యలు, అత్యాచారాలు చేయడం, స్త్రీలను నగ్నంగా బతుకమ్మ ఆడించడం చేశాడు. శారీరకంగా, మానసికంగా, భౌతికంగా దాడి చేయడం, నిత్యం జరుగుతూ ఉండేవి. ప్రజలను పీడించడం కోసం నైజాం రాజు తన సంస్థానం అంతటా జాగీర్దారులను, జమీందారులను, భూస్వాములను, దేశముఖ్‌లను, దొరలను తన తాబేదారులుగా నియమించుకున్నాడు. నైజాం నవాబు రజాకారులతో ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పరచుకొని ప్రజలపై నిత్యం దాడులు చేస్తుండేవాడు. వీరు హిందూ, ముస్లింతోపాటు అన్ని మతాలలోని ఉన్నత వర్గాలకు, దోపిడి వర్గాలకు రక్షణ కవచంగానూ, అన్ని మతాలలోని పేద ప్రజలను హింసించే వారిగా దోపిడీ చేసేవారిగానూ ఉండేవారు. వీరి దోపిడీని వ్యతిరేకించే వారి ఊర్లను రాత్రికి రాత్రి తగలబెట్టడం ప్రజల ధన, మాన ప్రాణాలను దోచేయడం నిత్యం జరుగుతూ ఉండేది.

దీనికి వ్యతిరేకంగా ప్రజలు ప్రారంభంలో ఆంధ్ర జన సంఘం పేరిట పోరాడారు. అది 1930 నాడు వచ్చేసరికి ఆంధ్ర మహాసభ పేరుతో ఉద్యమించారు. ఈ ఆంధ్ర మహాసభనే తర్వాత కాలంలో కమ్యూనిస్టు పార్టీగా అవతరించింది. వెట్టి చాకిరి, అధిక శిస్తు వసూళ్లకు వ్యతిరేకంగా దున్నేవాడిదే భూమి నినాదంగా ఆంధ్ర మహాసభ పని చేసింది. అది 1946కు వచ్చేనాటికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంగా మారింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రపంచ చరిత్రలోనే గొప్ప ప్రాముఖ్యత ఉంది. భూమి తల్లి ఒడిలో తమ చెమటను చిందించి పసిడి సిరులను పండించే మట్టి మనుషుల చేత బందూక్ పట్టించింది. దొరలు, భూస్వాములపై యుద్ధాన్ని ప్రకటించింది. ఈ పోరాటంలో వేలాది మంది యోధులు తమ జీవితాలను అర్పించారు. షేక్ బందగి, దొడ్డి కొమరయ్య, షోయబుల్లాఖాన్ లాంటి ఎందరో వీరులు నాటి పోరాటంలో తమ ప్రాణాలను అర్పించారు. విసునూరు రామచంద్రారెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా చాకలి అయిలమ్మ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో మొదలైన ఈ పోరాటం మొత్తం నైజాం రాజ్యం అంతట విస్తరించింది. ఈ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములను ప్రజలు సొంతం చేసుకున్నారు. 3000 గ్రామాల్లో నైజాం అధికారానికి దీటుగా ప్రజారాజ్యాలను నెలకొల్పుకున్నారు. దొరలు, భూస్వాములు, జాగిర్దారుల చేతుల్లో ఉన్న భూమి అంతా వాటి కమ్యూనిస్టు పార్టీ గ్రామ సభలు నిర్వహించి భూమిలేని ప్రజలకు ప్రజాస్వామిక పద్ధతిలో పంచి పెట్టింది.

ఇది విలీనమా.. ఎలా?

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఫలితంగా నైజాం రాజు తన పాలన కొనసాగించలేకపోయాడు. నైజాం రాజు అన్ని రకాలుగా బలహీనమైపోయాడు. ఈ పోరాటం దేశవ్యాప్తంగా అంటుకొని ఎక్కడ ప్రజలు భూస్వాములు మీద తిరగబడతారని అలోచించిన నాటి ప్రభుత్వం ‘ఆపరేషన్ పోలో’ పేరుతో నిజాం నవాబు సహకారంతో దండయాత్ర చేసింది. వాస్తవానికి నిజాం నవాబు అప్పటికే జరిగిన ప్రజా -పోరాటాల వల్ల బలహీనమైన కారణంగా నాటి నెహ్రూ పటేల్ సైన్యాలు చేసిన ఒక్కరోజులోనే లొంగిపోయాడు. భారత సైన్యం నిజాం నవాబు లక్ష్యంగా దండయాత్ర చేస్తే తాను లొంగిపోయిన తర్వాత కూడా సైన్యం దురాక్రమణ కొనసాగింది. దాదాపు 600 రోజులు వీరు తెలంగాణలోని ప్రతి పల్లెలో దురాక్రమణలను కొనసాగిస్తూ అరాచకం సృష్టించారు. ప్రజలను, విప్లవకారులను అనేక మందిని చెట్లకు కట్టేసి పిట్టల్ని కాల్చి చంపినట్టు చంపారు. అంతేకాదు నిజాం నవాబుకు ‘రాజ్ ప్రముఖ్’ అనే బిరుదు ఇచ్చి కోటిన్నర రూపాయలను నజరానాగా ఇచ్చింది. ప్రజలను చిత్రహింసలు పెట్టిన ఖాసీం రజ్వీ పాకిస్తాన్ పారిపోవడానికి సహకరించారు. ఇదంతా నెహ్రూ నైజాం నవాబ్ కుమ్మక్కులో భాగంగా జరిగిన తతంగం. నెహ్రూ పటేల్ సైన్యాలు ఆ తరువాత కమ్యూనిస్టుల కేంద్రంగా దాడులు చేసింది. అనేకమంది ప్రజలను ఊచకోత కోశారు. 4000 మంది కమ్యూనిస్టు విప్లవకారులను చంపివేశారు. కమ్యూనిస్టులు పంచి పెట్టిన భూమిని తిరిగి భూస్వాములకు అప్పుచెప్పారు. అలాంటప్పుడు ఇది ఏ రకంగా విలీనం, విమోచనం, స్వతంత్రం అవుతుందో నేడు జరుగుతున్న పార్టీలే చెప్పాలి.

ప్రధానంగా హిందూ, ముస్లింల మధ్య జరిగిన గొడవగా బీజేపీ దీన్ని సృష్టిస్తోంది. నిజాం నవాబు ముస్లిం అయినా తన కింద పని చేసిన భూస్వాములు, జాగదారులు, దేశ్ ముఖ్‌లు హిందూ మతంలోని ఉన్నత వర్ణాల వారే. వీరిద్దరూ కలిసి అన్ని మతాలలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మీద దాడులు చేశారు. అలాంటప్పుడు ఇది వీరు చెబుతున్నట్లు విమోచనం ఎలా అవుతుంది? నిజాం నవాబు 1947 కన్నా ముందే సామంత రాజుగా, బ్రిటిష్ పాలకవర్గాలకు తాబేదారుగా పనిచేస్తున్నాడు. అలాంటప్పుడు దీనిని విలీనం, స్వతంత్రం అనలేము. దీనికి సంబంధించి బీజేపీది మతోన్మాదాన్ని రెచ్చగొట్టే వైఖరి కాగా, మిగతా పార్టీలు అవకాశవాదంతో చరిత్రను వక్రీకరిస్తున్నాయి. నాడు మనం సాధించుకున్న హక్కులను, భూములను నిజాం నవాబు బూచిగా చూపెట్టి నెహ్రూ, పటేల్ సైన్యాలు హరించి వేశాయి.. దీనికి వ్యతిరేకంగా నిలబడిన ప్రజలను, కమ్యూనిస్టులను ఊచకోత కోసాయి.

చరిత్రకు ఇన్ని వక్రభాష్యాలా?

నాటి తెలంగాణ సాయుధ పోరాటం అనవాళ్లు తెలంగాణలో ఏ పల్లెకు వెళ్లినా నేటికీ సజీవంగా మనకు సాక్షాత్కారిస్తాయి. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం కొనసాగింపు ఇష్టం లేని వాళ్ళు, ప్రజలను మభ్య పెట్టి రకరకాలైన వాదనలను తెరమీదకు తీసుకొస్తున్నారు. ఇలాంటి. వాదనలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు ఏమి జరిగిందనే అంశంపై అందరూ మాట్లాడాల్సిన తక్షణ అవసరం నేడు ఉంది. చరిత్రను చరిత్రగా ఉంచితేనే మంచిది. ఒకానొక చారిత్రక సందర్భంలో ప్రజలు తమ చరిత్ర గురించి తెలుసుకున్నప్పుడు భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలో వారే నిర్ణయించుకుంటారు. తెలంగాణలో ఆనాడు జరిగిన మట్టి మనుషుల పోరాటం నేటికీ పాలకవర్గాలను భయకంపితులను చేస్తోంది. అందుకే ఇంతటి మహోజ్వల చరిత్రకు వారు రకరకాలుగా వక్రభాషాలను చెబుతున్నారు. అయినా అంతిమంగా ప్రజలే చరిత్ర నిర్మాతలు, వారి చరిత్రను వారే నిర్మించుకుంటారు. ప్రజలను హింసించి, వెట్టిచాకిరి చేయించుకుని వారి ధన, మాన, ప్రాణాలను హరించి ఊచ కోత కోసిన రోజు సెప్టెంబర్ 17. ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజలకు విద్రోహదినమే.

పి. మహేష్,

పీడీఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు

97003 46942



Next Story

Most Viewed