మార్పు దిశగా ప్రజా పాలన..

by Ravi |   (  Updated:2026-04-12 01:16:26  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పాలనలో వస్తున్న మార్పులపై ఒక లోతైన విశ్లేషణ. ప్రజా పాలన, మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళా సాధికారత, క్లీన్ గవర్నెన్స్, రాష్ట్రం ఎదుర్కొంటున్న రూ. 6 లక్షల కోట్ల అప్పుల సవాలును ఈ వ్యాసం చర్చిస్తుంది.

మార్పు దిశగా ప్రజా పాలన..
X

గత సాధారణ ఎన్నికల్లో తెలంగాణ ఓటేసిన రోజు.. అది కేవలం ఒక ప్రభుత్వ మార్పు కోసం వేసిన ముద్ర కాదు.. అది ఒక జనారణ్యం వినిపించిన నిశ్శబ్ద గర్జన! గత పదేళ్లలో అభివృద్ధిని చూశారు, సంక్షేమాన్ని పొందారు.. కానీ ఎక్కడో ఒక వెలితి. వినే ప్రభుత్వం కావాలి, కనిపించే నాయకుడు కావాలి అనే ఆశ ఆ రోజు ఓటుగా మారింది. అది రాజకీయ ప్రశ్న కాదు అది ప్రజల మనసులో మోగుతున్న ప్రశ్న..

ప్రజలకు వినే ప్రభుత్వం కావాలి.. స్పందించే నాయకుడు కావాలి.. గౌరవం ఇచ్చే పాలన కావాలి. ఆ ఆశలన్నింటి బరువు ఇప్పుడు ఒక వ్యక్తి భుజాలపై ఉంది ఆయనే అనుముల రేవంత్ రెడ్డి.

ప్రజల గుమ్మం దాటిన ప్రభుత్వం..

ఒకప్పుడు ప్రజలు ప్రభుత్వాన్ని వెతికేవారు.. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రజల దగ్గరకు వస్తోంది. ప్రజా పాలన కార్యక్రమం కేవలం ఒక పథకం కాదు.. ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం తిరిగి తెచ్చే ప్రయత్నం. అధికారులు గ్రామాల్లో నిలబడి ఫిర్యాదులు విన్నప్పుడు అది ఫార్మాలిటీ కాదు.. మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు.. మేమే వస్తాం అన్న ఒక సంకేతం.. ఇది పరిపాలనలో మార్పు కాదు.. మనసుల్లో మార్పు. తెలంగాణలో మార్పు దిశ స్పష్టంగా ఉంది. కానీ ఆ మార్పు స్థిరమైన అభివృద్ధిగా మారాలంటే సంక్షేమం, ఆదాయం, అమలు ఈ మూడు మధ్య సమతుల్యత తప్పనిసరి.. ఇక మహిళ చేతిలో డబ్బు పెట్టి కుటుంబంలో గౌరవం పెంచాల‌నుకున్న కార్యక్రమం మహాలక్ష్మీ స్కీమ్, ఇది ఒక పథకం కాదు.. ఇది ఒక మౌన విప్లవం. ఒక గృహిణి చేతిలో డబ్బు పడినప్పుడు ఆమె కేవలం ఖర్చు చేయదు.. ఆమె కుటుంబాన్ని నిలబెడుతుంది. ఆమె మాట విలువ పెరుగుతుంది. ఆమె నిర్ణయాధికారం పెరుగుతుంది. ఆమె జీవితం మారుతుంది, కానీ ఈ శక్తివంతమైన సంక్షేమాన్ని నెరవేర్చేందుకు రాష్ట్రం ఆర్థికంగా నిలబడగలదా?

క్లీన్ గవర్నెన్స్..

ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఫోకస్ చేసిన అంశం పారదర్శకత. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు అర్థ మయ్యేలా, అవినీతికి అవకాశాలు తగ్గేలా తీసుకున్న చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. టెండర్ విధానాల్లో పారదర్శకత, అధికారులపై బాధ్యతను పెంచడం, ప్రజా ఫిర్యాదులపై వేగవంతమైన స్పందన, ఇవి ఆయన పాలనకు ‘క్లీన్ గవర్నెన్స్’ అనే ముద్రను తెచ్చాయి.. గత ప్రభుత్వంలో ఉన్న పథకాల్ని పూర్తిగా రద్దు చేయకుండా, వాటిని మెరుగుపరచడం ఆయన ముఖ్య లక్షణం. పేదల సంక్షేమంపై ఫోకస్, మహిళలకు ఆర్థిక సహాయం, రైతులకు నేరుగా మద్దతు, ఇది ‘పథకాల కొనసాగింపుతో పాటు మెరుగుదల’ అనే సమతుల్యతను చూపించింది.

సమాజ భవిష్యత్తు కోసం..

ఇక సమాజంలో తగ్గుతున్న విలువలను కాపాడేందుకు తల్లిదం‌డ్రుల గౌరవ చట్టం ఒక గొప్ప నిర్ణయం. ఈ చట్టం వెనుక ఒక నిశ్శబ్ద బాధ ఉంది. ఒక వృద్ధుడి ఒంటరితనం ఉంది. ఒక తల్లి ఎదురుచూపు ఉంది. మనం ఎంత అభివృద్ధి సాధించినా.. మన తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటే అది నిజంగా అభివృద్ధేనా? ఈ నిర్ణయం రాజకీయంగా చిన్నదిగా కనిపించవచ్చు.. కానీ సామాజికంగా ఇది ఒక గొప్ప సందేశం. అలాగే తెలంగాణలో నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేందుకు ఉద్యోగ నియామకాలు వేగవంతం చేయడం, పరీక్షల్లో పార దర్శకత వంటి చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు మద్దతుగా సరైన ధరలు, సబ్సిడీలు, సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెడు తున్నారు. అలాగే హైదరాబాద్ అభివృద్ధికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుదల, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, పెట్టుబడుల ఆకర్షణపై కృషి చేస్తూ, ఆరోగ్య, విద్య రంగాల్లో నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది ‘సమాజపు భవిష్యత్తు’ మీద పెట్టుబడిగా చూడవచ్చు.

ఇంకా చేయాల్సింది ఉంది!

ముఖ్యమంత్రిగా బాధ్యతాయుత నిర్ణయాలు రేవంత్ రెడ్డి రాజకీయ పరిణతి సూచనగా చెప్పొచ్చు.. రేవంత్ రెడ్డి పాలన, ఆశను కలిగిస్తోంది. మార్పు సూచిస్తోంది. అయితే తెలంగాణ ఆర్థిక నిర్మాణంలో ఒక స్పష్టమైన అసమతుల్యత ఉంది. రాష్ట్ర అప్పులు ₹6 లక్షల కోట్లు దాటింది. బడ్జెట్‌లో 35 –40% సంక్షేమానికి.. వడ్డీ చెల్లింపులకు 12–15% ఖర్చు చేస్తోంది. కాబట్టి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలతో పాటు ఆర్థిక స్థిరత్వం కాపాడాలి.. ఇదే పాలనలో అసలు పరీక్ష. తెలంగాణలో మార్పు మొదలైంది.. కానీ ఆ మార్పు నిలబడాలంటే ఇంకా చాలా చేయాల్సి ఉంది. కానీ ప్రారంభం సరైన దిశలో ఉందా? అవును, ఉందని చెప్పడానికి ప్రస్తుతం ఉన్న చర్యలు సరిపోతున్నాయి.

-డాక్టర్ బి. కేశవులు ఎండీ

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం

85010 61659

Next Story