ఆదర్శ నాయకుడు కడియం రాజు

by Disha edit |
ఆదర్శ నాయకుడు కడియం రాజు
X

బీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ చరిత్రలో 108 రోజుల జైలు జీవితం గడిపి, అన్న, బాబాయ్, మామగా విద్యార్థులచే ముద్దుగా పిలుచుకునే ఉస్మానియా యూనివర్సిటీ దిక్సూచి డా. కడియం రాజు 20 మార్చి అనారోగ్యం కారణంగా పరమపదించారు. ఆయన నల్లగొండ జిల్లాలోని కొత్తగూడెం గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. తన పాఠశాల విద్య కొండ్రపోల్ గ్రామంలో, ఇంటర్ నాగార్జున జూనియర్ కళాశాల, మిర్యాలగూడ కేఎన్ఎం డిగ్రీ కళాశాలలో బీఏ డిగ్రీ పూర్తిచేశారు. పేదరికం వెక్కిరిస్తున్నా ఆ తర్వాత ఎంఏ హిస్టరీ విభాగంలో ఎంఫిల్, పీహెచ్‌డీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేశారు. ఆయనకు ఇంటర్ నుంచే దేశభక్తి, జాతీయ భావాలు కలిగిన విద్యార్థిగా ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ డిగ్రీలో కళాశాల ఎబీవీపీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అలాగే 2002 సంవత్సరం నుండి ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ సైద్ధాంతిక పోరులో ముందుండి క్రియాశీలకంగా పనిచేశారు. ఏబీవీపీ చేపట్టిన ఎన్నో విద్యారంగ సమస్యలపై ముందుండి పోరాడి, ఎన్నో లాఠీ దెబ్బలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి 108 రోజులు జైలు పాలయ్యారు. ఏబీవీపీ చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ భూముల పరిరక్షణ ఉద్యమంలో ముందుండి, అనేక ఆక్రమణ భూముల విషయంలో కోర్టులలో కేసులు వేశారు, నిరుద్యోగం, విద్యారంగ సమస్యలు మెస్‌ బిల్లులు, స్కాలర్‌షిప్పులు, మౌలిక వసతులు, నూతన హాస్టళ్ల నిర్మాణం కోసం పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారు.

ఏబీవీపీతో తన ప్రయాణం..

ఏబీవీపీలో తన సుదీర్ఘ ప్రయాణంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంచార్జ్‌గా, సిటీ సెక్రెటరీగా, స్టేట్ సెక్రెటరీగా, నేషనల్ సెక్రెటరీగా, సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా అనేక విద్యార్థి ఉద్యమాలకు నేతృత్వం వహించారు. అలాగే జాతీయ ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల విద్యా నియంత్రణ కమిటీ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో సైతం ఏబీవీపీ చేపట్టిన అనేక ఉద్యమాలను ముందుండి నడిపించారు. ఏబీవీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన లక్ష మందితో ‘తెలంగాణ రణభేరి’లో సుష్మాస్వరాజ్ ఆహ్వానించిన సభకు సభాధ్యక్షత వహించారు. అలాగే ఏబీవీపీ తెలంగాణ సాధనకై మహా పాదయాత్రలో కోదాడ నుండి హైదరాబాద్ వరకు నేతృత్వం వహించారు. నా రక్తం- నా తెలంగాణ, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం, ఉస్మానియా యూనివర్సిటీ‌లో విద్యార్థుల నిరాహార దీక్షలు... ఇలా తెలంగాణ సాధనలో అనేక ఉద్యమాలలో క్రియాశీలకంగా పోరాడారు.

ఉద్యమ సమయంలో పాత్రికేయులు రాష్ట్రం ఏర్పడితే మీ కలలుగన్న వ్యవస్థ వస్తుందా? ఆంధ్ర ప్రాంతం వారు వెనక్కి వెళ్లిపోవాలా అనే ప్రశ్నలకు ‘ముందు ప్రజలు చైతన్యవంతం కావాలి. మేము కోరుకొంటున్న తెలంగాణ హింసా, రక్తపాతాలకు తావీయని సస్యశ్యామలమైన తెలంగాణ కావాలని. ప్రతీ రాజకీయ పార్టీ తన వైభవాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ ప్రజలు చైతన్యవంతం అయితే సరైన నాయకులను ఎన్నుకొని సరైన ప్రభుత్వాలను ఏర్పరచుకుంటారు. ఇందుకోసం అందరిని జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ వంతుగా మా ప్రయత్నం చేస్తాం. కానీ రాష్ట్రం ఏర్పడితే ఎవరూ బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరూ అభద్రతాభావానికి లోనూ కాకుండా ఇక్కడే ఉండవచ్చు. ఏవైనా కొన్ని దుష్టశక్తులు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే ప్రయత్నం చేస్తే, ఏబీవీపీ లాంటి జాతీయవాద సంస్థలు అలాంటి శక్తులకు తగిన బుద్ధిచెప్తాయి’. అని స్పష్టంగా బదులివ్వడం వారి ఆదర్శ నాయకత్వానికి మచ్చుతునక. జాతీయ భావాలు కలిగిన దేశభక్తులుగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన డా.కడియం రాజు మరణం విద్యార్థి లోకానికి, దేశానికి తీరని లోటు.

డా. శ్రీశైలం వీరమల్ల

ఉస్మానియా యూనివర్సిటీ

99123 42434


Next Story