సెప్టెంబర్ 17 పై భావోద్వేగాలను రెచ్చగొట్టొద్దు!

by Disha edit |
సెప్టెంబర్ 17 పై భావోద్వేగాలను రెచ్చగొట్టొద్దు!
X

ఓ వైపున కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి పంథాలో వారు సెప్టెంబర్ 17ను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా భారీసభ నిర్వహణకు సన్నాహాలు చేసుకుంది. బీజేపీ నుండి అమిత్ షా, కాంగ్రెస్ నుండి సోనియా రాష్ట్రానికి రానున్నారు. అయితే ప్రతీ పార్టీ చేస్తున్న ఈ ఉత్సవాల వెనుక రాజకీయంగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలన్న ఆరాటం తప్ప ఇందులో చిత్తశుద్ధి గాని, ప్రజా ప్రయోజనాలుగాని ఏ కోశానా కానరావడం లేదు. పైగా ప్రజాధన దుర్వినియోగం, మతాల మధ్య దూరం పెంచే, చిచ్చుపెట్టే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.

అలయ్ బలయ్‌ను నాశనం చేయాలని..

భారతదేశంలో గత తొమ్మిదేళ్ళుగా అధికారంలో ఉన్న బీజేపీ ఇన్నేళ్ళ తరువాత సెప్టెంబర్ 17ను ప్రభుత్వపరంగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం విడ్డూరం! ఈ వేడుకల వెనుక తెలంగాణ గడ్డను ఏదో ఒక విధంగా కలుషితం చెయ్యాలన్న దుర్బుద్ధి తప్పా మరేమీ లేదు. వారికి అంత ఆసక్తి ఉండి ఉంటే అధికారంలోకి వచ్చిన సంవత్సరమే మొదలు పెట్టాల్సింది కదా.. ఎనిమిదేళ్ళు ఆగాల్సిన అవసరం ఏమిటి? అధికారం కోసం ఆ పార్టీ ఎంతకైనా తెగిస్తాననన్నది వాస్తవం. స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడిచి దేశం ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధించింది. సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టకుండా సెప్టెంబర్ 17 మాత్రమే దేశానికి చావో రేవో సమస్య అన్నట్లు విమోచనా దినోత్సవం పేరిట తెలంగాణ అలయ్ బలయ్ సంస్కృతిని, గంగా జమునా తహజీబ్ వారసత్వాన్ని బీజేపీ నాశనం చేస్తోంది. ఒక రాజకీయ పార్టీగా అధికారాన్ని అందుకోవాలన్న ఆశ ఆ పార్టీకి ఉండవచ్చు. అది వారి హక్కు దానికోసం ప్రజాస్వామ్య విధానాలను అనుసరించాలి తప్ప, లేని దేశభక్తి డబ్బా కొట్టుకుంటూ, కులాల, మతాల మధ్య చిచ్చుపెట్టి భావోద్వేగాలను రెచ్చగొట్టొద్దు.

సెప్టెంబర్ 17 విషయంలో అందరి లాగానే వారికీ ఒక భిన్నమైన అభిప్రాయం ఉండవచ్చు. దాన్నెవరూ తప్పు పట్టడానికి లేదు. ఎవరి అభిప్రాయం వారిది.. ఆ హక్కు, స్వేచ్ఛ తప్పకుండా వారికి ఉంటుంది. కాని, వాస్తవాల వక్రీకరణతో తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఒక పావుగా వినియోగించుకొని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూడడమే దుర్మార్గం. అది తప్ప, తెలంగాణపై గాని, సాయుధ రైతాంగ పోరాటంపై గాని, అసలు ఆమాటకొస్తే స్వాతంత్రోద్యమం పట్లనే బీజేపీ‌కి చిత్తశుధ్ధి లేదు. ఏదో ఒక విధంగా ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయంగా పటిష్టం కావాలన్నదే కనిపిస్తుంది. సంస్థాన విలీన సమయాన ముస్లిం అయినటువంటి నిజామ్ రాజు పాలకుడుగా ఉన్నాడు కాబట్టి 'ముస్లిమ్ పాలన' నుండి విమోచన అన్న అర్ధంలో బీజేపీ దీన్ని ముస్లిమ్ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నాలు బలంగా చేస్తున్నది. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఇలాంటి ప్రయత్నం ఖచ్చితంగా కులాలమధ్య, మతాలమధ్య చిచ్చుపెట్టే దుర్మార్గపు చర్య మాత్రమే కాదు, చరిత్ర వక్రీకరణ కూడా .!

విలీనానికే మొగ్గు చూపిన నిజాం..

ఆనాడు ముస్లిం రాజు పాలకుడుగా ఉండడం అనేది కేవలం యాధృచ్చికమే తప్ప, మరేమీకాదు. ఆ మాటకోస్తే, నిజాంకు వ్యతిరేకంగా అనేక మంది ముస్లింలు పోరాడారు. మఖ్దూం మొహియుద్దీన్, షోయబుల్లా ఖాన్, షేక్ బందగీ లాంటి వాళ్ళ వీరోచిత పాత్రను మనం విస్మరించగలమా? మరి వాళ్ళు ముస్లింలు కారా? అంతేకాదు, అనేక మంది ముస్లిం దేశ్‌ముఖ్‌లు నిజాంకు మద్ధతుగా నిలిచారు. దీన్ని మత కోణంలో చూడడం దుర్మార్గం. అయితే, నిజాం కూడా మచ్చలేనివాడు అనీ ఎవరూ అనడంలేదు. కానీ అతని పాలన మొత్తాన్నీ రాక్షస పాలనగా చిత్రీకరించే ప్రయత్నం ఖచ్చితంగా దుర్మార్గమే. రజాకార్ల పేరుతో చివరి రోజుల్లో జరిగిన అరాచకాలకు నిజామ్ ఎంతబాధ్యుడో, అంతకంటే అనేక రెట్లు దేశ్ ముఖ్‌లు, దొరలు, పటేళ్ళే ఎక్కువ బాధ్యులు. వాస్తవానికి నిజామ్ రాజులెప్పుడూ స్వతంత్ర పాలకులుగా ఉండలేదు. వారు బయటినుండి వచ్చిన వలస పాలకులు కూడా కాదు. అందుకని' పరాయి పాలన' అన్న పదానికి కూడా అవకాశం లేదు. ఈ సువిశాల భారతదేశంలోని ఇతరప్రాతాల పాలకులకు లాగానే వారూ ఒక ప్రాంతానికి పాలకులు. మొగల్ సామ్రాజ్య కాలంలో వారు సుబేదార్లుగా ఉండేవారు. మొగల్ చక్రవర్తి వారిని నియమించేవాడు.

బ్రిటిష్ వారు ఈస్టిండియా కంపెనీ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత, మొగల్ సామ్రాజ్యం పతనం కావడంతో, నిజామ్ రాజులు బ్రిటిష్ వారి అధీనంలోకి వెళ్ళిపోయారు. ఆ విధంగా 1947వరకు వారు రాణికి విధేయులుగానే ఉన్నారు. 1948లో భారత ప్రభుత్వానికి, నిజామ్‌కు మధ్య జరిగిన ఒప్పందం ద్వారా హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనానికి సంబంధించిన రాజకీయ ప్రక్రియ ఆరంభమైంది. ఆ సమయంలో రజాకార్లు దీనికి అవరోధాలు కల్పిస్తూ, విలీన ప్రక్రియను అడ్డుకోడానికి ప్రయత్నించారు. అయితే పోలీస్ యాక్షన్ ద్వారా రాజాకార్లను అణిచివేశారు. ఆ తరువాత 1948 సెప్టెంబర్ 10‌న నిజాం నవాబు స్వచ్చందంగా ఇండియన్ యూనియన్‌లో విలీనానికి సంసిద్ధత తెలియజేశాడు. సికింద్రాబాద్ మిలటరీ కంటోన్మెంటును స్వాధీనం చేసుకోడానికి స్వయంగా భారత సైన్యాన్ని ఆహ్వానించడం గమనిస్తే, భారత ప్రభుత్వం నుండి నిజాం నవాబు పోలీసు సహాయం అర్ధించాడని అర్ధమవుతుంది. హైదరాబాద్ సంస్థానం విలీనానికి మార్గం సుగమం చేయడానికే నిజామ్ భారత ప్రభుత్వ సహాయాన్ని అర్ధించాడు. అందులో భాగంగానే భారత సైన్యాలు సికింద్రబాద్ కంటోన్మెంట్‌ను ఆక్రమించుకున్నాయి.

ఆ సమయాన దేశంలోని వివిధ సంస్థానాలు ఇండియన్ యూనియన్‌లో విలీనమైనట్లుగానే, హైద్రాబాద్ సంస్థానం కూడా ఆ సాధారణ ప్రక్రియలో భాగంగా విలీనం కావలసి ఉండింది. కాని 1947 నుండి 1948 సెప్టెంబర్ వరకు హైదరాబాదులో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా హైదరాబాద్ విలీనం సాధ్యంకాలేదు. కేవలం పది నెలల పాటు మాత్రమే కొనసాగిన ఈ రాజకీయ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ విలీనాన్ని స్వాతంత్ర్య సమరంగానో, విమోచన పోరాటంగానో చూడడం ఎంతమాత్రం సరికాదు. ఎందుకంటే, నిజాం సైన్యాలు భారత సైన్యాలను ఎదిరించడంగాని, పోరాడడం కాని చేయలేదు. భారత సైన్యానికి వ్యతిరేకంగా నిజాం సైన్యం ఒక్కతూటా కూడా పేల్చిన దాఖలా లేదు. నిజాం స్వచ్ఛందంగా సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేశాడు. అందుకని మిగిలిన సంస్థానాలను విలీనం చేసిన రాజులు, నవాబులు ఎంతో నిజామ్ నవాబు కూడా అంతే. అందుకే రాజ్ ప్రముఖ్ హోదా, భరణాన్ని ప్రభుత్వం నిజాంకు చెల్లించింది. ఒకవేళ నిజామ్ రాజ్యాన్ని, ఆయన సంస్థాన సైన్యాన్ని ఎదిరించి, పోరాడి గనక స్వాధీనం చేసుకుని ఉన్నట్లయితే, ఆయనకంతటి రాజమర్యాదలు దక్కేవా ?

ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలి!

మన ప్రజాస్వామ్య భారతావనిలో భిన్నకులాలు, భిన్నమతాలు, భిన్నవర్గాలు, భిన్నసంస్కృతీ సంప్రదాయాలకు చెందిన ప్రజలు ఎంతో అన్యోన్యంగా, ఆప్యాయంగా, సామరస్యంగా, పాలూ పంచదారలా కలసీమెలసీ సహజీవనం చేస్తున్నారు. ఇటువంటి అహ్లాదకర వాతావరణంలో ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా రాజకీయ పార్టీలు విజ్ఞతతో, విశాల దృక్పథంతో వ్యవహరించాలి. నిజం చెప్పాలంటే ' గంగా జమునా తహెజీబ్ ' మనది. హిందూ ముస్లిమ్ అనే సంకుచిత మనస్తత్వంతో వ్యవహరిస్తే దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి, దేశ లౌకిక వారసత్వానికి తీవ్రమైన విఘాతం కలుగుతుంది. నిజామ్ నవాబు స్వచ్చందం గానే ఇండియన్ యూనియన్‌లో విలీనమయ్యాడు కనుక 1947 సెప్టెంబర్ 17‌న నిజామ్ నుండి హైద్రాబాదుకు విమోచన లభించిందన్న వాదన సత్యదూరం మాత్రమేకాదు, వక్రభాష్యం కూడా. అందుకని సెప్టెంబర్ 17‌ను రాష్ట్ర సర్కార్ నిర్ణయించినట్లు జాతీయ సమైక్యతా దినోత్సవంగానో, విలీన దినోత్సవంగానో, లేక హైదరాబాద్ రాజ్యం భారత ప్రభుత్వ పాలన కిందికి వచ్చిన రోజుగానో చూడడమే శ్రేయస్కరం. దీనికి ఎలాంటి ప్రత్యేకతలూ ఆపాదించాల్సిన అవసరంలేదు. అలా కాకుండా విమోచన అని గాని, స్వాతంత్ర్యం అని గాని లేనిపోనివి ప్రచారంచేసి, ప్రజల భావోద్రేకాలను రెచ్చగొడితే మతసామరస్యానికి విఘాతం కలగడమే కాక, ఆగస్టు 15 ప్రాముఖ్యతను తగ్గించడం, స్వాతంత్ర్య స్పూర్తిని అవమానించడంకూడా అవుతుంది. అందుకని ప్రజలు ఆ వలలో చిక్కకుండా విజ్ఞతతో వ్యవహరించాలి. ఇదే ప్రస్తుతం భారతీయ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ పౌరుల ముందున్న తక్షణ కర్తవ్యం.

- యండి.ఉస్మాన్ ఖాన్

సీనియర్ జర్నలిస్టు

99125 80645



Next Story

Most Viewed