ప్రైవేటు పాఠశాలల ‘ఫీజులుం’ !

by Disha edit |
ప్రైవేటు పాఠశాలల ‘ఫీజులుం’ !
X

నాటి ఉద్యమకారుడు, ఇప్పటి ముఖ్యమంత్రి గత సంవత్సరం జనవరి 17న మంత్రివర్గ సమావేశం జరిపి రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్‌ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామనీ, ఈ విద్యా సంవత్సరంలోనే ఈ చట్టం అమలులోనికి తీసుకువస్తామనీ చెప్పారు. కానీ, ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం, విద్యాశాఖ ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. ఫలితంగా ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో అడ్మిషన్లకోసం వెళ్ళిన తల్లిదండ్రులకు ఫీజులు చూస్తే దిమ్మతిరుగుతోంది. రాష్ట్రంలో స్కూల్ ప్రారంభం కాకపోయినా, స్కూళ్లకు పర్మిషన్ లేకపోయినా అద్దె భవనాలు చూపిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా అడ్మిషన్ల పేర డబ్బులు దండుకుంటున్నాయి ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు. రాష్ట్రంలో 1200 ప్రైవేట్ స్కూళ్లలో మూడు లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఏటా వీరిపై 1250 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది.

ప్రతిపాదనలు సిద్ధం చేసినా..

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పేద మధ్యతరగతి వారికి ఇంగ్లీష్ బోధన, స్మార్ట్ క్లాసులు అని ఆశ చూపి తమ విద్యాసంస్థలు మెరుగైన విద్య అందిస్తున్నామని లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆఖరికి పుస్తకాలు, బూట్లు, టై, బెల్ట్ వరకు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెట్టి అమ్ముతున్నారు. నిజానికి ప్రభుత్వ సూచనల మేరకు స్కూల్ పరిధిలో ఇవి అమ్మరాదు అని నిబంధన ఉన్నా పట్టించుకోకుండా వీటిని అమ్ముతున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్‌లో కనీస వసతులు టాయిలెట్స్, ప్లే గ్రౌండ్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ ఏమీ సరిగ్గా లేకున్నా, కార్పొరేట్ స్కూల్ అని చెప్పుకొని ప్రాజెక్టుల పేరిట, అసైన్మెంట్ల పేరిట తల్లిదండ్రుల నుండి డబ్బు కాజేసే విధంగా ప్రయత్నిస్తున్నారు. సుమారు తల్లిదండ్రుల ఆదాయంలో 80% వరకు పిల్లల చదువుల కొరకు ఖర్చు చేస్తున్నారు. ఫీజు నియంత్రణ చట్టం గాలికి వదిలేసి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లా పట్టిపీడిస్తున్నాయి. 2009 విద్యాహక్కు చట్టం ప్రకారం 25% పేద పిల్లలకు ఇవ్వాలని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు సూచించారు. అయినా విద్యా హక్కు చట్టాన్ని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.

అయితే ఫీజుల నియంత్రణపై ప్రత్యేక చట్టం రూపకల్పనకు గత సంవత్సరం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇందుకుగానూ మంత్రులతో సబ్ కమిటీని నియమించారు. ఈ కమిటీ పలుమార్లు సమావేశమై గతంలో ఫ్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదికపై, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజులపై చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ప్రతి ఏటా 10 శాతం ఫీజు పెంచుకోవచ్చనే ప్రతిపాదన చేసింది. అయితే ఫీజు వివరాలు ప్రజలకు తెలిసేలా ఉండాలని సూచించింది. కానీ ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభం కావొస్తున్నా ఇంతవరకూ మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఫీజుల నియంత్రణ చట్టంపై స్పష్టతే లేదు. ఫీజులు ఎంత వసూలు చేయాలి అనేదానిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఏవి విడుదల చేయలేదు. దీని గురించి పేరెంట్స్ అసోసియేషన్స్, విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నించిన నిరసనలు తెలియజేసినా పట్టించుకోకపోగా అక్రమ కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి.

నిజానికి ఫీజు నియంత్రణ చట్టం ప్రకారం, ఏ విద్యాసంస్థనైనా ట్రస్ట్ పేరిట నడపాలి. దానికి ఒక గవర్నమెంట్ బాడీ ఏర్పాటు చేయాలి. అయితే కార్పొరేట్ కళాశాలలు నామమాత్రంగా గవర్నింగ్ బాడీ చూపిస్తున్నా, అధికారం మొత్తం యాజమాన్యం చేతుల్లోనే పెట్టుకుంటుంది. కొన్ని సందర్భాలలో మిగిలి ఉన్న ఫీజుని కట్టకపోతే వచ్చే విద్యా సంవత్సరంలోకి అనుమతించడం లేదు. కొన్ని స్కూళ్లయితే ఒకేసారి మొత్తం ఫీజు కట్టాలనే నిబంధనలను అమలు చేస్తున్నాయి. లేదంటే అడ్మిషన్లు ఇవ్వడం లేదు. అందుకే వెంటనే రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని, విద్యా హక్కు చట్టాన్ని అమలుపరిచే విధంగా గైడ్‌లైన్స్ ఇవ్వాలని పలు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్లు చేస్తున్నారు. అలాగే ప్రతి స్కూల్లో ఐసిసి (ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ) ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.

నక్క ప్రమోద్ కుమార్,

ఏబీవీపీ, కరీంనగర్

81793 13003


Next Story

Most Viewed