యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువ! వారే కారణమా?

by Disha edit |
యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువ! వారే కారణమా?
X

ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ప్రకారం 2019లో ప్రపంచంలోని ప్రతీ 11 మందిలో ఒకరు వృద్ధుడు ఉంటే, 2050 నాటికి ప్రతీ ఆరుగురిలో ఒకరు ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే 17 దేశాలు వృద్ధ జనాభాతో మెజారిటీగా ఉన్నాయి. 2100 సంవత్సరం నాటికి 155 దేశాలు వృద్ధ జనాభా దేశాలుగా వర్ధిల్లుతాయని నివేదికలు చెబుతున్నాయి. కావున మన యువత ఆరోగ్య రంగంలో ఉద్యోగ అవకాశాలు అన్వేషించాలి. టెక్నాలజీ ఓరియెంటెడ్ సర్వీసులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సర్టిఫైడ్ కోర్సులు, నైపుణ్యాభివృద్ధి సంస్థలు ద్వారా వివిధ రకాల స్కిల్స్, సామర్థ్యాలు సంపాదించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి. భారత యువతకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి నేటి నుంచే ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. వృద్ధ ప్రపంచంలో అవకాశాలు ఒడిసిపట్టే విధంగా యువతకు తర్ఫీదు ఇవ్వాలి.

రెండు దశాబ్దాలుగా భారత్ జీడీపీలో సర్వీస్ సెక్టార్ భాగస్వామ్యం 50 శాతంగా ఉన్నది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సేవా రంగం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది. కరోనా కాలంలో కూడా భారత్ సేవా రంగం ముఖ్యంగా ఐటీ రంగం దూకుడు తగ్గలేదని గణాంకాలు చెబుతున్నాయి.‌ ఒక్కమాటలో చెప్పాలంటే భారత ఆర్ధికాభివృద్ధిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వెన్నెముక అని గ్రహించాలి.‌ ఒక పక్క యువ జనాభా ఎక్కువగా ఉన్న మన భారతదేశం, మరో పక్క వృద్ధులతో నిండిపోయిన అధిక ఆదాయ దేశాల (ఆర్ధికంగా అభివృద్ధి చెందిన దేశాలు) మధ్య ఉన్న ప్రస్తుత సమయంలో మరెన్నో సర్వీస్ సెక్టార్లలో శిక్షణ, నైపుణ్యాలు మన యువత సంపాదించాలి.

ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఒడిసి పట్టాలి. ప్రస్తుతం గణాంకాల ప్రకారం అధిక ఆదాయ దేశాలలో 55 శాతం వృద్ధ జనాభా అనగా 65 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు. జపాన్‌లో 1990-2021 మధ్య కాలంలో 26 శాతం వృద్ధ జనాభా పెరిగింది. వీరిలో 70 శాతం మంది ఆ దేశంలో 15-64 సంవత్సరాల మధ్య ఉన్న వారిపై ఆధారపడి బతుకుతున్నారు.‌ జపాన్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక వృద్ధ జనాభా కలిగిన దేశంగా ఉంది. అక్కడ 1980లో మగ వృద్ధులు 9.7 శాతం ఉండగా, 2021 నాటికి 25.7 శాతానికి పెరిగారు.‌ మహిళా వృద్ధులు 13.9 శాతం నుంచి 31.6 శాతానికి పెరిగారు.

వివిధ దేశాలలోనూ

అదే విధంగా పది శాతం శాతం వృద్ధ జనాభా పెరిగి 56 శాతంతో జర్మనీ, 63 శాతంతో ఫ్రాన్స్ ఉన్నాయి.‌ అమెరికాలో 55 శాతం, ఆస్ట్రేలియాలో 57 శాతం వృద్ధ జనాభా ఉన్నారు.‌ ఫ్రాన్స్‌లో పురుష వృద్ధులు 18.9 శాతం, మహిళలు 23.2 శాతం, జర్మనీలో పురుష వృద్ధులు 19.6 శాతం, మహిళలు 24.3 శాతం ఉన్నారు. 2021లో బ్రిటన్‌లో మగ వృద్ధులు 15.5 శాతం, మహిళలు 20.1 శాతం ఉండగా, అమెరికాలో మగవారిలో వృద్ధులు 17.6 శాతం, మహిళలు 18.6 శాతం ఉన్నారు. ఆస్ట్రేలియాలో మగ వృద్ధులు 15.6 శాతం కాగా, మహిళలు 17.8 శాతంగా ఉన్నారు. మన భారతదేశంలో 65 సంవత్సరాలు దాటిన వారిలో పురుషులు కేవలం 6.3 శాతం, మహిళలు 7.3 శాతం ఉన్నారు. అనగా, మన దేశంలో యువత, శ్రామిక జనాభా ఎక్కువగా ఉన్నారు.‌ కావున అందరూ ఐటీ రంగం మీదే మొగ్గు చూపకుండా, ఇతర సేవా రంగాలలో, నైపుణ్యాలు కలిగిన సంస్థలలో పని చేయుటకు ముందుకు రావాలి.‌ దానికి అనుగుణంగా తర్ఫీదు పొందాలి.

ప్రభుత్వాలు స్కిల్స్ డెవలప్మెంట్ సంస్థల ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించే ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా అధిక ఆదాయ దేశాలలో ఉపాధి పొందే విధంగా తర్ఫీదు ఇవ్వడంతో పాటు ఫారిన్ లాంగ్వేజెస్ నేర్పించాలి. '2030 నాటికి ప్రపంచ సేవారంగం కేంద్రంగా చైనా ఎదుగుతుంది' అనే థీమ్‌తో ఆ దేశం ముందుకు సాగుతోంది.‌ మనదేశంలో కూడా ముఖ్యంగా ఆరోగ్య రంగంలో యువతకు శిక్షణ ఇవ్వాలి.‌ ఎందుచేతనంటే అభివృద్ధి చెందిన దేశాలకు భవిష్యత్తులో ఆరోగ్య అవసరాలు ఎక్కువగా ఉంటాయి. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి ఎక్కువగా భారత్ ఉత్పత్తి కేంద్రంగా ఉండాలి. ఎక్కువ ఉపాధి అవకాశాలు ఒడిసి పట్టాలి.‌ 'ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) దేశాలలో 15.8 శాతం నర్సులు ఇతర దేశాలకు చెందినవారే.

నైపుణ్యాలు పెంచుకోవాలి

మన దేశం నుంచి కూడా ఇతర దేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుని అభివృద్ధి సాధించాలి. అందుకు ముఖ్యంగా మన శ్రామిక జనాభాకు, యువతకు ఫారిన్ లాంగ్వేజెస్ నేర్పించాలి. ఆరోగ్య రంగంలో శిక్షణ, నైపుణ్యాలు మెరుగుపరచడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. శిక్షణా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేయాలి.‌ ఒకేషనల్ ట్రైనింగ్ ఇప్పించాలి.‌ ఇప్పటికే జపాన్ మన దేశంలో శిక్షణ పొందిన నర్సులకు 'స్పెసిఫైడ్ స్కిల్ వర్క్ (ఎస్ఎస్‌డబ్ల్యూ) నేర్పడానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంది.‌

మన దేశం కూడా యువతకు అభివృద్ధి చెందిన, అధిక ఆదాయ దేశాలలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రకరకాల ఒప్పందాలు కుదుర్చుకోవాలి. ఇందుకోసం ముందుచూపుతో ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి.‌ ఇప్పటికే దీనిలో 'కేరళ' రాష్ట్రం ముందు వరుసలో ఉంది. చాలా మంది కేరళీయులు ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకుని ఇతర దేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సంపాదించి, మన దేశానికి 'రెమిటెన్స్' రూపంలో విదేశీ మారక ద్రవ్యం పంపుతున్నారు. గత సంవత్సరం 2021లో మన దేశానికి చేరిన రెమిటెన్స్ 87 బిలియన్ల అమెరికన్ డాలర్లు.

భవిష్యత్ చిత్రపటం

ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ప్రకారం 2019లో ప్రపంచంలోని ప్రతీ 11 మందిలో ఒకరు వృద్ధుడు ఉండగా, 2050 నాటికి ప్రతీ ఆరుగురిలో ఒకరు ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే 17 దేశాలు వృద్ధ జనాభాతో మెజారిటీగా ఉన్నాయి. 2100 సంవత్సరం నాటికి 155 దేశాలు వృద్ధ జనాభా దేశాలుగా వర్ధిల్లుతాయని నివేదికలు చెబుతున్నాయి. కావున మన యువత ఆరోగ్య రంగంలో ఉద్యోగ అవకాశాలు అన్వేషించాలి. టెక్నాలజీ ఓరియెంటెడ్ సర్వీసులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సర్టిఫైడ్ కోర్సులు, నైపుణ్యాభివృద్ధి సంస్థలు ద్వారా వివిధ రకాల స్కిల్స్, సామర్థ్యాలు సంపాదించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి.

మన భారతదేశం కూడా 'మ్యూచువల్ రికగ్నిజైడ్ అగ్రిమెంట్ (ఎమ్ఆర్ఏ) చేసుకుని, భారత యువతకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి నేటి నుంచే ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. వృద్ధ ప్రపంచంలో అవకాశాలు ఒడిసిపట్టే విధంగా యువతకు తర్ఫీదు ఇవ్వాలి.


ఐ. ప్రసాదరావు

63056 82733


Next Story

Most Viewed