నమ్మిన సిద్ధాంతం... నిండైన జీవితం.. మల్లు స్వరాజ్యం..

by Disha Web Desk 20 |
నమ్మిన సిద్ధాంతం... నిండైన జీవితం.. మల్లు స్వరాజ్యం..
X

మల్లు స్వరాజ్యం ... ఈ పేరు యావత్ తెలంగాణ కే కాదు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో పరిషయ ము అక్కరలేని యోధురాలు... ఆమె పుట్టింది 500 ఎకరాల భూస్వామ్య కుటుంబంలో. పెరిగింది అడవుల్లో, గిరిజన గుడిసెల్లో ... పోరాడింది వెట్టి బ్రతుకుల వెతల తీర్చడం కోసం... భూమి భుక్తి విముక్తి కోసం...దొరతనాన్ని సవాల్ చేసి 14 ఏండ్ల చిరుప్రాయంలోనే తెలంగాణ సంస్థానంలో దొరలు, భూస్వామ్యుల ఆగడాలకు వ్యతిరేకంగా అన్న భీమిరెడ్డి నర్సింహరెడ్డి చేయి పట్టుకొని అడవుల్లోకి వెళ్ళింది... ఆమెకు 21 ఏండ్లు వచ్చిందాక ఇల్లు మొఖం చూడలే.

స్వాతంత్ర పోరాట కాలం అది...బంధువులు అప్పటికే పోరాటంలో ఉన్నారు.... ఆ సమయంలోనే స్వరాజ్యం 1930 -31 కాలంలో తుంగతుర్తి తాలూకా కరవీరాల కొత్తగూడెంలోని భీమిరెడ్డి రెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు జన్మించింది.... పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చిన్న వయసులోనే దోపిడీ, పీడనపై పిడికిలి బిగించింది.

ఆనాటి ఆడపిల్లలకు చదువుకోవడం తక్కువ.. గుర్రపు స్వారీ, ఆట పాటలు భూస్వామ్య కుటుంబం లోని ఆడ పిల్లలకు అరుదుగా ఉండేది... ఆ సమయంలోనే స్వరాజ్యం గుర్రపు స్వారీ, ఈత ఈదడం అన్న భీమిరెడ్డి తో నేర్చుకుంది.... తల్లి చొక్కమ్మకు తన బిడ్డను బాగా చదివించాలనే తపన ఉండే... స్వరాజ్యంకు చదువు కావాలనీ ఉన్నా ఆనాటి పరిస్థితులు, చదువుకోవాల్సిన వయస్సులో దొరలు, భూస్వామ్యుల ఆగడాలు, సామాన్య జనం గోస... నైజామోని దురాగతాలు అన్నీ కళ్లారా చూసి చలించి చావైన బతుకైనా జనం కోసమే అనుకుంది.... అన్నతో కలిసి ఆయుధం పట్టి అడవి బాట పట్టింది.. జాన్సీ లక్ష్మీ భాయి, ఓరుగల్లు ఏలిన రాణి రుద్రమదేవి ప్రభావం స్వరాజ్యం మీద పడింది...

అమ్మమ్మ ఊరు రామన్న గూడెం చుట్టూ విప్లవ వాతావరణం వేడెక్కింది... అప్పటికే బంధువులు కొందరు పోరాటంలో ఉన్నరు.... అమ్మమ్మ ఊరు అర్వపల్లి.... వాళ్లకు 4 వేల ఎకరాల భూమి ఉంది... దేవుడి మాన్యం మరో రెండు వేలు వీరి అధీనంలో ఉంది... జాజిరెడ్డి గూడెం, రామన్న గూడెం, సీతారాం పురం గ్రామాలు పూర్తిగా వీరి అధీనంలో ఉండే... భూస్వామ్య కుటుంబాల్లో సంప్రదాయ, సనాతన భావాలు, ఆడపిల్లల పట్ల ఆంక్షలు, పరదా చాటు జీవితాలు ఉండే.... మగపిల్లలతో తిరగడం లేదు... బయటి ప్రపంచానికే కాదు బయటి స్త్రీలను కూడా పరదా చాటు నుండే చూసే కట్టుబాట్లు ఉండేవి... ఆ పరిస్థితిలో స్వరాజ్యం కాశ బోసి మగపిల్లతో కబడ్డీ ఆడింది... బాబాయి కోణారెడ్డి కోపగిస్తే తప్పు ఎందని ఎదురు తిరిగింది...8 ఏండ్లకే తండ్రి చనిపోవడంతో ఇంటి బాధ్యత చిన్నానే చూసేది...ఆరోజుల్లో చిన్నతనంలో వయస్సు మళ్ళిన ముసలి వారితో ఆడపిల్లలకు పెండ్లీలు చేస్తుండే. వారి బాధలు చూసి చలించి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సంఘం పెట్టి పోరాడి అడ్డుకున్నది....

మానవత్వం మూర్తీభవించిన వీరనారి..

ఒక్క రోజు ఆ ఇంట్లొ వడ్లు దంచుతుంటే ఎల్లమ్మ అనే మహిళ కళ్ళు తిరిగి కిందపడింది... అది చూసి స్వరాజ్యం గారు లేపి మంచి నీళ్ళు తాపీ అన్నం పెట్టీ ఆదరించింది... మనిషిని మనిషి గా చూడాలి.. ముఖ్యంగా స్త్రీల పట్ల మమకారం, గౌరవం ఉండాలి... స్త్రీలకు హక్కులు ఉండాలి అనేఆంధ్ర మహాసభ పిలుపు ప్రభావం స్వరాజ్యంపై పడింది... దేవులపల్లి, అరుట్ల రామచంద్రారెడ్డి, అన్న భీమిరెడ్డి ప్రభావం ఉంది.. మాక్సిమ్ గోర్కి రాసిన అమ్మ నవల ప్రభావం... రష్యా విప్లవ ప్రభావం నాటి పోరాట యోధులపై పడింది....

ఆంధ్ర మహాసభ హైదరాబాద్‌లో జరుగుతుంటే అన్న వెంటబడి ఎడ్ల బండిపై వెళ్ళింది... అక్కడా జరిగిన చర్చలు, ఉపన్యాసాలు, దేశ స్వాతంత్రం, చదువు, మహిళలకు ప్రత్యేక హాస్పిటల్, వెట్టి చాకిరి, భూస్వాముల దోపిడీ, దౌర్జ్యన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమం స్వరాజ్యం గారిని ఉత్సాహ పరిచింది... చివరికి గ్రామీణ ప్రాంతాల్లో కూలి దోపిడీకి వ్యతిరేకంగా సమ్మెల దాక వెళ్లి కూలీ పెంచుకోవడంలో పేదలను ఉద్యమానికి ఉసిగొల్పింది...కూలీ పెంచేదాకా పొరాడింది.. ఒక దశలో మహిళలు భూస్వాములకు భయపడి కూలికీ వెళుతుంటే దారికి అడ్డంగా పడుకోని నన్ను తొక్కుకోని వెళ్ళండి అని స్వరాజ్యం చెప్పినప్పుడు కూలీలు దొరల చేలలో పనికి పోలే.. చివరకి భూస్వామ్యులు దిగి వచ్చి కూలీ పెంచిన్రు...కానీ దొరలకు కోపం వచ్చింది.. కూలీలను కొట్టడానికి మీదకు పొయిర్రు... ముందు నన్ను కొట్టి వాళ్ళను కొట్టండనీ ఎదురు తిరిగింది.... తోక ముడుసుకోని చేసేది ఏమిలేక వెనుతిరిగిర్రు. ఇలాంటి సంఘటనలు ఎన్నో...

ఉయ్యాల పాటలతో జనాన్ని ఉర్రూతలూగించింది...

భారతి భారతి ఉయ్యాలో...

మా తల్లి భారతి ఉయ్యాలా..

జనగామ తాలూకా ఉయ్యాలో..

విసునూరు దొరోడు ఉయ్యాలా...

నైజాం రాజ్యాన ఉయ్యాలో...

నాగిరెడ్డి పాలనా ఉయ్యాలా...

వెట్టి చేయలేక ఉయ్యాలో...

చచ్చి పోతున్నాం ఉయ్యాల....

పచ్చి బాలింతలు ఉయ్యాలో...

పట్టి ఈడ్చక పాయే ఉయ్యాల ...

ఉయ్యాల పిల్లలు ఉయ్యాలో...

పసి బిడ్డలోయమ్మ ఉయ్యాల....

నోరెండి చచ్చిరే ఉయ్యాలా...

గట్టు మీద దోరోడు ఉయ్యాలో

రొమ్ము పిండి చూసే ఉయ్యాల...

కాలు మొక్కిన గాని ఉయ్యాలో

కనికరం లేదాయే ఉయ్యాల...

కూడు గుడ్డ లేక ఉయ్యాలో...

గూడు గుడిసె లేక ఉయ్యాల...

ఎందుకు ఈ బ్రతుకు ఉయ్యాలో..

తిరగబడలేమా ఉయ్యాల...

ఊరంతా ఏకమై ఉయ్యాలో...

తిరగ బడ్డనాడు ఉయ్యాల...

ఉందురా దొరోడు ఉయ్యాలో..

ఇట్లా ప్రజల్లో తిరుగుతూ వారి కష్టాలని బాణీలు కట్టి ప్రజలు పాటలు పాడి జనాన్ని కదిలించింది...

అన్న చెప్పిన మాటలకు కట్టుబడి ఏనాడు కూలీ వాడల్లో జొరబడిందో వాటినే ఉద్యమ స్థావరాలుగా మార్చుకుంది...నా ఉపన్యాసాలకు విషయాలూ అందించింది పేదల వాడలే... పాటలకు బాణీలు అందించింది పల్లె తండాలే...నా జీవితానికి చరిత్ర నిచ్చింది పేదలే అని ఎంతో నమ్రతతో స్వరాజ్యం తన ఆత్మ కథలో చెప్పింది....

అందుకే అమె ప్రతి సారీ పార్టీ సమావేశాల్లో చెప్పేది.. ఊర్లకు వెళ్ళండి.. జనంలో తిరగండి.. సమస్యలు తెలుసుకోండి జనాన్ని కదిలించండి... పోరాటాలు చేయండని పదే పదే చెప్పేది... అందుకే పోరాట కాలంలో పీల్డ్ వర్క్ ఎంచుకుంది... సభలు ఉంటే, మూడు రోజులకు ముందే ఆడుతూ పాడుతూ జనాన్ని పోగు చేసేది... అవసరం అనుకుంటే వేదికలపై ఉపన్యాసాలు చెప్పి ఉర్రుతలూగించేది...

దేవురుప్పల, కడివెండి, మొండ్రాయి గిరిజన తండాలు... పాలకుర్తి ఎక్కడా సభలు జరిగినా ముందే స్వరాజ్యం గారు వెళ్ళేది.

సాయుధ పొరాట విరమణ. (1951 అక్టోబర్ 21న)

పోరాట కాలంలో ఆమెను పట్టుకోవడం కష్టమైంది... గత్యంతరం లేక స్వరాజ్యం గారి మీద 10 వేల రివార్డ్ ప్రకటించింది.... ఎవ్వరికీ స్వరాజ్యంగాగా తెల్వదు.. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో మారు పేర్లు ఎల్లమ్మ, రాములమ్మ, మైసమ్మ, ముత్తమ్మ రాజక్క గా మార్పు చేసుకుంటూ వెళ్ళేది... అందుకే పోలీసులు, రజాకార్లు కనిపెట్టలేక రివార్డ్ ప్రకటించారు... యూనియన్ సైన్యాలతో ఖాసీం రజ్వీ రాజేపడిన తర్వాత కమ్యూనిస్టుల పై పడి ఎక్కడ దొరికితే అక్కడా కాల్చి చంపిర్రు... నాయకుల ఆచూ కి కొరకు జనాని పట్టుకోని పిట్టలను కాల్సి చంపినట్లు చంపిర్రు... అప్పుడే స్వరాజ్యంపై 10వేలు రివార్డ్ ప్రకటించిర్రు.. దొరికితే చంపాలని కసి...కానీ స్వరాజ్యం ఎవ్వరీ కంట్లో పడకుండా తిరిగింది. కారణం.. గిరిజన తండాలు, అడవుల్లో స్థావరాలు చేసుకోవడం... ఒంటరిగా ఏ ఒక్కడు కూడా స్వరాజ్యం కోసం తిరిగే ధైర్యం చేయలేదంటే వారి ధైర్య సాహసాలు ఎంత గొప్పవో... చాలా సార్లు రాజకార్ల, సైన్యాల కంటపడి తప్పించుకున్న సందర్బాలూ వున్నాయి....

పోరాట విరమణ ఆమెను ఎంతో బాధించింది...ఏమి చేయాలో అర్ధం కాని పరిస్థితి. పార్టీ అందర్నీ ఇముడ్చుకునే పరిస్థితి లేకపోతోంది అని ఆందోళన చెందింది.... తల్లి ఆస్తిని అమ్ముకొని రాయిని గూడెం దగ్గర భూమి కొనుగోలు చేసి వ్యవసాయం మొదలు పెట్టింది... చిన్న పిల్లలు. గుడిసె కూడా సరిగ్గా లేని పరిస్థితి... వియన్ పార్టీ బాధ్యతలు... అమే కుటుంబ బాధ్యతలు పూర్తిగా మోయాల్సి వచ్చింది... ఆ పరిస్థితుల్లో మళ్లీ తిరిగి ఆయుధాలు పట్టుకుంటా అని నాయకులకు చెప్పింది...

ఎమ్మెల్యేగా మొదటిసారి 1978 నుండి 1983 వరకు

1978లో తుంగతుర్తి నుండి గెలిసి అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు చప్రాసి అడ్డుకున్నరట...కారణం అమె సాధారణ వేషధారణ...అమె ప్రజా జీవితం ఆసాంతం కూడా సాదా సీదాగానే గడిపింది... ఎవ్వరికీ కష్టం వచ్చినా కాలి నడకన వెళ్ళింది. పోరాట కాలంలో పంచిన భూముల రికార్డ్స్ కొరకు ఊర్లు తిరిగింది.. పేదల నుండి గుంజు కున్న భూములు పేదలకు ఇప్పించింది... ఎమ్మెల్యేగా ఉండి కాలి నడక, బస్సుల ప్రయాణం, మోటార్ సైకిల్‌పై, నియోజక వర్గం అంతా తిరిగేది... సమస్యను బట్టి డైరక్ట్‌గా అధికారులను కలిసి చెప్పేది... ప్రజలను వెంటబెట్టుకొని పని చేయించుకొని తిరిగి వచ్చేది... కాంగ్రెస్ దాడుల్లో చనిపోయిన కుటుంబాలను కలిసి ఆదుకోవడం, అండగా ఉండటం, ఓదార్పు ఇవ్వడం, రక్షణ కల్పించడంలో స్వరాజ్యం నాయకత్వంపై వత్తిడి చేసేది... నిజంగా అమె ఒక ధైర్యం...ఒక పోరాటం... ఒక చైతన్యం... ఒక విప్లవం.. ఒక ఉద్యమం... అమె జీవితమే ఆదర్శం...60 ఏండ్లు ప్రజా పోరాటంలో ఉండి చివరి శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన నిండైన జీవితం ఆమెది... అమె జీవితం, పోరాటాల చరిత్ర భావితరాలకు ఆదర్శం.... తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమెది ప్రత్యేక పేజీ ఉంటుంది. ఆమె చివరి దశలో దేశంలో జరుగుతున్న కుల, మత విద్వేషాలను నిరసించింది... ప్రజలు ఐక్యతతో తిప్పి కొట్టాలని చెప్పింది...

అనారోగ్య సమస్యలతో 2022 మార్చి 19న 93 సంవత్సరాల వయస్సులో కన్ను మూసింది... వారి. ఆశయాల బాటలో చిన్న కుమారుడు, కోడలు మల్లు లక్ష్మి నాగార్జున రెడ్డి సీపీఎంకు పూర్తికాలం కార్యకర్తలుగా పని చేస్తూ రాష్ట్ర, జిల్లా బాధ్యతల్లో వున్నారు.. వారి ప్రధమ వర్ధంతి సభ 19.03.2023న సూర్యాపేట జిల్లా రాయని గూడెంలో జరుగుతుంది. ముఖ్య అతిధులుగా బివి రాఘవులు హజరవుతున్నారు...


నెమ్మాది వేంకటేశ్వర్లు, సీపీఎం నాయకలు,

9848720533

Next Story

Most Viewed