న్యాయవాదులకు కావాల్సింది స్కీమ్ లు కాదు

by Disha edit |
న్యాయవాదులకు కావాల్సింది స్కీమ్ లు కాదు
X

న్యాయవాదుల కోసం వంద కోట్లు కేటాయించిన రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని తాజా బడ్జెట్ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉంది. వందకోట్ల కార్పస్ ఫండ్‌తో న్యాయవాదులకు కేవలం హెల్త్ కార్డుల్ని మాత్రమే ప్రభుత్వం జారీ చేసింది తప్పా, ఆ రూపాయలను న్యాయవాదులకు పంచలేదు. ఆ హెల్త్ కార్డులు కూడా చాలా సందర్భాల్లో న్యాయవాదులకు ఏ మాత్రం ఉపయోగపడడం కూడా లేదు. అయితే ఉద్యమ సమయంలో అర్హులైన న్యాయవాదులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందో అందరికీ తెలుసు. మరి జూనియర్ న్యాయవాదులకు పక్క రాష్ట్రంలో నెలకు ఐదువేల రూపాయల స్టయిఫండ్ ఇస్తున్న విషయం కేటీఆర్‌కి తెలియంది ఏమీ కాదు. గత రెండేళ్లలో రాష్ట్రంలో న్యాయవాదులపై జరిగిన దాడులపై కేసీఆర్, కేటీఆర్‌లు ఎందుకు స్పందించడంలేదో సమాధానం చెప్పాలి.

న్యాయవాదుల సంక్షేమంపై ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 41 సీఆర్‌పీసీ (స్టేషన్ బెయిల్) రద్దు కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చెయ్యాలి. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థని రద్దు చేసి నేరస్తులపై ఉక్కుపాదం మోపుతూ, ఎఫ్ఐఆర్‌ల సంఖ్యని పెంచాల్సిన అవసరం ఉంది. పోలీస్ స్టేషన్లలో ఎస్సైలు, సీఐలు సివిల్ పంచాయితీలు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలి. ఖాళీగా ఉన్న జూనియర్ సివిల్ జడ్జి పోస్టులతో పాటు హైకోర్టు మరియు క్రింది కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఏపీపీ, ఏజీపీ, జూనియర్ అసిస్టెంట్‌తో పాటు ఇతర విభాగ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అన్ని రకాల ప్రైవేట్ కంపెనీలలో లీగల్ అడ్వైజర్ పోస్టుల్ని సృష్టించి న్యాయవాదులకు ఉపాధి పెంచే మార్గాల్ని అన్వేషించాలి. వీటన్నింటికంటే ముఖ్యంగా న్యాయవాదులపై దాడులు జరగకుండా రక్షణ చట్టాన్ని (అడ్వకేట్ ప్రొటెక్ట్ యాక్ట్) రూపొందించాలి. చట్టాల్ని రూపొందించే చట్టసభ అసెంబ్లీలో కనీసం పది శాతం న్యాయవాదులు ఉండేలా, అన్ని రాజకీయ పార్టీల నుండి వారికి అసెంబ్లీ టికెట్లు ఇచ్చేలా ఒక చట్టాన్ని రూపొందించి అమలు చేయాలి. న్యాయవాదులు సాధారణ ఓటర్లు కాదని, వారికి కావాల్సింది స్కీమ్ లు పెన్షన్ కాదు, ఉపాధి అని మంత్రి కేటీఆర్ గారు తెలుసుకుంటే బాగుంటుంది.

- పసునూరి శ్రీనివాస్

88018 00222



Next Story

Most Viewed