జాతిహితం కేసీఆర్ అభిమతం

by Disha edit |
జాతిహితం కేసీఆర్ అభిమతం
X

దేశం బాగుపడాలంటే రైతు బాగుండాలని అంటారు కేసీఆర్. అందుకే దేశ వ్యవసాయ రంగం మీద రైతు సంఘాలతో, ప్రతినిధులతో కూలంకషంగా చర్చిస్తున్నారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలను నిరసించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఉద్యమ పిడికిలి బిగించారు. తెలంగాణ అమరవీరుల కుటంబాలను ఆదుకున్న అనుభవంతోనే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించి మరణించిన రైతు కుటుంబాలకు ఆత్మీయ స్పర్శను అందించారు. కేంద్రం కానీ, మరే ఇతర రాష్ట్రం స్పందించని రీతిలో స్పందించి రైతు బాంధవుడనని చాటుకున్నారు. దాదాపు 750 మంది రైతుల కుటుంబాలకు రూ. మూడు లక్షల చొప్పున స్వయంగా చెక్కులను అందించారు.

జాతిహితం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అనేక సేవా, ఔదార్య కార్యక్రమాలలో ముందు నడుస్తున్నారు. విపత్తుల సమయంలో ఏ రాష్ట్రానికి కష్టమొచ్చినా తన వంతుగా సహాయం అందిస్తామని భరోసా ఇస్తున్నారు. ఇవాళ 'కేసీఆర్ జాతీయ పార్టీ, జాతీయ ఎజెండా' అనే మాటలు వినబడుతున్న క్రమంలో ఆయనలో దాగి ఉన్న జాతీయవాదంపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ప్రాంతీయవాదంలోని తన పంథాతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుని దేశం గర్వించేలా అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్న కేసీఆర్, దేశం కూడా అభివృద్దిలో అగ్రభాగాన ఉండాలని కోరుకుంటున్నారు. దేశం కోసం ఓ సరైన నాయకత్వం రావాలని ఆశించడంలో తప్పేముంది? కేసీఆర్ జాతిహితం కోసం ఏం చేసారని పరిశీలిస్తే అనేక ఉదాహరణలు కనిపిస్తాయి.

'దేశానికి రైతే రాజు' అని చెప్పేది ఒక్క తెలంగాణ సర్కారే. రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. పంట రుణాల బకాయిలు, నీటి తీరువా రద్దు చేసారు. రైతు చనిపోతే రూ.ఐదు లక్షల బీమా ఇస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా దేశవ్యాప్తంగా ఎందుకు అమలు కాకూడదంటూ జాతీయవాదాన్ని చాటుకున్నారు. పంటల సాగు కోసం ఎకరాకు రూ. పది వేలు ఇచ్చి రైతుకు భరోసాగా నిలుస్తున్నారు. వ్యవసాయంలో వస్తున్న స్థూల మార్పులను ఒక రైతుగా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ప్రాంతాలవారీగా క్రాప్ కాలనీలు ఏర్పాటు, ఆధునిక, సేంద్రియ వ్యవసాయ సంకల్పం దిశగా ముందుకు సాగుతున్న నేత కూడా ఆయనే.

అందరితో చర్చించి

దేశం బాగుపడాలంటే రైతు బాగుండాలని అంటారు కేసీఆర్. అందుకే దేశ వ్యవసాయ రంగం మీద రైతు సంఘాలతో, ప్రతినిధులతో కూలంకషంగా చర్చిస్తున్నారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలను నిరసించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఉద్యమ పిడికిలి బిగించారు. తెలంగాణ అమరవీరుల కుటంబాలను ఆదుకున్న అనుభవంతోనే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించి మరణించిన రైతు కుటుంబాలకు ఆత్మీయ స్పర్శను అందించారు. కేంద్రం కానీ, మరే ఇతర రాష్ట్రం స్పందించని రీతిలో స్పందించి రైతు బాంధవుడనని చాటుకున్నారు. దాదాపు 750 మంది రైతుల కుటుంబాలకు రూ. మూడు లక్షల చొప్పున స్వయంగా చెక్కులను అందించారు. కేంద్రం రూ. 25 లక్షల చొప్పున సహాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్యమ కాలంలో రైతులపై మోపిన అన్ని కేసులను బేషరతుగా ఎత్తివేయాలన్నారు. పుల్వామా ఘటనలో అమరులైన 19 మంది జవాన్ల కుటుంబాలకు రూ. పది లక్షల చొప్పున అందచేశారు. కరోనా సమయంలో వలస జీవులను అక్కున చేర్చుకున్నారు. రేషన్‌ ఇచ్చి, వారిని స్వంత ఖర్చులతో ప్రత్యేక రైళ్లు పెట్టించి స్వస్థలాలకు పంపించారు. ఆ సమయంలో కేసీఆర్ గొప్పతనాన్ని జాతీయ మీడియా సైతం ప్రశంసించింది. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో సాగునీరు, విద్యుత్, రవాణా తదితర రంగాలలో పరస్పర సహకార సంబంధాలు నెరుపుతున్నారు.

కలిసి ఉందామంటూ

'రాష్ట్రాలుగా విడిపోయినా, ప్రజలుగా కలిసుందాం' అని తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పదే పదే చెప్పారు. చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమనుకున్న ప్రతీ సందర్భంలో స్నేహహస్తం అందిస్తూ వస్తున్నారు. 2015 అక్టోబర్ 23న ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని 'అమరావతి' శంకుస్థాపనకు హాజరయ్యారు. ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. 2017 ఏప్రిల్ 11న రాజ్యసభలో జరిగిన చర్చలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో కల్వకుంట్ల కవిత కూడా అదే డిమాండ్ చేశారు. 2014 అక్టోబర్ నెలలో హుద్‌హుద్ తుఫాన్ సమయంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం రూ.18 కోట్ల విలువైన 530 ట్రాన్స్ ఫార్మర్లు, 28,500 కరెంటు స్తంభాలు, 900 కిలోమీటర్ల వైర్లను పంపించారు. వాటిని అమర్చడానికి విద్యుత్ అధికారులు, సిబ్బందిని, ఐదుగురు ఐఏఎస్ అధికారులనూ పంపించారు.

2018 ఆగస్టు నెలలో కేరళలో వరదలు వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేరళకు రూ.25 కోట్ల నగదును అందజేసింది. నీటిని శుద్ధి చేయడానికి రూ.2.5 కోట్ల విలువైన ఆర్వో మిషన్లను, వంద టన్నుల బియ్యాన్ని పంపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తమ ఒక రోజు వేతనాన్ని వరద సహాయక నిధులకు ఇచ్చారు. తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి త్రివేండ్రంలో కేరళ సీఎం పినరయి విజయన్‌ను కలిసి రూ.25 కోట్ల చెక్కు అందించారు. 2014 సెప్టెంబరులో వరదలతో జమ్మూ-కాశ్మీర్ బాగా దెబ్బతిన్నది. తెలంగాణ ప్రభుత్వం తరఫున కేసీఆర్ రూ.10 కోట్ల సాయం అందించి, 50 నీటి శుద్ధి యంత్రాలను పంపారు.

కరెంటు కోసమని

ఆవిర్భావ సమయంలో తీవ్ర కరెంటు కోతలతో ఇబ్బంది పడిన తెలంగాణ నాలుగున్నరేళ్లు గడిచేసరికి మరో రాష్ట్రానికి విద్యుత్ అందించే స్థాయికి చేరింది. 2018 నవంబర్‌లో రాజస్థాన్‌లో విద్యుత్ కొరత ఏర్పడితే తెలంగాణ రెండు నెలల పాటు 500 మెగావాట్ల చొప్పున విద్యుత్ అందించడానికి సిద్ధపడింది. తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో 2018 జనవరి నెలలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. పంటలు ఎండిపోయే పరిస్థితి. కర్ణాటక ప్రభుత్వం కోరిక మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆర్డీఎస్ ద్వారా 1.3 టీఎంసీల నీటిని అందించి పంటలు కాపాడింది.

2016 మార్చి 8న మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదుల మీద ఐదు బ్యారేజిలు నిర్మించడానికి మార్గం సుగమమయింది. వెయ్యి మెగావాట్ల కరెంటు కొనుగోలుకు 2015 నవంబర్ మూడున తెలంగాణ సీఎం కేసీఆర్, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ సమక్షంలో ఒప్పందంపై అధికారులు సంతకాలు చేశారు. దీంతో వార్థా నుంచి హైదరాబాద్‌కు 765 కేవీ డీసీ లైన్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఉత్తర, దక్షిణ గ్రిడ్ల మధ్య విద్యుత్ ఇచ్చి పుచ్చుకునేందుకు దీంతో అవకాశం ఏర్పడింది.

వెంకట్ గుంటిపల్లి

9494 941001


Next Story

Most Viewed