కథా సంవేదన: ప్రార్థన

by Disha edit |
కథా సంవేదన: ప్రార్థన
X

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా స్మశానం వైపు నడవసాగాడు .

అప్పుడు శవంలోని బేతాళుడు – “రాజా! కష్టపడితే పడ్డావు కానీ నీకు కష్టం తెలియకుండా ఉండటానికి “ప్రార్థన” అన్న ఓ కథ చెబుతాను, విను “అంటూ చెప్పసాగాడు.

“కిరణ్ ఓ న్యాయవాది. యువకుడు. అతనికి ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి. అతను ఓ రోజు వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళినాడు. వాళ్ల బావ ఓ సీనియర్ పోలీసు అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. వాళ్ళ బావకి ఉర్దూ బాగా వచ్చు. ఆయన చదువుకున్నది ఉర్దూ మీడియంలో. అప్పటి పాఠ్య పుస్తకాలు ఇంకా వాళ్ల బావ దగ్గర ఉన్నాయి. కిరణ్ వెళ్ళినపుడు టీపాయ్ మీద అప్పటి పాఠ్య పుస్తకాలు కనిపించాయి. 1940-45 ప్రాంతంలోని పాఠ్యపుస్తకాలు అవి. ఓ పుస్తకాన్ని తీసి తిరగేశాడు. అది చాలా పాతబడిపోయి ఉంది. దాన్ని మొదటి నుంచి చివరి దాకా చూశాడు. ఇప్పటి పాఠ్యపుస్తకాల్లో మాదిరిగా ఇందులో ఓ ప్రార్థన గీతం కనిపించింది. ‘ప్రతిజ్ఞ’లాంటిది. అది ఉర్దూలో ఉండడం వల్ల కిరణ్ దాన్నిఅర్థం చేసుకోలేకపోయాడు. చదవలేకపోయాడు కూడా. కిరణ్ కి ఉర్దూ రాదు. అప్పుడు ప్రార్థన ఏ రకంగా ఉండేదో తెలుసుకోవాలని అనిపించింది.

తెలుగులో దాని సారాంశాన్ని చెప్పమని వాళ్ళ బావని కోరినాడు కిరణ్. దాన్ని తెలుగులో తర్జుమా చేసి చదివి వినిపించాడు వాళ్ళ బావ. అది ఇలా ఉంటుంది-

“ఈ సృష్టి ఉన్నంత వరకూ మీ రాజ్యం కొనసాగాలని సృష్టికర్త ఆశీర్వదిస్తాడు. ఓ ఉస్మాన్- మిమ్మల్ని మంచిగా, ఆరోగ్యంగా ఉంచుతాడు. వంద సంవత్సరాలు గౌరవంగా జీవించేలా చేస్తాడు. ఆ భగవంతుని దయవల్ల మీరు ఎంతో మందికి ఆదర్శంగా, గర్వంగా నిలుస్తారు.

అదేవిధంగా మీ పాలనని విశిష్టంగా ఉంచుతాడు. మీ సంతానానికి ఖిజ్రీ వంటి సుదీర్ఘ జీవితాన్ని ఆ దేవుడు ప్రసాదిస్తాడు. వారసత్వంగా మీ పాలన కొనసాగేలా ఆశీర్వదిస్తాడు.

మీ ముందు హాకీం దాతృత్వం పాలిపోయి ఉంటుంది. మీ న్యాయభావం ఖుస్రోని కూడా అధిగమిస్తుంది. మీ శ్రేయోభిలాషులు పుష్పాల్లాగా నిండుగా వికసిస్తారు. మీ శత్రువులు మీ పరాక్రమాన్ని చూసి దాసోహం అవుతారు ఓ ఉస్మాన్- మీ చావిడిని ఆ దేవదేవుడు ఆనంద పారవశ్య నివాసంగా మారుస్తాడు.”

ఇది అ ప్రార్థన తెలుగులో అని చెప్పాడు వాళ్ళ బావ. నేను సరిగ్గానే అనువాదం చేశానని అనుకుంటున్నాను అని కూడా అన్నాడు.

కిరణ్‌కి విషయం అర్థమైంది. అయితే ‘భారత దేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు’ అన్న పైడిమర్రి వెంకట సుబ్బారావు రాసిన ప్రతిజ్ఞ లాంటివే ఇప్పుడు కనిపిస్తున్నాయి కానీ ఉస్మాన్ కాలంనాటి ప్రార్థనలు కనిపించడం లేదు ఎందుకనో' అని అనుకున్నాడు.

ఇలాంటి ప్రార్థనలు లేకుండానే హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కూడా ఒక తరం తరువాత మరో తరం జడ్జీలుగా వస్తున్నారు. జిల్లా కోర్టుల్లో అయితే కాంపిటీటివ్ పరీక్షలు రాసి వస్తారు. అది పర్వాలేదు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో అలాంటి పరిస్థితి లేదు. రాజ్యాంగంలో కూడా న్యాయమూర్తుల విషయంలో ఇలాంటి ప్రార్థనలు ఇప్పటి పాఠ్య పుస్తకాల్లో ఎందుకు లేవో కిరణ్‌కే కాదు. నాకు కూడా అర్థం కాలేదు. కారణం ఏమిటి..’’

ఈ సందేహాలకు సమాధానాలు తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది” అన్నాడు బేతాళుడు.

దానికి విక్రమార్కుడు- “బేతాళా, ఇప్పుడు కాలం మారిపోయింది. రాజులు సంస్థానాధీశులు ఇప్పుడు లేరు. ప్రజాస్వామ్య ముసుగులో రాజ్యపాలనలు కొనసాగుతున్నాయి. ఏ మాత్రం శ్రద్ధగా గమనించినా ఈ విషయం నీకు బోధపడుతుంది. కానీ అలాంటి ప్రార్థనలు ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో ఉంచడం భావ్యం కాదని నేటి పాలకులు భావించి వుంటారు. నిజానికి అలా ప్రార్ధించాలని వాళ్ళ మనస్సులో వుంటుంది. అయినా ఆ ప్రార్థనలని ప్రత్యక్షంగా పాఠ్యపుస్తకాల్లో పెట్టలేదు. కానీ నిగూఢంగా ఆ ప్రార్థనలు ఉన్నాయి. పరోక్షంగా పాలకులు గమనిస్తూనే వున్నారు. అధికారులూ, పదవుల్లో ఉన్న వ్యక్తులు, నాయకులు రోజు ఉదయాన్నే కాదు అనుక్షణం ఆ ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. వాళ్ల తమ ట్వీట్ల ద్వారా, హావభావాల ద్వారా, శుభాకాంక్షల ద్వారా ప్రార్థనలని చేస్తూనే వున్నారు. కొంచం శ్రద్ధగా మనం ఆ కోణంలో చూస్తే చాలు. ఆ ప్రార్థనలు మనకూ వినిపిస్తాయి. అంతే !

ఇక హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల విషయంలో ఇలాంటి ప్రార్థనలు లేవు. అక్కడ ప్రార్థనలు అవసరం లేదు. రాజకీయ నాయకులు కనీసం ఐదు సంవత్సరాల కొక సారి ప్రజల దగ్గరికి పోతారు. న్యాయమూర్తులకి అది అవసరం లేదు. ఒక్కసారి న్యాయమూర్తి అయితే చాలు. ఎన్ని తప్పుడు ఉత్తర్వులు రాసినా బాధ లేదు. భయం లేదు. ఏమి కాదు.

ఇక నియామకాలు అన్నీ వాళ్ల చేతుల్లోనే. అందుకే వాళ్ల కొడుకులూ, కూతుర్లూ, అల్లుళ్లూ కూడా న్యాయమూర్తులవుతారు. వాళ్లు అలా అయ్యేవిధంగా కొలీజియంలోకి తమ ఇష్టులు, తమకి అనుకూలురు వచ్చే విధంగా ప్రణాళికలు రచిస్తారు. వీళ్లకి సన్మానాలు జరిగినప్పుడు ఇంతకంటే గొప్ప ప్రార్థనలని నువ్వు చూడవచ్చు బేతాళా! అని చెప్పాడు.

విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టు ఎక్కేసాడు.

మంగారి రాజేందర్ జింబో

94404 83001



Next Story

Most Viewed