అంతరిక్ష రంగాన్ని మలుపు తిప్పిన దార్శనికుడు

by Ravi |   (  Updated:2025-04-27 00:30:46  IST  )

మొన్న కన్నుమూసిన డాక్టర్ కస్తూరి రంగన్ విజ్ఞాని మాత్రమే కాదు. ఆయన విజ్ఞానం పుస్తకాల్లో నిక్షిప్తమైన దాని కంటే గొప్పది.

అంతరిక్ష రంగాన్ని మలుపు తిప్పిన దార్శనికుడు
X

మొన్న కన్నుమూసిన డాక్టర్ కస్తూరి రంగన్ విజ్ఞాని మాత్రమే కాదు. ఆయన విజ్ఞానం పుస్తకాల్లో నిక్షిప్తమైన దాని కంటే గొప్పది. విజ్ఞానం కోసం తపస్సు చేసిన తత్వవేత్త. మన దేశ శాస్త్రవేత్తల సేవలు దేశానికి గర్వకారణాలు. అలాంటి మేధావుల్లో ఒకరు డాక్టర్ కస్తూరి రంగన్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) కు ఆయన చైర్మన్‌గా 1994 నుండి 2003 వరకు సేవలందించారు. ఈ పదవీ కాలంలో ఆయన చేసిన కృషి, తీసుకున్న నిర్ణయాలు ఇస్రోను ప్రపంచ స్థాయిలో నిలబెట్టాయి. ఆయన గతంలో ఇస్రో ఉపగ్రహ కేంద్రం డైరెక్టర్‌గా ఉన్నారు, అక్కడ ఆయన కొత్త తరం అంతరిక్ష నౌక, ఇండియన్ నేషనల్ శాటిలైట్ (INSAT-2), ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ (IRS-1A & 1B) అలాగే శాస్త్రీయ ఉపగ్రహాల అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించారు. PSLV C2 (1999) ద్వారా మొదటిసారిగా బహుళ దేశాల శాటిలైట్లను ఒకే రాకెట్ ద్వారా ప్రయోగించి, భారత్‌ను అంతర్జాతీయంగా గుర్తింపుకు తీసుకువచ్చారు. చంద్రయాన్-1, భారత్ తొలి చంద్ర మిషన్‌కు ప్రాథమిక రూపకల్పన ఆయన నేతృత్వంలోనే ప్రారంభమైంది. విద్యార్థులు, యువతకు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి కలిగించే కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు. ఇస్రోకి సేవల అనంతరం కూడా ఆయన విశ్రాంతి తీసుకోలేదు. జాతీయ విద్యా విధానం 2020 (NEP 2020) రూపకల్పనలో ప్రధాన శిల్పిగా మారారు. మాతృభాషలో విద్యాభ్యాసం, 5+3+3+4 విద్యా నిర్మాణం, సృజనాత్మకతకు ప్రాధాన్యం, మార్కులకు బదులు వ్యక్తిత్వ వికాసానికి విద్య ఉండాలన్న దృక్కోణం – ఇవన్నీ ఆయన మార్గదర్శకతలో NEP ద్వారా ప్రతిఫలించాయి. “చదువు కోసం చదవడం కాకుండా, జీవితం కోసం చదవాలి” అనే తత్వాన్ని ఆయన పునరుద్ఘాటించారు.

వాడవల్లి శ్రీధర్

99898 55445

Next Story