కాకినాడ.. హరిత శక్తి విప్లవానికి కొత్త చిరునామా!

by Ravi |   (  Updated:2026-02-11 00:45:50  IST  )

ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని కాకినాడ ఇప్పుడు కేవలం ఓడరేవు నగరం మాత్రమే కాదు.. భారతదేశ హరిత శక్తి ప్రయాణానికి కొత్త చిరునామాగా మారుతోంది. ప్రపంచం మొత్తం వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ సమయంలో, స్వచ్ఛ శక్తి వైపు అడుగులు వేయడం దేశాలకు అనివార్యంగా మారింది..

కాకినాడ.. హరిత శక్తి విప్లవానికి కొత్త చిరునామా!
X

ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని కాకినాడ ఇప్పుడు కేవలం ఓడరేవు నగరం మాత్రమే కాదు.. భారతదేశ హరిత శక్తి ప్రయాణానికి కొత్త చిరునామాగా మారుతోంది. ప్రపంచం మొత్తం వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ సమయంలో, స్వచ్ఛ శక్తి వైపు అడుగులు వేయడం దేశాలకు అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో కాకినాడలో ప్రతిపాదిత గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టు దేశ భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తోంది..

ఈ ప్రాజెక్టు ఆర్థిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ, శక్తి భద్రత, అంతర్జాతీయ గుర్తింపును భారత్‌కు అందించే సామర్థ్యం కలిగి ఉంది. కాకినాడ నుంచి ప్రపంచానికి స్వచ్ఛ శక్తి విప్లవం నిజంగా ప్రారంభమయ్యే అవకాశముంది.

కాకినాడకు మరో భారీ పెట్టుబడి..

ఆంధ్రప్రదేశ్‌కు మరో కీలక పెట్టుబడి రానుంది. కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్ ఏర్పాటు కానుంది. ఏఎం గ్రీన్ సంస్థ సుమారు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ ప్లాంట్ నిర్మాణంతో కాకినాడ కేవలం ఓడరేవు నగరంగా మాత్రమే కాకుండా, భారతదేశ హరిత శక్తి ప్రయాణానికి కేంద్ర బిందువుగా మారనుంది. ఏపీలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్ ఏర్పాటు కానుంది. ఏఎం గ్రీన్ సంస్థ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఇది తీర ఆంధ్ర ప్రాంతానికి ఉపాధి పరంగా పెద్ద ఊపునిస్తుంది. నిర్మాణ దశలోనే సుమారు 8,000 ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. ఇంజినీర్లు, టెక్నీషియన్లు, కార్మికులు, లాజిస్టిక్స్ సిబ్బంది ఇందులో భాగమవుతారు.. వేలాది మందికి దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలు ఉంటాయి.

దశలవారీగా అభివృద్ధి..

ఈ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌ను దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. 2027 నాటికి ఏడాదికి 0.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు.. 2028 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 1 మిలియన్ టన్నులకు, 2030 నాటికి 1.5 మిలియన్ టన్నులకు పెంచాలని ప్రణాళిక రూపొందించారు.. ఈ లక్ష్యాలు సాధ్యమైతే, ప్రపంచ క్లీన్ ఎనర్జీ మార్కెట్‌లో భారత్ కీలక స్థానాన్ని సంపాదించనుంది. కాకినాడలో ఉత్పత్తయ్యే గ్రీన్ అమ్మోనియాను సింగపూర్, జర్మనీ, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి చేయనున్నారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో ముందున్న ఈ దేశాలకు భారతదేశం నుంచి గ్రీన్ అమ్మోనియా సరఫరా కావడం దేశానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకురానుంది. క్లీన్ ఎనర్జీ సరఫరాలో గ్లోబల్ సప్లయర్‌గా నిలవాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది.

సంప్రదాయ అమ్మోనియా ఎందుకు గ్రీన్ కాదంటే..?

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా తయారయ్యే అమ్మోనియా సహజ వాయువు (మీథేన్) ఆధారంగా ఉత్పత్తి అవుతుంది. హైడ్రోజన్‌ను పొందేందుకు స్టీమ్ మీథేన్ రిఫార్మింగ్ అనే ప్రక్రియను ఉపయోగిస్తారు. ఈ దశలోనే భారీగా కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. మొత్తం అమ్మోనియా తయారీ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే కార్బన్ ఉద్గారాలలో సుమారు 90 శాతం ఈ దశ నుంచే వస్తాయి. ప్రపంచ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలలో సుమారు 1.8 శాతం అమ్మోనియా పరిశ్రమ నుంచే వస్తుండటం దీనిలోని తీవ్రతను సూచిస్తుంది.

వ్యవసాయానికి మేలు, సవాళ్లు కూడా..

గ్రీన్ అమ్మోనియా దేశీయంగా అందుబాటులోకి వస్తే, ఎరువుల తయారీలో దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. రైతులకు సుస్థిర ఎరువులు లభిస్తాయి. అయితే నిరంతర పునరుత్పాదక విద్యుత్ సరఫరా, నీటి వినియోగం, తీర ప్రాంత ప్రజల జీవనోపాధిపై ప్రభావం వంటి సవాళ్లను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. మొత్తానికి, కాకినాడ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు ఆర్థిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ, శక్తి భద్రత, అంతర్జాతీయ గుర్తింపును భారత్‌కు అందించే సామర్థ్యం కలిగి ఉంది. సరైన ప్రణాళిక, బాధ్యతాయుత అమలు ఉంటే కాకినాడ నుంచి ప్రపంచానికి స్వచ్ఛ శక్తి విప్లవం నిజంగా ప్రారంభమయ్యే అవకాశముంది.

- వాడవల్లి శ్రీధర్

99898 55445

Next Story