పగలు, ప్రతీకారాలే ‘జగనిజం’

by Disha edit |
పగలు, ప్రతీకారాలే ‘జగనిజం’
X

వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనకు పాతరేసి ఆటవిక, అరాచక పాలన కొనసాగిస్తున్నారు. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. అదేవిధంగా జగన్ రెడ్డికి అంటిన అవినీతి మరకను అందరికీ అంటించాలని చూస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి అక్రమాలు జరగనప్పటికీ, చంద్రబాబు పాత్రపై ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ అన్యాయంగా ఇరికించి 14 రోజుల పాటు ఆయన్ను రిమాండ్‌కు పంపడం జగన్ రెడ్డి రాక్షసత్వానికి పరాకాష్ట. చంద్రబాబును పథకం ప్రకారమే సెలవురోజున అరెస్ట్ చేశారు.

ప్రజల సొమ్ము దోచుకుని జైలు కూడు తిన్నానని.. అందరికీ జైలు కూడు తినిపించాలని జగన్ రెడ్డి ఆరాటపడుతున్నట్టు ఉన్నారు. ప్రపంచం మొత్తం జీ-20 సమావేశాలవైపు చూస్తున్న వేళ జగన్ రెడ్డి చూపు కక్షలు, కార్పణ్యాల వైపు చూస్తోంది. 11 సీబీఐ కేసుల్లో ఏ-1 నిందితుడిగా ఉండి, 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఖైదీ నెం.6093‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై, మీడియా యాజమాన్యాలపై అక్రమ కేసులు పెట్టి వారిని కూడా నేరస్థులుగా చిత్రీకరించాలని చూస్తున్నారు.

ఫైలే లేకుండా కేసా?

నేడు జగన్ రెడ్డి దేశంలోనే అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. కానీ చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని చెప్పడం విడ్డూరంగా ఉంది. 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా, 14 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబును అత్యంత దుర్మార్గంగా, అర్ధరాత్రి వేళ అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది? కనీసం ఆయన వయసును కూడా పరిగణనలోకి తీసుకోకుండా పోలీసు అధికారులు ఉన్మాదంగా వ్యవహరించారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు, పైగా గవర్నర్ అనుమతి లేదు అయినా, ఎలా అరెస్ట్ చేస్తారు? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? 2021లో కేసు నమోదు చేస్తే.. ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉన్నారు? గుజరాత్ సహా తమిళనాడు, కర్ణాటక వంటి అనేక రాష్ట్రాలు చేసుకున్న స్కిల్ డెవలప్ మెంట్ ఒప్పందాన్ని ఏవిధంగా తప్పంటారు? 2.13 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి 72 వేల మందికి ఉద్యోగాలు కల్పించడం వాస్తవం కాదా?

బాబుపై ఈ కేసును రాజకీయ ప్రేరేపితంగా, దురుద్దేశంతో ఆపాదిస్తున్నారు. కనీస ఆధారాలు లేకుండా ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన పోరాడుతున్న చంద్రబాబును ఏవిధంగా నిర్బంధిస్తారు? రిమాండ్ రిపోర్ట్‌లో కూడా ఒకదానికికొకటి పొంతన లేదు. స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో రిటైర్డ్ ఐఏఎస్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించిన పీవీ రమేష్ వాంగ్మూలంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశామనే వాదనను ఆయనే ఖండించారు. తాను అప్రూవర్‌గా మారారనే ప్రచారం అవాస్తమన్నారు. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆర్థికశాఖ ఏ తప్పూ చేయలేదన్నారు. ఒకవేళ తప్పు చేస్తే అజయ్ కల్లాం రెడ్డి, ప్రేమచంద్రారెడ్డి పేర్లు ఎఫ్ఐఆర్ లో ఎందుకు లేవు? దీనిని బట్టి సీఐడీ తీరుపై అనుమానం కలుగుతోంది. జగన్ రెడ్డి ప్రైవేటు సైన్యంలా సీఐడీ వ్యవహరిస్తోంది.

చంద్రబాబును వేధించాలనే…

జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినరోజు దగ్గర నుంచి పాలన గాలికి వదిలేసి కేవలం ప్రత్యర్థులను తుదముట్టించే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. లండన్ నుంచే పథకం రచన చేసి అమలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్‌లో భారీ కుంభకోణం జరిగినట్లు పథకం ప్రకారం ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ అరెస్ట్‌కు తెగబడ్డారు. చంద్రబాబును మానసికంగా, శారీరకంగా వేధించి అంతమొందించాలనే కుట్ర కూడా చేశారు. చిత్తూరు జిల్లా అంగళ్ళ, కుప్పం ఇంకా తదితర ప్రాంతాల్లో జరిగిన దాడులే ఇందుకు నిదర్శనం. పోలీసులు, సీఐడీ విభాగాలను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ అడ్డగోలుగా కస్టడీలోకి తీసుకుని ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారు. చంద్రబాబును మరికొద్ది రోజులు జైల్లోనే ఉంచేలా ఆయనకు బెయిల్ రాకుండా ఇతర కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేయడమే ఇందుకు నిదర్శనం. ఈఎస్ఐ కేసులో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలో అచ్చెన్నాయుడు పేరు లేనప్పటికి అక్రమంగా ఇరికించారు.

పగ, ప్రతీకారంపై ఉన్న ప్రేమ ఓటేసి గెలిపించిన ప్రజలపై లేదు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వందలమందిపై అక్రమ కేసులు పెట్టారు. సుమారు 75 మంది తెలుగుదేశం కార్యకర్తలను హతమార్చారు. ప్రజాస్వామ్యానికి పాతరేసి నిరంకుశత్వం ఎలా ఉంటుందో పాలకులు ప్రజలకు రుచి చూపిస్తున్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనితీరు ఏకపక్షంగా ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదికల్లో వెల్లడైంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో సైతం స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లను కనీసం పరామర్శకు కూడా రాకుండా అడ్డుకోవడంలో ఆంతర్యమేమిటి? కృష్ణా జిల్లా ఎస్పీ శాంతిభద్రతల సమస్యను సాకుగా చూపిస్తూ పవన్ కల్యాణ్ ప్రయాణించాలనుకున్న ప్రత్యేక విమానానికి అనుమతులు ఇవ్వనీయకుండా లేఖలు రాయడం దుర్మార్గం కాదా? దేశ చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా చూశామా?

వైసీపీ కార్యకర్తల్లా పోలీసులు..

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తున్న వారిపై విచక్షణారహితంగా కొడుతూ పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్, రెండు రోజులుగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్తలతో ఆందోళనకు గురై రాష్ట్రవ్యాప్తంగా 13 మంది గుండెపోటుతో చనిపోయారు. ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడిచేసినా, తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు చేసినా కేసులు లేవు. పైగా దాడులు చేసిన వారికి పదోన్నతులు కల్పించారు. చట్టం అధికారంలో ఉన్నవారికి చుట్టంలా మారింది. వారు చేస్తున్న ఫిర్యాదులపై పోలీసులు వేగంగా స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంచి, చెడు విచక్షణ కోల్పోయి పోలీసులు చెలరేగిపోతున్నారు.

సాక్షాత్తూ పోలీసులే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ రాష్ట్రాన్ని తగులబడుతుంటే చలికాచుకుంటూ రాక్షసానందం పొందుతున్నారు. సంజయ్, కొల్లి రఘురామిరెడ్డి లాంటి సీఐడీ ఉన్నతాధికారుల ప్రవర్తన పోలీసు వ్యవస్థపై మాయని మచ్చలా మిగులుతుంది. వీరిద్దరి అరాచకాలు హద్దులు దాటాయి. అధికారమదంతో తాను ఏం చేసినా ఎదురులేదనే భావనతో విర్రవీగుతున్నారు. గౌతమ్ సవాంగ్, సునీల్ కుమార్ ఇంతకంటే విశ్వాసంగా పనిచేసినా అవమానాలు తప్పలేదు. నిన్నటి వరకు వైసీపీ కార్యకర్తలకు పోలీసులు సహకరించడం చూశాం. ఇప్పుడు పోలీసులే ప్రత్యక్షంగా వైసీపీ కార్యకర్తల పాత్ర పోషిస్తున్నారు. వివేకా కేసులో రాష్ట్ర పోలీసులు నిందితుల వైపు ఉన్నారని సాక్షాత్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ఇందుకు అద్దం పడుతోంది.

ప్రజాస్వామ్యానికి సమాధి కట్టి....

సకల శాఖ మంత్రి సజ్జల కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ పనిచేస్తోంది. ఆయన ఆదేశాలతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని బాధితులను నేరస్థులుగా, నేరస్థులను బాధితులుగా చిత్రీకరిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లాంటి వాటిని వదిలేసి రాజకీయ కక్షసాధింపులకు తమ సంపూర్ణ మద్దతును ఇస్తున్నారు. పాలకపక్ష ప్రయోజనాలను కాపాడటమే పరమావధిగా పనిచేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర కూడా చాలా కీలకమైంది. అసలు ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయడమే అవుతుంది. పోలీసులు పాలకపక్షానికి ఊడిగం చేయడం మాని నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. బాధితులకు అండగా ఉండి శాంతిభద్రతలను కాపాడాలి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. ఇంతకంటే పెద్ద నియంతలే చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారు. వెయ్యిగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకుపోయినట్లుగా.. జగన్ రెడ్డి తీరు మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు.

మన్నవ సుబ్బారావు

గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్

99497 77727


Next Story

Most Viewed