పదవీ గండంలో ప్రధాని

by Disha edit |
పదవీ గండంలో ప్రధాని
X

పదవి చేపట్టాక లిజ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇవ్వకపోగా పరిస్థితి చేయి దాటిపోయింది. కార్పొరేట్ పన్నును 25 నుంచి 19 శాతానికి తగ్గించాలనే నిర్ణయాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడంతో లిజ్‌ నాయకత్వం పట్ల నమ్మకం సడలుతున్నది. గత ఆరేళ్లలో అధికార కన్జర్వేటివ్ పార్టీ నలుగురు ప్రధానులను మార్చింది. ఇప్పుడు లిజ్ తప్పుకుంటే భారత సంతతికి చెందిన రుషీ సునాక్ వైపు ఎంపీలు మొగ్గుచూపే అవకాశం ఉండవచ్చని సమాచారం. దాదాపు 200 సంవత్సరాలు ఇండియాను నిరంకుశంగా ఏలిన బ్రిటన్‌ను ఏలడానికి మన రిషీ సునాక్‌కు ప్రధానమంత్రి పదవి దక్కాలని కోరుకుందాం.

బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ ఉద్వాసన అంచున ఉన్నారా? ఆమెకు పదవీ గండం ఉందనే తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. బ్రిటన్‌లో పది శాతం దాటిన ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి లిజ్ ప్రవేశపెట్టిన సంస్కరణలు ఫలితాలు ఇవ్వలేదని, అందుకే ప్రధానిగా ఆమె కొనసాగడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంధన ధరలు చుక్కలకు ఎక్కడంతో యూకేలో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తే పరిస్థితి వచ్చింది. కుదేలైన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంలో లిజ్ ట్రస్ విఫలం అయ్యారని అంటున్నారు. గత సెప్టెంబర్ ఐదున లిజ్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో నెలకొన్న అసాధారణ ఆర్థిక సంక్షోభాన్ని అర్థవంతంగా ఆమె ఎదుర్కోలేకపోయారని మెజారిటీ కన్జర్వేటివ్ పార్టీ ప్రతినిధులు వ్యక్తం చేయడం గమనార్హం.

లిజ్ ట్రస్ తగు నిర్ణయాలు తీసుకోలేకపోయారని, ఆమె పదవిని త్యాగం చేయాల్సి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ప్రధానమంత్రి ఎన్నికలలో రెండవ స్థానంలో భారత సంతతికి చెందిన రిషీ సునాక్ నిలిచారు. తాజాగా 'యుగోవ్' సంస్థ నిర్వహించిన సర్వేలో 62 శాతం మంది ఓటర్లు ప్రధానిగా లిజ్ ట్రస్‌ను ఎన్నుకొని తప్పు చేశామని తెలపడం విశేషం. పార్టీని ఇరకాటంలో పెట్టిన ఆర్థిక సంక్షోభ కారణంగా యూకేలో ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశం ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి సెప్టెంబర్ చివరన మినీ-బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పటికీ పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. దిద్దుబాటు చర్యలలో భాగంగా ఆర్థిక మంత్రిని మార్చారు.

ఆమె తప్పుకుంటే

బ్రిటన్ చట్టాల ప్రకారం లిజ్‌కు ఏడాదిపాటు ఎలాంటి పదవీ గండం ఉండకపోవచ్చని అంటున్నారు. అత్యవసర పరిస్థితులలో నిబంధనలు మార్చితే ఆమె పదవిని వదులుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో పెరిగిన చమురు, నిత్యావసరాల ధరలను కట్టడి చేయడంలో లిజ్ సఫలమవుతుందని ఆమె మీద పార్టీ ప్రతినిధులు నమ్మకం ఉంచారు. ఇపుడు వారంతా తీవ్ర నిరాశతో ట్రస్‌పై అవిశ్వాస గళం వినిపిస్తున్నారు. పెరిగిన ధరలను తగ్గిస్తానని, ఇంధన ధరలు అదుపులోకి తెస్తానని, కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని లిజ్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు.

పదవి చేపట్టాక లిజ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇవ్వకపోగా పరిస్థితి చేయి దాటిపోయింది. కార్పొరేట్ పన్నును 25 నుంచి 19 శాతానికి తగ్గించాలనే నిర్ణయాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడంతో లిజ్‌ నాయకత్వం పట్ల నమ్మకం సడలుతున్నది. గత ఆరేళ్లలో అధికార కన్జర్వేటివ్ పార్టీ నలుగురు ప్రధానులను మార్చింది. ఇప్పుడు లిజ్ తప్పుకుంటే భారత సంతతికి చెందిన రుషీ సునాక్ వైపు ఎంపీలు మొగ్గుచూపే అవకాశం ఉండవచ్చని సమాచారం. దాదాపు 200 సంవత్సరాలు ఇండియాను నిరంకుశంగా ఏలిన బ్రిటన్‌ను ఏలడానికి మన రిషీ సునాక్‌కు ప్రధానమంత్రి పదవి దక్కాలని కోరుకుందాం.


డా: బుర్ర మధుసూదన్ రెడ్డి

కరీంనగర్, 99497 00037


Next Story

Most Viewed