ఇదీ సంగతి:రుణ పంపిణీ భారతం

by Disha edit |
ఇదీ సంగతి:రుణ పంపిణీ భారతం
X

పెట్టుబడిదారులకు రుణాలు ఇచ్చి ఏడేండ్లలో రూ.10,70,000 కోట్లు వే ఆఫ్ చేశారు. 2016 లో రూ. 18,000 కోట్లు, 2019లో రూ. 2,64,000 కోట్లు, 2020లో రూ. 2,02,000 కోట్లు ఇలా చేస్తూనే పోయారు. ఒక ఎస్‌బీఐనే రూ.1,79,000 కోట్ల రుణాలు ఇస్తే వసూలైంది మూడు శాతమే. అందుకే ఎస్‌బీఐని మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉంచుకుని మిగిలిన 11 ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేట్‌పరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశం అప్పులలో ఉంటే కార్పొరేట్‌లకు రూ.15 లక్షల కోట్ల నుంచి 20 లక్షల కోట్ల వరకు దోచిపెట్టారు. 2016 నుంచి 2020 దాకా పంజాబ్, యూకో, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సీస్ తదితర బ్యాంకులు రూ. 4,95,000 కోట్ల రుణాలు ఇచ్చాయి. వసూలైంది రూ. 80,000 కోట్లు మాత్రమే. మిగతాదంతా వే ఆఫ్ చేశారు.

వేసవి ముగిసి వర్షాలు సామాన్యుల జీవితాలను, దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నిత్యావసరాల ధరల మంటలు మాత్రం అన్ని కాలాలలోనూ సామాన్యుడిని వేటాడుతూనే ఉన్నాయి. వాటిని ఆర్పే బలం ఆర్‌బీఐకి కూడా లేకుండా పోయింది. పార్లమెంట్‌లో విపక్షాలు ఎంతగా లొల్లి పెట్టినా విశ్వగురు కలలు కంటున్న పాలకులు మాత్రం పట్టించుకునే పరిస్థితులలో కనిపించడం లేదు. శ్రీలంక పరిస్థితి పదే పదే యాదికి వచ్చి జనం భయంతో వణికిపోతున్నారు. 'మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు' తినే ప్రతీ వస్తువు మీద జీఎస్‌టీ వేసేసారు. అయినా, జనంలో కదలిక ఊహించినంతగా కనిపించడం లేదు. 'ఎనిమిదేండ్లుగా అన్నింటిని భరిస్తూ వస్తున్నాం కదా? ధరలను కూడా భరిద్దాం' అనే విధంగా ఉంది. పాలు, పెరుగు, తేనె, పిండి, పెన్సిల్, షార్ప్‌నర్, చెంచాలాంటి సరుకుల మీదా జీఎస్‌టీ విధించడంతో సామాన్యులు ఆగం అవుతున్నారు. పెట్రోల్, డీజిల్, ఎక్సయిజ్ పన్నులతో లక్షల కోట్లు వసూలు చేస్తున్న ప్రభుత్వానికి అవి చాలలేదన్నట్టు తినే వస్తువుల మీదా, ఆసుపత్రి బెడ్ మీదా జీఎస్‌టీ వేయడం ఆందోళనకరం. గతంలో వ్యాట్ ఉన్న వాటి మీదే జీఎస్‌టీ వేశామని సమర్థించుకుంటున్నది. దేశం అప్పులు రూ.135 లక్షల కోట్లు దాటిన నేపథ్యంలో రెవెన్యూ పెంచుకోవడం కోసం పీ‌ఎస్‌యూలను అమ్మేస్తూ వాటి ద్వారా రూ. ఆరు లక్షల కోట్ల సంపాదనకు పూనుకోవడం బీజేపీ ప్రభుత్వానికే చెల్లింది.

వెనుకకు వచ్చింది తక్కువే

పెట్టుబడిదారులకు రుణాలు ఇచ్చి ఏడేండ్లలో రూ.10,70,000 కోట్లు వే ఆఫ్ చేశారు. 2016 లో రూ. 18,000 కోట్లు, 2019లో రూ. 2,64,000 కోట్లు, 2020లో రూ. 2,02,000 కోట్లు ఇలా చేస్తూనే పోయారు. ఒక ఎస్‌బీఐనే రూ.1,79,000 కోట్ల రుణాలు ఇస్తే వసూలైంది మూడు శాతమే. అందుకే ఎస్‌బీఐని మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉంచుకుని మిగిలిన 11 ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేట్‌పరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశం అప్పులలో ఉంటే కార్పొరేట్‌లకు రూ.15 లక్షల కోట్ల నుంచి 20 లక్షల కోట్ల వరకు దోచిపెట్టారు. 2016 నుంచి 2020 దాకా పంజాబ్, యూకో, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సీస్ తదితర బ్యాంకులు రూ. 4,95,000 కోట్ల రుణాలు ఇచ్చాయి. వసూలైంది రూ. 80,000 కోట్లు మాత్రమే. మిగతాదంతా వే ఆఫ్ చేశారు.

నిరుద్యోగ‌ం రెడ్ అలర్ట్ అయింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో రూ.లక్ష కోట్లు ఖర్చు కాగా, రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఖర్చు రూ. ఆరు లక్షల కోట్లని ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొన్నది. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వేల కోట్లు నిధులు రాజకీయ పార్టీలకు అందాయి. దీనికి పన్ను లేదు. ఇందులో 75 శాతం నిధులు బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. ఎన్నికల కోసం ఉచితాలు ఒక దిక్కు, మరో దిక్కు ఎన్నికల నిధుల లూటీ. అతి చౌకగా పీఎస్‌యూలను అమ్మడం, లీజుకు ఇవ్వడం, కంపెనీల పేర్లు మార్చి గతంలో బ్యాంకు రుణాలు ఎగ్గొట్టినవారికే మళ్లీ రుణాలు ఇవ్వడం జరుగుతోంది. ప్రభుత్వానికి ఎక్కడ కూడా జవాబుదారీతనం లేదు. వంద కోట్ల కన్నా ఎక్కువ రుణం పొందిన వారందరికీ రూ.2,78,000 కోట్ల వరకు వే ఆఫ్ చేయడం ఏమిటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

సంస్థలు దివాలా తీసేలా

రెండు దశాబ్దాలుగా లాభాలలో నడుస్తున్న కోల్ ఇండియా, సింగరేణి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను దివాలా తీసేలా బొగ్గు బ్లాకులను కేటాయించకుండా సతాయిస్తున్నారు. అదానికి ఉన్న 100 మిలియన్ టన్నుల బొగ్గు బిజినెస్‌కు చేయూతను ఇస్తున్నారు. బొగ్గు బిజినెస్‌ను అతడి చేతిలోనే పెట్టాలని కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు. 20 ఏండ్లుగా కోల్ ఇండియా, సింగరేణికి పైసా బడ్జెట్ పెట్టకుండా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం వేల కోట్ల పన్నులు, డివిడెండ్లు, డీఎంఎఫ్‌టీ నిధులు, ప్రత్యేక సెస్ పొందుతూనే ఉన్నాయి. బొగ్గు గనులు కలిగిన రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు అలర్ట్ కావాలి. లేని పక్షంలో భవిష్యత్ తరాలు క్షమించవు.

ఆ మధ్య ఒక హిందీ సినిమా వచ్చింది. దాని పేరు' సారే జహాన్‌సే మెహంగాయి' అందులో ఒక పాత్ర 'స్విస్ బ్యాంకులో మన దేశానికి చెందిన రూ. 280 లక్షల కోట్లు నల్ల ధనం ఉందని, అది తెస్తే ఒక్కో ఇండియన్ ఖాతాలో నాలుగు లక్షల రూపాయల చొప్పున వేయొచ్చని' అంటుంది. ఇదే చిత్రం ప్రేరణతో మన పీఎం మాట్లాడి ఉంటారని, ఇటీవల నేను ఆ చిత్రాన్ని చూసినపుడు అనుకున్నా. నవంబర్ 2019లో పీఎం మోడీ ఒక మీటింగులో మాట్లాడుతూ పెరుగు, నెయ్యి, పాలు తదితరాల మీద ఎన్నటికీ జీ‌ఎస్‌టీ ఉండబోదని అన్నారు. ఇప్పుడు ఐదు శాతం వేసేసారు. నల్లధనం రాగానే నిజాయితీగా పన్నులు కడుతున్నవారికి, ఉద్యోగులకు కొంత ఇనామ్ ఇస్తామని 17 ఫిబ్రవరి 2014న హిమాచల్‌ప్రదేశ్ ఉద్యోగులతో మాట్లాడుతూ అన్నారు. పేదల ఖాతాలో రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షలు వేస్తామని కూడా అన్నారు. తదుపరి ఆ విషయాలన్నింటినీ ఒక జుమ్లా అంటూ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కొట్టిపారేశారు. పీఎం మాట నీటిమూట లాంటిదని చాలా సందర్భాలలో రుజువైంది.

అననుకూల పరిస్థితులతో

స్విస్ బ్యాంక్‌లో మనోళ్లవి రూ.30,500 కోట్ల రూపాయలు ఉన్నాయని ప్రభుత్వం గతంలో చెప్పింది. గత ఐదు సంవత్సరాల నుంచి దాని లెక్కలు లేవు. బ్లాక్ మనీని వెలికి తీయడానికి ఏర్పాటు చేసిన 'సిట్' ముచ్చటగానే మిగిలిపోయింది. అనధికారికంగా మాత్రం స్విస్ బ్యాంకులలో మన డబ్బులు రూ. రెండు లక్షల కోట్లకు పైగానే ఉన్నాయని అంటారు. దేశంలో పౌరులకు అన్నీ అననుకూల పరిస్థితులే ఉన్నాయి. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. ప్రకృతి కష్టాలు కల్పించిన సందర్భాలలో ఆదుకోవాలి. బ్యాంకు రుణాలు అత్యంత సులువుగా అందేలా చూడాలి. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండాలి. రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయాలి. సామాన్యులు కనీసం ప్రశాంతంగా జీవించే పరిస్థితులను కూడా కల్పించడం లేదు.

రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును హరిస్తున్నారు. ప్రజలకు దేశభక్తి లేదన్న మాటలు ఎక్కువైపోయాయి. మైనారిటీలను ప్రతీ క్షణం కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఇతర దేశాలకు, ప్రధానంగా ముస్లిం దేశాలకు వెళ్లినపుడు సర్వ మతాల ఐక్యత గురించి మాట్లాడే పీఎం మోడీ భారత్‌లో మాత్రం ఆ మాట ఎత్తరు. అంతర్జాతీయంగా వచ్చిన రియాక్షన్ కారణంగా ప్రవక్త విషయంలో తప్పుగా మాట్లాడిన ఇద్దరి మీద చర్యలు తీసుకున్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఒకే రకంగా, గౌరవంగా బతికే విధంగా చూడాలి. ఇప్పుడు 'ఇంటింటికి తిరంగా' అంటూ మొదలు పెట్టారు. జాతీయ పతాకం గురించి పాలకులకన్నా ప్రజలకే ఎక్కువ అవగాహన, ప్రేమ ఉంది. తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా శాశ్వత ప్రణాళికలతో, దేశం, దేశ ప్రజల బాగు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశన దేశాన్ని నడిపించేవారు, కదిలించేవారు కావాలి. 'ఫ్రీడం ఆఫ్ స్పీచ్'ను ప్రశ్నించే గొంతుకలను చెరసాల లో పెట్టి అణచలేరు. కోట్లాది గొంతుకలు ఇంకా బతికే ఉన్నాయి.

ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223


Next Story

Most Viewed