డీఏలు మంజూరు చెయ్యండి మహాప్రభో!

by Disha edit |
డీఏలు మంజూరు చెయ్యండి మహాప్రభో!
X

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల సెగ నుంచి వేతన జీవులైన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను ఆదుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కనీస బాధ్యత. అందుకే వారికి ఆరు మాసాలకు ఒకసారి కరువు భత్యం (డీఏ) ప్రకటిస్తారు. అయితే ఇది ఎంత శాతం అనేది మాత్రం పారిశ్రామిక వర్కర్ల వినియోగదారుల ధరల సూచి (సీపీఐఐడబ్య్లు) ప్రాతిపదికగా నిర్ధారిస్తారు. అయితే, మార్కెట్ వాస్తవ ధరలకు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వినియోగదారుల ధరల సూచికి సంబంధం ఎంతమేరకు ఉంటుందన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఆరు నుంచి ఎనిమిది శాతం వార్షిక పెరుగుదల రేటుతో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగవర్గాలను చుక్కలనంటుతున్న ధరలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల మిగతా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి దారితీస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను ఆదుకునేది కేవలం కరువు భత్యం మాత్రమే.

పాలకుల దయగా డీఏ

ఈ డీఏను కేంద్రం తమ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏడాదికి రెండుసార్లు నిర్దిష్ట సమయాల్లో డీఏ ప్రకటిస్తోంది. జనవరి ఒకటో తేదీ సీపీఐఐడబ్య్లు ప్రాతిపదికగా డీఏను నిర్ధారించి మార్చి నెలాఖరులోగా మొదటి విడత డీఏను, జూలై ఒకటో తేదీ ప్రాతిపదికగా సెప్టెంబర్ నెలాఖరులోగా రెండో విడత డీఏను కేంద్రం ప్రకటిస్తుంది. దీనిని కరోనా కాలం మినహా గత మూడు దశాబ్దాలుగా డీఏ ప్రకటించడంలో కేంద్రం గడువును అతిక్రమించిన దాఖలాలు లేవు. దీనినే పలు రాష్ట్రాలు మంజూరు చేస్తున్నాయి. అయితే, ఈ డీఏ మన రాష్ట్రంలో మాత్రం ఈ డీఏ మంజూరు చేయడం పాలకుల దయగా మారిపోయింది. ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు డీఏ ఎప్పుడివ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించలేదు. దసరా, దీపావళి ఇతర పండుగల సందర్భంగానైనా డీఏ ప్రకటిస్తారేమోనని ఆశపడే పరిస్థితులు వచ్చాయి. ఇటీవల నూతన సచివాలయం ప్రారంభోత్సవ సందర్భంగా కూడా కేసీఆర్ సంతకం పెట్టే ఫైల్స్‌లో డీఏ ఫైల్ ఉంటుందేమోనని ఉద్యోగులు ఎదిరిచూస్తే, వారికి నిరాశే మిగిలింది, ఇక ఈ విషయంలో ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్న తీరు కూడా సగటు ఉద్యోగికి తీవ్ర ఆవేదన కలిగించే రీతిలో ఉంటోంది. ఉద్యోగ సంఘాలు కలిసికట్టుగా ఈ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రాకపోవడం వారి పాలిట శాపంగా మారింది. దీనికై ఉపాధ్యాయ సంఘాలను ఎన్నోసార్లు జెఏసి ఏర్పాటు చేయాలని కోరినా ఉద్యోగ సంఘాలు కల్సి రాకపోవడం శోచనీయం. డీఏ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రాధేయపడడమే గానీ, కలసికట్టుగా గట్టిగా డిమాండ్ చేసి సాధించుకోవాలనే ఆలోచనే చేయకపోవడం ఉద్యోగులకు అన్యాయం చేయడమే కదా.

పెండింగ్‌‌లో మూడు డీఏలు!

రాష్ట్రంలో జూలై 2021 నుంచి చెల్లించాల్సిన ఒక విడత కరువు భత్యం 2.73 శాతాన్ని ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇదే చివరిసారిగా మంజూరు చేసిన కరువు భత్యం. కానీ ప్రభుత్వం జనవరి 2022 లో 2.73 శాతం, జూలై 2022లో 3.64 శాతం, జనవరి 2023లో 3.64 శాతంతో మొత్తం 10.01 శాతం డీఏను మంజూరు చేయాల్సి ఉండగా, పెండింగులో పెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో వారికి 20.02 శాతం కరువు భత్యం మాత్రమే చెల్లిస్తున్నారు. అయితే ఈ విషయమై 24 అక్టోబర్, 2020 న కేంద్రం డీఏను మంజూరు చేస్తే, దాని ప్రకారం సర్దుబాటు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించినట్టు నాటి పత్రికల్లో ప్రముఖంగా వచ్చినా, ఆ తర్వాత ఆ ఊసే లేదు. కేంద్రం కంటే ముందుగా ఇవ్వకపోయినా పర్లేదు కానీ, కేంద్రం మంజూరు చేసి నెలలు గడుస్తున్నా మూడు డీఏలు పెండింగులో పెట్టడంపట్ల ఉద్యోగవర్గాలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. పైగా, గత కొన్ని నెలలుగా దేశం మొత్తం మీద అత్యధిక ద్రవ్యోల్బణం తెలంగాణలోనే నమోదు అవుతోంది. దీంతో ధరలు రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 2023 లో జాతీయ సగటు ద్రవ్యోల్బణం 6.44 శాతం కాగా, దక్షిణాది రాష్ట్రాలైన కేరళలో 6.27 శాతం, తమిళనాడులో 8.56 శాతం, కర్ణాటకలో 6.03 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 8.01 శాతం ద్రవ్యోల్బణం నమోదు అయింది. ఛత్తీస్ గఢ్ లో కేవలం 2.38 శాతం, దేశ రాజధాని ఢిల్లీలో 3.64 శాతం ఉండగా, తెలంగాణలో మాత్రం ఏకంగా 8.56 శాతంగా ఉంది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంతో పోల్చితే మూడు రెట్లు, ఢిల్లీ రాష్ట్రంతో కంపేర్ చేస్తే రెండు రెట్లకు పైగా తెలంగాణలో ద్రవ్యోల్బణం నమోదు అవుతోంది. దీంతో ఇక్కడ ధరల పెరుగుదల రేటు కూడా భారీగా ఉంటోందని అర్థం చేసుకోవచ్చు.

సీఎం స్పందించాలి!

నిజానికి కరువు భత్యం ప్రకటించడం ప్రభుత్వాల దయగా కాకుండా, ఉద్యోగుల హక్కుగా ఉండాలి. పెరిగే ధరల కారణంగా నెల జీతాలపై ఆధారపడి ఉద్యోగవర్గాలకు కరువు భత్యాన్ని సకాలంలో ప్రకటించడమే ఏకైక మార్గం. దీనికోసం కేంద్ర ప్రభుత్వం పాటిస్తున్న విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. కేంద్రం డీఏ ప్రకటించిన నెలలోపు కరువు భత్యం మంజూరు చేసే విధంగా ఒక విధాన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కదా! కరువు భత్యం మంజూరుకు ప్రభుత్వానికి ఉమ్మడిగా ప్రాతినిధ్యం చేసి, ఒత్తిడి తేవాల్సిన ఉద్యోగ సంఘాలు ఆ పని మాత్రం చేయడం లేదు. కొత్త సంవత్సరం, రాష్ట్రావతరణ దినోత్సవం, దసరా, దీపావళి కానుకగా సీఎం డీఏలు మంజూరు చేస్తారంటూ ఎప్పటికప్పుడు ఎదురుచూడటమే తప్ప, గట్టి ప్రయత్నమేదీ చేయడం లేదు. కనీసం ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలు స్పందించాలి. ఉద్యోగుల పక్షాన నిలబడి కలసికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించి పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను వెంటనే ప్రకటించాలి.

-మానేటి ప్రతాపరెడ్డి,

TRTF గౌరవాధ్యక్షుడు,

9848481028


Next Story

Most Viewed