ఎన్నికలు నిర్వహించడం మాత్రమే ఈసీ బాధ్యతా! అవి కావా?

by Disha edit |
ఎన్నికలు నిర్వహించడం మాత్రమే ఈసీ బాధ్యతా! అవి కావా?
X

ఎన్నికల సంఘం నిర్వీర్యం కావడానికి కారణం ప్రభుత్వాలే. ప్రజలు తమకు నచ్చిన ప్రతినిధిని ఎన్నుకునే వాతావరణం కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. చైతన్యవంతమైన యువత, బాధ్యత కలిగిన ప్రజానీకం, విద్యావంతులు, మేధావులు, ప్రజాసంఘాలు ఒత్తిడి చేయకపోవడంతో భారత ఎన్నికల ప్రక్రియ ప్రపంచ స్థాయిలో నిందల పాలవుతున్నది. దీనికి సాక్ష్యం హుజురాబాద్ ఉప ఎన్నిక. అక్కడ డబ్బు ప్రవాహంపై ఎన్నో సాక్ష్యాలు ఉన్నా ఎన్నికల సంఘం కించిత్తు కూడా స్పందించలేదు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాజకీయ పార్టీలు పోటీ పడి డబ్బు పంచుతూ ఉంటే కళ్లప్పగించి చూసింది. ఇవన్నీ ఆగాలంటే ఎన్నికల సంఘం తన విచక్షణాధికారాలు వాడుకోవాలి. తప్పు చేసినట్టు తేలితే కటకటాలలోకి నెట్టాలి.

న్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడమే ప్రజాస్వామ్యానికి మూలం. ఎన్నికల సంఘం ఏర్పడిన తొలి రోజులలో ఇది కనిపించినా, ఇప్పుడా పరిస్థితి లేదు. రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా అవినీతికీ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా ఎన్నికల సంఘం స్పందించడం లేదు. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అది నామమాత్ర పాత్ర పోషిస్తున్నదని అర్థమవుతున్నది. సాధారణ ఎన్నికల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఇదే పరిస్థితి ఉంది.

షెడ్యూల్ ప్రకటించి ఎన్నికలను నిర్వహించడమే తన బాధ్యత అనుకుని ఈసీ చేతులు దులుపుకొంటున్నది. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొని అవినీతి, ఆశ్రిత పక్షపాతం, మద్యం, డబ్బు పంపిణీ, అధికార దుర్వినియోగానికి ఎలాంటి తావు లేకుండా కనీసం ఒక్క ఎన్నికను కూడా నిబద్ధతతో పూర్తి చేయలేకపోతున్నది. ఇందుకు కారణాలను అన్వేషించకపోతే భవిష్యత్తులో గుండాలు, రౌడీలు మాత్రమే రాజ్యమేలే దుస్థితి వచ్చే ప్రమాదం ఉన్నది. ఇది ఒక్కరికి సంబంధించిన అంశం కాదు, ప్రజలు బుద్ధిజీవులు, విభిన్న వర్గాల వారు, పాలకులు, రాజకీయ పార్టీలు కూడా ఆలోచించవలసిన విషయం.

Also read: లీడర్ డర్టీ లాంగ్వేజ్ వలన సమాజంలో జరిగే అనర్థాలేంటి?

ఆ ప్రభావం ప్రజల మీదే

రాజకీయ పార్టీలను బెదిరించి టికెట్ తీసుకుని పోటీ చేసి, అక్రమ పద్ధతులలో గెలవడం వంటి పరిస్థితి వచ్చిననాడు రాజకీయ పార్టీలకు కూడా ఉనికి లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఎన్నికైన ప్రజాప్రతినిధులలో 83 శాతం నేరస్థులే. 'తాడే పాము అయినట్లు-ఏకు మేకు అయినట్లు' రాజకీయ పార్టీలు నేర సామ్రాజ్యాలను విస్తరించకముందే కళ్లెం వేసి కట్టడి చేయాలి. ఇప్పటికే రాజకీయ పార్టీల అవినీతి ఎక్కువైంది. వారిని ఆపేందుకు ఎన్నికల సంఘానికి శక్తి సరిపోవడం లేదేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు.

కుటుంబ పెద్ద తప్పు చేస్తే ఆ ప్రభావం కుటుంబం మొత్తం మీద పడినట్లు ఎన్నికల సంఘం తప్పు చేస్తే ఆ ప్రభావం ప్రజల మీద పడుతుంది. లోపాలు జరగకుండా ఎన్నికలను నిర్వహించడం ఎంత ముఖ్యమో, అవినీతికి తావు లేకుండా చూడటం అంతే ముఖ్యం. డబ్బు ప్రభావం ఎన్నికలలో ఎంతున్నా ఎన్నికల సంఘం కనీసం స్పందించడం లేదు. ఎంతో విస్తృతాధికారాలు ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలను శిక్షించడంలో అది ఎందుకు వెనకడుగు వేస్తున్నది? ఇది బాధ్యతారాహిత్యం కాదా? ఎన్నికల సంఘం పోకడల వలన అంతిమంగా నష్టపోయేది ప్రజలే. కంచే చేను మేస్తే ఆ పంటను రక్షించే వారు ఎవరు? ఇంటిని కాపాడే పెద్దగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం తన పార్టీ గెలుపు కోసం కుట్రలు పన్ని ప్రయోజనాలకు ప్రలోభాలకు పాల్పడి అవినీతి కుట్రలకు పాల్పడితే ఈ దేశాన్ని రక్షించే వారు ఎవరు? నైతిక బాధ్యత వహించేది ఎవరు?

దానిని బలోపేతం చేయాలి

ఎన్నికల సంఘం నిర్వీర్యం కావడానికి కారణం ప్రభుత్వాలే. ప్రజలు తమకు నచ్చిన ప్రతినిధిని ఎన్నుకునే వాతావరణం కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. చైతన్యవంతమైన యువత, బాధ్యత కలిగిన ప్రజానీకం, విద్యావంతులు, మేధావులు, ప్రజాసంఘాలు ఒత్తిడి చేయకపోవడంతో భారత ఎన్నికల ప్రక్రియ ప్రపంచ స్థాయిలో నిందల పాలవుతున్నది. దీనికి సాక్ష్యం హుజురాబాద్ ఉప ఎన్నిక. అక్కడ డబ్బు ప్రవాహంపై ఎన్నో సాక్ష్యాలు ఉన్నా ఎన్నికల సంఘం కించిత్తు కూడా స్పందించలేదు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాజకీయ పార్టీలు పోటీ పడి డబ్బు పంచుతూ ఉంటే కళ్లప్పగించి చూసింది. ఇవన్నీ ఆగాలంటే ఎన్నికల సంఘం తన విచక్షణాధికారాలు వాడుకోవాలి. తప్పు చేసినట్టు తేలితే కటకటాలలోకి నెట్టాలి.

కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి తోడు నిలవాలి. ఎన్నికల సంఘాన్ని మరింత బలోపేతం చేసి వారికి సహకరించాలి. నిలువునా అవినీతి, అధికార దుర్వినియోగం తో నిండిపోయిన రాజకీయ వ్యవస్థను శుద్ధి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాలు, ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, హైకోర్టులు, సిద్ధపడాలి. దీనికోసం కఠిన నియామవళి రూపొందించాలి. పదవులు అనుభవిస్తున్నవారు ఏ హోదాలో ఉన్న ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధించాలి. ఒకవేళ చేసినట్టు తేలితే వెంటనే ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి. వీటన్నింటిని ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి దేశమంతా అమలు చేయాలి. దీనికి కావలసింది నిబద్ధత. సామాజిక బాధ్యత, దృఢ సంకల్పం మాత్రమే .


వడ్డేపల్లి మల్లేశము

90142 06412


Next Story

Most Viewed