విధులు మరిచిన విపక్షాలు

by Disha edit |
విధులు మరిచిన విపక్షాలు
X

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తెలంగాణలో కవ్వింపు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో పాతబస్తీలో సర్జికల్ స్ట్రయిక్ చేస్తామన్నారు. తాను ప్రాతినిధ్యం వహించే కరీంనగర్ వేదికగా 'మసీదులను తవ్వుదాం' అని కామెంట్ చేశారు. నుపూర్ వ్యాఖ్యలు అంతర్జాతీయ దుమారం లేపాయి కాబట్టి చర్యలు తీసుకున్నారు. బండి సంజయ్, రాజాసింగ్ వ్యాఖ్యల పట్ల బీజేపీ నాయకత్వం ఎందుకు స్పందించడం లేదు? అతి పెద్ద రాజకీయ పార్టీగా చెప్పుకునే బీజేపీలో ఇవాళ ఒక్క ముస్లిం లోకసభ సభ్యుడు గానీ రాజ్యసభ సభ్యుడు గానీ లేడు. 4,120 అసెంబ్లీ స్థానాలలో కూడా ఒక్క ముస్లిం అభ్యర్థి లేరు. అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న క్రమంలో జాతీయ మీడియా బీజేపీ వైఖరిని తప్పు పడుతున్నది. ఈ తరుణంలో విపక్షాల మూగనోము దేశానికి మంచిది కాదు.

టీవల కాలంలో దేశంలో ప్రభుత్వానికీ, బీజేపీకీ వ్యతిరేకంగా మాట్లాడంలో, ముఖ్యంగా ప్రజా సమస్యలను ఎండగట్టడంలో విపక్షాలు ఘోర వైఫల్యాన్ని చవిచూస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ తన విపక్ష పాత్రను బొత్తిగా విస్మరించింది. రైతు చట్టాల నుంచి మొదలు నుపూర్ శర్మ వ్యాఖ్యల వరకు దేశం ఒక్కటైనా, ప్రపంచం తన గొంతుకను వినిపించినా కాంగ్రెస్ మాత్రం కనీసం కామెంట్ చేయకపోవడం ఆ పార్టీ పతనావస్థ తీరుకు అద్దం పడుతున్నది. అందుకే బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వం రావాలని దక్షిణ భారతదేశం ప్రాంతీయ పార్టీల కూటమి బలంగా తలపోస్తున్నది.

తాజాగా కమలదళం 'ముహమ్మద్‌ ప్రవక్త' వివాదంలో చిక్కుకుపోయినా, అంతర్జాతీయ సమాజం దుమ్మెత్తిపోస్తున్నా, ఉపరాష్ట్రపతి వెంకయ్యలాంటి వాళ్లకు అవమానం జరిగినా, బీజేపీ రోత కూతలతో దేశం తలదించుకునే పరిస్థితి తలెత్తినా, రాజకీయంగా బీజేపీని ఇరుకున పెట్టగల గోల్డెన్‌ ఛాన్స్‌ను విపక్షాలు మిస్‌ చేసుకోవడం దురదృష్టకరం. ఒక్క టీఆర్‌ఎస్‌ మాత్రమే ఈ అంశంలో మోదీ సర్కారును గట్టిగా నిలదీయడం ఆహ్వానించదగిన పరిణామం. ఇంగ్లిష్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ 'ది వైర్‌' ప్రచురించిన కథనం టీఆర్ఎస్ కేడర్‌కు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. నపూర్ శర్మ వ్యాఖ్యలపై రాహూల్‌గాంధీ, ఏఐసీసీ ఇతర నేతలు, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు కిమ్మనలేదు. 'బీజేపీ నేతలు చేసిన తప్పుకు అంతర్జాతీయ సమాజం ముందు భారత్‌ ఎందుకు తలదించుకోవాలి?' అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇటీవల మోదీ సర్కారును ప్రశ్నించారు. ఇలాంటి సునిశిత వ్యాఖ్యలు, ప్రశ్నలతో బీజేపీని ఇరుకున పెట్టడంలో మిగతా పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని చెప్పక తప్పదు.

అప్పుడు నోరు మెదపలేదు

హిందూ ఎజెండా ఏకీకృతం కోసం, ముస్లిం మైనార్టీల ఏరివేత కోసం ఈ ఎనిమిదేండ్లలో అనేక మంది బీజేపీ నేతలు విద్వేషకర, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఏ ఒక్కరూ నోరు మెదపలేదు. ఇప్పుడు బీజేపీ మతతత్వ రాజకీయాలపై జాతీయ సమాజంలో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఏడాది కాలంగా బీజేపీ నేతల రోత కూతలు చూస్తే దేశం ఎటుపోతున్నదనే ప్రశ్న తలెత్తకమానదు. రెండుసార్లు యూపీలో అధికారంలోకి వచ్చి సీఎంగా ఎన్నికైన యోగి ఆదిత్యానాథ్ ప్రచార ఎజెండా ఆసాంతం ముస్లిం వ్యతిరేకంగానే సాగింది. ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, విభజన పూరిత ప్రసంగాలు చేయడం ఆయన నైజం. యోగీ ఆదిత్యానాథ్ చేసిన 34 ప్రసంగాలను లోతుగా పరిశీలిస్తే వాటిలో విద్వేషపూరిత అంశాలే ఎక్కువగా ఉన్నాయి.

'అబ్బాజాన్ అనే వారంతా నేరస్థులు, మాఫియాలు, అల్లరిమూకలుగా చెలామణి అవుతారని, వారు ఉగ్రవాదులతో సమానం' అన్న భావన వచ్చేలా మాట్లాడారు. ముస్లింలు అభివృద్ధి నిరోధకులని, తాలిబన్లను నియంత్రిస్తామని వ్యాఖ్యానించారు. బుల్డోజర్‌తో దాడులు చేస్తామని కామెంట్ చేశారు. మరి యోగీపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? అంతెందుకు దేశంలో మైనారిటీలపై ప్రత్యక్ష దాడులు చేసిన సందర్భాలు బీజేపీ హయాంలోనే ఉన్నాయి. గత మే నెలలో మధ్యప్రదేశ్‌లో 65 ఏళ్ల భన్వర్ లాల్ జైన్‌ను ముస్లింగా పొరబడి హత్య చేశాడు బీజేపీ కార్యకర్త దినేష్ కుష్వాహా. 'నీ పేరేమిటి? నీవు ముస్లింవా?' అంటూ ప్రశ్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కుష్వాహా భార్య బీజేపీ కార్పొరేటర్. అయినా బీజేపీ దినేశ్ కుష్వాహా పై చర్యలు తీసుకోలేదు. బీహార్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ బచౌల్ 'దసరా నాడు హిందువులు రావణుడి దిష్టిబొమ్మలను తగులబెట్టినట్లే ముస్లింలను కాల్చిచంపాలని' వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు కూడా 'ముస్లింలకు ఓటుహక్కును తొలగించి, రెండవ తరగతి పౌరులుగా పరిగణించాలని' వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ నేతల తీరూ అంతే

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యూనిఫాం సివిల్ కోడ్ కు అనుకూలంగా జరిగిన ర్యాలీలో ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసిన బీజేపీ నేత ఆశ్విని ఉపాధ్యాయ్‌ను అరెస్ట్ చేశారు. '100 మందిమి 20 లక్షల మంది ముస్లింలను చంపడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో విజయం సాధించి జైలుకు వెళ్లడానికీ సిద్ధంగా ఉన్నాం' అని' బీజేపీ లీడర్ పూజా శకున్ పాండే వ్యాఖ్యానించారు. ధర్మసంసద్‌లో పాల్గొన్న బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ఉదితా త్యాగి కూడా ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు ముస్లింలపై తీవ్ర పదజాలం వాడిన సందర్భాలు అనేకం.

'హిందువులు మేలుకుంటే మీ గడ్డాలు లాగి జడలు వేస్తారని' యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మయాంకేశ్వర్ సింగ్ అన్నారు. 'పాకిస్తాన్ వెళ్లిపోండి, లేకపోతే శారీరకంగా నష్టం చేస్తామని' హెచ్చరించిన ఆ ఎమ్మెల్యేపై చర్యలు లేవు. కర్ణాటకలోని కొడుగు జిల్లాలో బజరంగ్‌దళ్ నిర్వహించిన శిక్షణ శిబిరంలో బీజేపీ నేతలు తుపాకులు, త్రిశూలాలు, ఇతర ఆయుధాలు పట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఫిర్యాదుతో కేసు కూడా నమోదు చేశారు. హిజాబ్ గొడవలు కోర్టుల వరకూ వెళ్లిన ఉదంతాలూ చూశాం. యూపీకి చెందిన మరో ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ తనకు ఓటు వేయని వారంతా ముస్లింలు అని వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వీరేం తక్కువ కాదు

తెలంగాణలోనూ బీజేపీ నేతలు తక్కువేం లేరు. 'యూపీలో యోగి ఆదిత్యానాథ్‌కు ఓటు వేయకుంటే, బుల్డోజర్లతో దాడులు తప్పవని' ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన హెచ్చరికలు తీవ్ర దుమారం రేపినా బీజేపీ హైకమాండ్ నోరు మెదపలేదు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తెలంగాణలో కవ్వింపు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో పాతబస్తీలో సర్జికల్ స్ట్రయిక్ చేస్తామన్నారు. తాను ప్రాతినిధ్యం వహించే కరీంనగర్ వేదికగా 'మసీదులను తవ్వుదాం' అని కామెంట్ చేశారు.

నుపూర్ వ్యాఖ్యలు అంతర్జాతీయ దుమారం లేపాయి కాబట్టి చర్యలు తీసుకున్నారు. బండి సంజయ్, రాజాసింగ్ వ్యాఖ్యల పట్ల బీజేపీ నాయకత్వం ఎందుకు స్పందించడం లేదు? అతి పెద్ద రాజకీయ పార్టీగా చెప్పుకునే బీజేపీలో ఇవాళ ఒక్క ముస్లిం లోకసభ సభ్యుడు గానీ రాజ్యసభ సభ్యుడు గానీ లేడు. 4,120 అసెంబ్లీ స్థానాలలో కూడా ఒక్క ముస్లిం అభ్యర్థి లేరు. అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న క్రమంలో జాతీయ మీడియా బీజేపీ వైఖరిని తప్పు పడుతున్నది. ఈ తరుణంలో విపక్షాల మూగనోము దేశానికి మంచిది కాదు.

వెంకట్ గుంటిపల్లి

9494 941001


Next Story

Most Viewed