కొవిషీల్డ్ రక్తాన్ని గడ్డ కట్టిస్తోందా?

by Disha edit |
కొవిషీల్డ్ రక్తాన్ని గడ్డ కట్టిస్తోందా?
X

కోవిడ్ తర్వాత, వ్యక్తులు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయారని మనమందరం వినే ఉంటాం. ఈ తీవ్రమైన సమస్యను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. కానీ తాను రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్ రక్తం గడ్డకట్టడానికి కారణమవుతోందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తాజాగా బ్రిటిష్ న్యాయస్థానం ముందు అంగీకరించింది. ఈ వార్త వెలుగులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ టీకా తీసుకున్న వారిలో భయం మొదలైంది.

కొవిషీల్డ్ వ్యాక్సిన్ మరణాలకు కారణమైందన్న ఆరోపణలపై క్లాస్ యాక్షన్ దావాను ఆస్ట్రాజెనెకా ఎదుర్కొంటోంది. ఈ టీకాను తీసుకున్న రోగులలో రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. సంచలనం కలిగించిన ఈ ప్రకటన కోవిడ్ వ్యాక్సిన్ నాణ్యతపై గత నాలుగేళ్లుగా శాస్త్ర ప్రపంచం సంధిస్తున్న ప్రశ్నలను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. కానీ వాక్సిన్ కంపెనీ మాత్రం కోవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు అరుదుగా మాత్రమే సంభవిస్తాయని పేర్కొంది.

యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, బ్రిటిష్-స్వీడిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనెకా సహకారంతో కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేశారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు చాలా సంవత్సరాలుగా అడెనోవైరస్ వెక్టర్‌లను ఉపయోగించి వ్యాక్సిన్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. కోవిడ్ -19 మహమ్మారి విజృంభించినప్పుడు, వారు కరోనా వైరస్‌కి వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ను రూపొందించారు. ఆ కోవిడ్-19 టీకానే తీవ్రమైన మరణాలకు కారణమైందని ప్రస్తుతం తేలింది.

శరవేగంగా వ్యాక్సిన్ పంపిణీ

కోవిడ్ మహమ్మారి నియంత్రణ కోసం 2021లో తొలిసారిగా రూపొందించిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌, భారతదేశంలో కొవిషీల్డ్ అనే పేరుతో బహుళ గుర్తింపు పొందింది. కానీ ఈ వ్యాక్సిన్‌పై చాలా సంవత్సరాలుగా పరిశీలన జరుగుతోంది. వాస్తవానికి, అనేక దేశాలు 2021లోనే దీనిని నిషేధించాయి. కారణం ఈ వ్యాక్సిన్ కలిగించే దుష్ప్రభావాలు ప్రాణాంతకంగా మారగలవని ప్రచారం జరగడమే.

2020ల మొదట్లో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి విజృంభించినప్పుడు రోజువారీగా ప్రపంచంలో వేలాది మరణాలు సంభవిస్తూ భయోత్పాతం కలిగిస్తున్న కొన్ని నెలల వ్యవధిలోనే కోవిడ్-19 వ్యతిరేక వ్యాక్సిన్ కనుగొన్నారు. ప్రపంచమంతటా దీన్ని ప్రజలకు అందించారు. కానీ ఇంత హడావుడిగా, నమ్మశక్యం కానంత వేగంగా రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్‌ పంపిణీపై పలువురు శాస్త్రజ్ఞులు అప్పట్లోనే సందేహాలు వెలిబుచ్చారు. బిలియన్ల కొద్దీ ప్రజలు తీసుకున్న ఈ వ్యాక్సిన్ కీలకమైన భద్రతా మార్గదర్శకాలను విస్మరించిందన్న విమర్శలు వచ్చాయి.

అరుదైన దుష్ప్రభావం

కొవిషీల్డ్ చాలా అరుదైన సందర్భాల్లో, టీటీఎస్ ఎఫెక్ట్‌కి కారణమవుతుందని ఆస్ట్రాజెనెకా డ్రగ్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా పేర్కొంది. టీటీఎస్ (థ్రోంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్) అనేది రక్తం గడ్డకట్టడానికి, మానవులలో తక్కువ రక్త ప్లేట్‌లెట్ కౌంట్‌కు కారణమవుతుంది. 2022లో లాన్సెట్ గ్లోబల్ హెల్త్‌ జరిపిన ఒక అధ్యయనంలో ఆస్ట్రాజెనెకా మొదటి డోస్‌ను స్వీకరించే ప్రతి పది లక్షలమందికి 8.1 టీటీఎస్ కేసులు, రెండవ డోస్‌ను స్వీకరించే పదిలక్షల మందిలో 2.3 టీటీఎస్ కేసులు నమోదయ్యాయి. వ్యాక్సిన్ వల్ల తీవ్రమైన హానితోపాటు మరణాలు సంభవించాయన్న ఆరోపణలపై దావాను ఎదుర్కొంటున్న కంపెనీ, థ్రోంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (టీటీఎస్) అనే సైడ్ ఎఫెక్ట్‌ను కంపెనీ కోర్టులో అంగీకరించింది. ఇది కోర్టులో సంస్థ మొదటి ఒప్పుకోలు కావచ్చు.

భారత్‌‌కు ప్రమాదం లేదు

ఐరోపాలో టీకా డ్రైవ్‌లు ప్రారంభమైన కొన్ని నెలల వ్యవధిలోనే మొదటి కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో కొన్ని దేశాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను కొంతకాలం పాటు నిలిపివేసాయి.

ఐరోపా దేశాలలో మహమ్మారి ప్రారంభంలో టీటీఎస్ ఎఫెక్ట్ నివేదించబడిందని నిపుణులు అంటున్నారు, అయితే ఇది భారతదేశంలో చాలా అరుదు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై చర్చల్లో భాగమైన ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి మాట్లాడుతూ, “టీటీఎస్ చాలా అరుదైన దుష్ప్రభావం, యూరోపియన్లతో పోలిస్తే భారతీయులు, దక్షిణ ఆసియన్లలో ఇప్పటికీ చాలా అరుదు. కానీ టీకా ప్రాణాలను కాపాడిందని చూపించడానికి తగినంత ఆధారాలు ఉన్నాయి. వ్యాక్సిన్ ద్వారా కలిగిన ప్రయోజనాలు దాని నష్టాలను అధిగమించాయన్నారు. అంతేకాకుండా, ప్రమాదం అరుదైనది మాత్రమే కాదు, మొదటి టీకా తర్వాత మొదటి కొన్ని వారాలలో మాత్రమే ఎక్కువగా ఉంటుంది. చాలా మంది భారతీయులు ఇప్పటికే మూడు టీకాలు తీసుకొని చాలా కాలం అయింది. కావున ప్రమాదమేమి లేదన్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్‌ల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ భద్రతా సలహా కమిటీలో ఉన్న బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌లోని గ్లోబల్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గగన్‌దీప్ కాంగ్, “టీకా వేసిన కొద్దిసేపటికే టీటీఎస్ ప్రమాదం ఉందని ప్రజలకు భరోసా ఇవ్వడం చాలా ముఖ్యం. మనమందరం ఇప్పుడు వ్యాక్సినేషన్‌ను చాలా కాలం దాటిపోయామని అన్నారు.

కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు ఏమిటి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ దుష్ప్రభావాలను పేర్కొంది, సాధారణంగా స్వల్పకాలికమైన, స్వీయ-పరిమితి కలిగిన తేలికపాటి మితమైన లక్షణాలు ఈ వ్యాక్సిన్లో ఉన్నాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నివేదించిన సాధారణ దుష్ప్రభావాలు ఇలా ఉన్నాయి.. ఇంజెక్షన్ వేసిన చోట అసౌకర్యంగా ఉంటుంది. సాధారణంగా అస్వస్థత, అలసట, జ్వరం, తలనొప్పి, అనారోగ్యం, కీళ్ల లేదా కండరాల నొప్పి, వాపు, ఇంజెక్షన్ సైట్‌లో ఎరుపు, మైకం, నిద్రపోవడం, చెమట, కడుపు నొప్పి, మూర్ఛ. ఈ దుష్ప్రభావాలు సాధారణంగా తాత్కాలికమైనవి, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా పరిష్కరించబడతాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. టీకాలలో ఉపయోగించే అడెనోవైరస్ వెక్టర్ ద్వారా ప్రేరేపించబడిన రోగనిరోధక ప్రతిస్పందన ఫలితంగా టీటీఎస్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఇది ప్లేట్‌లెట్‌లను సక్రియం చేస్తుంది, రక్తం గడ్డలను ఏర్పరుస్తుంది.

భీతిల్లాల్సిన అవసరం లేదు

“ప్రజలు ఇప్పుడు స్పందించడం ఆశ్చర్యంగా ఉంది. టీకా డ్రైవ్‌లు జరుగుతున్నప్పుడు కూడా అరుదైన దుష్ప్రభావం కలిగే అవకాశం ఉందని నమోదైంది. పైగా ఇది శాస్త్రీయంగా ఆమోదం పొందింది కూడా. మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో టీకాలు వేయడం వల్ల కలిగే ప్రయోజనం దాని ప్రమాదాన్ని మించిపోయిందని అశోకా యూనివర్సిటీకి చెందిన త్రివేది స్కూల్ ఆఫ్ బయోసైన్సెస్‌లో బయోసైన్సెస్ అండ్ హెల్త్ రీసెర్చ్ డీన్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ చెప్పారు. ప్రస్తుతం చాలా మందిలో ఇమ్యునైజేషన్ అవసరం లేదు. ప్రస్తుతం భారతీయ జనాభాలో యాంటీబాడీ స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కావున ఎవరూ భీతిల్లాల్సిన అవసరం లేదు.

-అభిజిత్ కుమార్

కాలమిస్ట్

Next Story