అవినీతిపరులు విచారణ ఎదుర్కోవాల్సిందే!

by Disha edit |
అవినీతిపరులు విచారణ ఎదుర్కోవాల్సిందే!
X

దేశంలో ప్రస్తుతం అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడుతున్న వారిలో రాజకీయనాయకులే అధిక శాతం. అధికారం చేపట్టిన ఏడాదిలోనే అవినీతిలో కూరుకుపోతున్నారు. అధికారం చేపట్టిన ఏడాదిలోనే రాజమందిరాలు నిర్మించుకోవడం, అక్రమాలకు పాల్పడటం చూస్తున్నాం. ఇలా అక్రమ సంపాదనలో మునిగి తేలుతూ ఎన్నికల్లో డబ్బులు పెట్టి ఓట్లను కొల్లగొడుతూ అధికార దర్పం వెళ్లదీస్తున్నారు. ఇది ఒక రాజకీయ పార్టీ నాయకులే అని చెప్పడానికి వీలు లేదు. అన్ని పార్టీల నాయకులు ఒక తాను ముక్కలే.

విమర్శలతో తప్పును కప్పిపుచ్చుతూ

రాజకీయ నాయకుల అక్రమాలపై దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తే ఎదురుదాడి అవుతుందా? ఆ సంస్థలకు ఎవరు ఎక్కువ కాదు నిజంగా మోడీ అక్రమాల గురించి ఆధారాలు ఉంటే దర్యాప్తు సంస్థలకు ఇవ్వండి. ఆయనను నిలదీయాల్సిందే. అలాగే ఆ పార్టీ నేతల అక్రమాలు ఉన్నా నిలదీయాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియా చురుకుగా ఉంది. చీమ చిటుక్కుమన్నా.. కోడై కూస్తోంది. ఈ క్రమంలో ఎవరి అక్రమాలను వేలెత్తి చూపినా దాని విచారణను ఎదుర్కోవాల్సిందే. తప్పు చేయకపోతే కడిగిన ముత్యంలా బయట పడాల్సిందే. అంతేగాని ఈడీ, సీబీఐ, ఐటీలను తిడుతూ.. కేంద్రప్రభుత్వంపై దండెత్తి తమ అక్రమాలను కప్పి పుచ్చుకోకూడదు. మొన్న కర్ణాటకలో ఓ బీజేపీ ఎమ్మెల్యే తనయుడు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. ఆయనపై కేసు నమోదైంది. అలాగే ఏపీ సీఎం జగన్‌పై కేసులు ఉండి జైలులో కూడా ఉండివచ్చాడు. ఆయనపై ఇప్పటికీ కేసులేమి తొలగిపోలేదు. ఎప్పటికైనా అవి విచారణకు రావాల్సిందే. ఆయన విచారణ ఎదుర్కోవాల్సిందే. ఆప్ నేత సిసోడియా, ఏపీ ఎంపీ మాగుంట కుమారుడిపై, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వంటి వారందరిపై ఉన్నది స్కాం ఆరోపణలు మాత్రమే. అందుకే విచారిస్తున్నారు. అయితే ఇప్పుడు దర్యాప్తు సంస్థలు వీరిని విచారణకు పిలవడం వలన ఈడీనీ, సీబీఐని విమర్శించడం తగదు.

గుమ్మడికాయల దొంగ వలె..

అయితే ఈడీ విచారణకు హాజరు కమ్మని కవితకు నోటీసు వచ్చిన సందర్భంలో కవిత బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలతో సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని, తెలంగాణ ఎప్పటికి తలవంచదని కవిత చేసిన వ్యాఖ్యలు ఆమె హుందాతనాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయి. తనపై వచ్చిన ఆరోపణలను తెలంగాణతో ముడిపెట్టి.. తెలంగాణ తలవంచబోదని చెప్పడంలో అహంకారం తప్ప ఏమీ లేదు. యావత్తు తెలంగాణకు కవిత ప్రతినిధి ఏమీ కాదు. అందువల్ల తమాయించుకుని.. మాట్లాడాలి. తెలంగాణ తలవంచదు కనకనే పోరాటం చేసింది. నిజానికి ఆమె తెలుసుకోవాల్సింది బీజేపీ విధానాలని నిలదీయడం వేరు, అవినీతి కేసులో విచారణ వేరని తెలుసుకోవాలి. ఉమెన్స్ డే రోజున నోటీసులు రావడం ఏంటని బీఆర్ఎస్ నేతలు దర్యాప్తు సంస్థల తీరును తప్పుబడుతున్నారు. తెలంగాణ ఆడబిడ్డకు నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, టార్గెట్ చేశారని అంటున్నారు. నిజానికి ఇక్కడి నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే విచారణ.. విమర్శలకు పొంతన లేదు. ఈ ఆరోపణల మీద ఆమె కడిగిన ముత్యంలా వస్తే ప్రజలే బ్రహ్మరథం పడతారు. మరి మీరెందుకు నోటీసులు రాగానే గుమ్మడికాయల దొంగవలె బుజాలు తడుముకుంటున్నారు?

ఈ స్కామ్ తెలుగురాష్ట్రాలలోనే కాదు దేశాన్ని కదిలిస్తోంది. ఇదే కేసులో ఆప్ నేతలను, వైఎస్ఆర్‌సీపీ నేతలను అరెస్ట్ చేశారు. కానీ ఏపీలోని అధికార పార్టీ దీనిపై స్పందించలేదు. వారికి ఉన్న హుందాతనం మన నేతలకు లేదా?

సబావాట్ కళ్యాణ్

ఏబీవీపీ రాష్ట్ర నాయకులు

9014322572

Next Story

Most Viewed