సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త...!

by Disha edit |
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త...!
X

మన దైనందిన జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకూ ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు ఇప్పుడు మామూలయ్యాయి. టికెట్లు, వస్తువుల కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులకు ఆన్‌లైన్‌ మార్గమే శరణ్యమనేంతగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో సైబర్‌ నేరగాళ్లు మాటువేసి అమాయకులను లూటీ చేయడం పెరుగుతోంది.

జాతీయ నేర గణాంక సంస్థ ప్రకారం 2011లో ఐటీ యాక్ట్ కింద 1791 సైబర్ నేర కేసులు నమోదైతే, 2012లో 2876 కేసులు నమోదయ్యాయి. ఒక్క ఏడాదిలోనే 60% పెరుగుదల నమోదైంది. అంటే సైబర్ నేరాల తీవ్రత ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని స్పష్టమవుతోంది. 2011లో 422 సైబర్ నేరాలు నమోదైతే, 2012లో 601 సైబర్ నేర కేసులు నమోదయ్యాయి. అంటే ఒక్క ఏడాదిలో 42.4 శాతం పెరుగుదల నమోదయిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డబ్బు వ్యవహారాలు ఆన్‌లైన్‌ అయ్యేకొద్దీ, ఆర్థిక నేరాలు తీవ్రమవుతున్నాయి. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం 2021–22 లో రూ.60,414 కోట్ల మేర సైబర్‌ మోసాలు చోటుచేసుకున్నాయి. సైబర్‌ మోసగాళ్ల వల్ల డబ్బు కోల్పోయిన 75శాతం మంది బాధితులకు ఆ సొమ్ము తిరిగి రావడం లేదని ఓ సర్వేలో వెల్లడైంది.

జాతీయ ఇంటర్నెట్ భద్రత విధానం

సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సైబర్ దాడుల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు మౌలిక సదుపాయాలను పరిరక్షించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఇంటర్నెట్ భద్రత విధానం-2013ను రూపొందించి, విడుదల చేసింది. దేశ ఇంటర్నెట్ అస్థిరతను, ఆర్థిక అస్థిరతతో సమానంగా భావిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో కొన్ని లక్షల మంది ఇంటర్నెట్ భద్రతా నిపుణులతో కూడిన సమర్థ సిబ్బంది వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. దేశంలోని వివిధ స్థాయిల్లో సైబర్ భద్రతతకు వాటిల్లే ముప్పును ఎదుర్కొనేందుకు వీలుగా యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని జాతీయ ఇంటర్నెట్ భద్రత విధానం సూచిస్తోంది.

సులభంగా డబ్బు సంపాదన డేంజర్

సైబర్‌ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి, తస్మాత్‌ జాగ్రత్త అని పోలీసులు ప్రజలకు పదేపదే హెచ్చరిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లాటరీలు, రివార్డులు, జాబ్స్‌, కమీషన్లు, డిస్కౌంట్ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ప్రజలకు ఆశచూపి, నిలువునా ముంచుతున్నారు. బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నామని, ఆధార్‌ నంబర్‌ చెప్పండి, మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ చెప్పండి, మీ ఏటీఎం పనిచేయడం లేదని, మీరు కారు గెలుచుకున్నారని, మనీ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచుతామని, ఇలా రకరకాలుగా సైబర్‌ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తూ తెలియకుండానే డబ్బులు కాజేస్తున్నారు.

సైబర్ నేరాల బారిన పడొద్దంటే!

ఆన్‌లైన్‌ మోసాలే కాకుండా సైబర్‌ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రభుత్వం గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్‌లలో విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు వెంటనే 1930 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేసి, వివరాలు తెలియజేస్తే 24 గంటల్లో డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందని పోలీసులు వివరిస్తున్నారు. సైబర్‌ నేరానికి గురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది. మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ఎవరికీ చెప్పొద్దు. గుర్తుతెలియని వ్యక్తులు పంపిన లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్‌ చేయకూడదు. బహుమతులు, లాటరీలు గెల్చుకున్నారంటూ వచ్చే సందేశాలను గుడ్డిగా నమ్మవద్దు. వర్క్‌ ఫ్రం హోం ఉద్యోగం కల్పిస్తామని చెప్పే వారితో జాగ్రత్తగా ఉండాలి. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విషయాలు అప్‌లోడ్‌ చేయకపోవడం ఉత్తమం. అప్పుడే సైబర్ నేరాలు తగ్గి, ఎవరి చేతిలోనూ మోసపోకుండా ఉంటాం.

- మోటె చిరంజీవి,

తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్.

99491 94327


Next Story